పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వత్స బాలకుల రూపు డగుట

  •  
  •  
  •  

10.1-514-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారి దొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱి గృహంబులం బ్రవేశించి వేణునాదంబులు చేసిన.

టీకా:

ఇట్లు = ఇలా; బాల = పిల్లల; వత్స = దూడల; రూపంబుల్ = ఆకృతుల; తోన్ = తోటి; విహరించుచున్ = మెలగుచు; మందకున్ = బృందావనమున; కున్ = కు; వచ్చి = చేరి; వారివారి = వారివారి; దొడ్లన్ = పెరళ్ళలో; ఆయ్యై = ఆయా; వత్సంబులన్ = దూడలను; ముందరి = మునుపటి; కందువలన్ = చోట్లలో; నిలిపి = ఉంచి; తత్ = ఆయా; బాల = పిల్లల; రూపంబులన్ = ఆకృతులలో; అందఱి = అందరి; గృహంబులన్ = ఇళ్ళలోకి; ప్రవేశించి = వెళ్ళి; వేణు = మురళీ; నాదంబులు = గానములు; చేసినన్ = చేయగా.

భావము:

ఇలా సమస్తమైన బాలురు, లేగలు యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగివచ్చి, వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి, ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్ళల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు.