పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వత్స బాలకుల రూపు డగుట

  •  
  •  
  •  

10.1-515-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై
ముడిపడ లేచి యెత్తుకొని మూర్కొని తల్లులు గౌగలించుచుం
డిగొనఁ జేపువచ్చి తమన్నుల యందు సుధాసమంబు లై
వెడిలెడి పాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్.

టీకా:

కొడుకుల = కుమారుల; వేణు = పిల్లనగ్రోవులు; నాదములు = ధ్వనులు; గొబ్బునన్ = తటాలున; వీనుల్ = చెవుల; కున్ = కు; ప్రియంబులు = ఇష్టమైనవి; ఐ = అయ్యి; ముడిపడన్ = తగుల్కొనగా; లేచి = లేచినుంచుని; ఎత్తుకొని = ఎత్తుకొని; మూర్కొని = ముద్దుచేసి; తల్లులు = ఆయా తల్లులు; కౌగలించుచున్ = కౌగలించుకొనుచు; జడిగొనన్ = మిక్కిలిగా; చేపు = ఉబికి; వచ్చి = వచ్చిన; తమ = వారి; చన్నుల = స్తన్యముల; అందు = అందు; సుధా = అమృతతో; సమంబులు = సమానమైనవి; ఐ = అయ్యి; వెడలెడి = కారెడి; పాలున్ = పాలను; నిండుకొను = సంపూర్ణమైన; వేడుకన్ = కుతూహలముతో; ఇచ్చిరి = ఇచ్చిరి; తత్ = ఆయా; సుత = బాలుర; ఆళి = సమూహమున; కిన్ = కి.

భావము:

గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీనులవిందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమాన మైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు.