పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బకాసుర వధ

  •  
  •  
  •  

10.1-451-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పు డా నందనందనుమీఁద వేలుపులు చాలపులుగా నందన మల్లికాది కుసుమవర్షంబులు హర్షంబునం గురియించిరి; దేవవాద్యంబులు మొరసె; రామాది గోపకుమారులు ప్రాణంబులతోఁ గూడిన యింద్రియంబులునుం బోలెఁ గ్రమ్మఱ కృష్ణునిం గని రమ్మని కౌఁగిలించుకొని కృష్ణసహితులయి లేఁగదాఁటుల మరల దాఁటించుకొని మందగమనంబున మంద కరిగిరి; వారలచేత నా వృత్తాంతం బంతయు విని వెఱంగుపడి గోపగోపికాజనంబులు.

టీకా:

అప్పుడు = అప్పుడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నందనందను = బాలకృష్ణుని {నంద నందనుడు – నందుని యొక్క నందనుడు (కొడుకు), కృష్ణుడు}; మీదన్ = పైన; వేలుపులు = దేవతలు; చాలుపులుగాన్ = జల్లులుగా; నందన = నందనవనములోని; మల్లిక = మల్లెలు; ఆది = మున్నగు; కుసుమ = పూల; వర్షంబులున్ = వానలను; హర్షంబునన్ = సంతోషముతో; కురియించిరి = జల్లిరి; దేవ = దేవతా; వాద్యంబులున్ = వాయిద్యములు; మొరసెన్ = మోగినవి; రామ = బలరాముడు; ఆది = మున్నగు; గోపకుమారులు = గొల్లపిల్లలు; ప్రాణంబులన్ = జీవముల; తోన్ = తోటి; కూడిన = కలిగి యున్న; ఇంద్రియంబులునున్ = ఇంద్రియముల; పోలెన్ = వలె; క్రమ్మఱన్ = మరల; కృష్ణునిన్ = బాలకృష్ణుని; కని = కనుగొని; రమ్ము = దగ్గరకు రమ్ము; అని = అని; కౌగలించుకొని = కౌగలించుకొని; కృష్ణ = కృష్ణునితో; సహితులు = కూడినవారు; అయి = ఐ; లేగ = చిన్నదూడల; దాటులన్ = గుంపులను; మరల = మళ్ళీ; దాటించుకొని = తోలుకొని; మందగమనంబున = మెల్లని నడకతో; మందకున్ = పల్లెకు; అరిగిరి = వెళ్ళిరి; వారల = వారి; చేతన్ = వలన; ఆ = ఆ యొక్క; వృత్తాంతంబు = జరిగినది; అంతయున్ = సమస్తమును; విని = విని; వెఱంగుపడి = ఆశ్చర్యపోయి; గోప = యాదవులు; గోపికా = యాదవస్త్రీల; జనంబులు = సమూహములు.

భావము:

అలా బకాసురుని చంపగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలుకూడా ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులు అందరూ బ్రతికిపోయామని సంతోషించారు. “బ్రతికి వచ్చావా కృష్ణా!” అంటూ అతణ్ణి కౌగలించుకున్నారు. అందరూ కలసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసురవధను గురించిన కధ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపగోపికాజనాలు విని నివ్వెరపోయారు.