పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన నేలగూలుట

  •  
  •  
  •  

10.1-238-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నందుండు మొదలయిన గోపకులు మథురనుండి వచ్చి, రక్కసి మేనుఁ గని, వెఱఁగుపడి, “మున్ను వసుదేవుం డుత్పాతంబు లెఱింగి చెప్పె; నతండు మహాయోగి” యని పొగిడి, కఠోరం బగు పూతన యొడలు గుఠారంబుల నఱకి, తమ కుటీరంబులకుం దవ్వగు ప్రదేశంబున పటీరంబుల దహనంబు, సంగ్రహించి దహించి; రంత.

టీకా:

అంతన్ = అప్పుడు; నందుండు = నందుడు; మొదలయిన = మున్నగు; గోపకులు = యాదవులు; మథుర = మథురానగరము; నుండి = నుండి; వచ్చి = వచ్చి; రక్కసి = రాక్షసి యొక్క; మేనున్ = కళేబరమును; కని = చూసి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; మున్ను = ఇంతక్రితము; వసుదేవుండు = వసుదేవుడు; ఉత్పాతంబులున్ = గొప్పఆపదలను; ఎఱింగి = తెలిసికొని; చెప్పెను = హెచ్చరించెను; అతండు = అతను; మహా = గొప్ప; యోగి = ఋషి; అని = అని; పొగిడి = స్తుతించి; కఠోరంబులు = కఠినమైనది; అగు = ఐన; పూతన = పూతన యొక్క; ఒడలున్ = కళేబరమును; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; నఱకి = నరికేసి; తమ = వారి యొక్క; కుటీరంబుల = నివాసముల; కున్ = కు; దవ్వు = దూరముగా ఉండునది; అగు = ఐన; ప్రదేశంబునన్ = చోటు నందు; పటీరంబులన్ = గంధపుచెక్కలతో; దహనంబు = చితిని; సంగ్రహించి = పేర్చి; దహించిరి = కాల్చిరి; అంత = అప్పుడు.

భావము:

అప్పుడు నందుడు మొదలైన యాదవ నాయకులు మధురా నగరం నుండి వచ్చి, ఆ రాకాసి కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు “వసుదేవుడు మహా యోగి కనుక ఈ జరగబోయే ఉత్పాదాలు ముందే ఊహించి చెప్పాడు” అని మెచ్చుకొన్నారు. తరువాత కఠినమైన పూతన కళేబరాన్ని గొడ్డళ్ళతో నరికి ముక్కలు ముక్కలు చేసారు. తమ ఇళ్ళకు దూరంగా చందనం కఱ్ఱలు పేర్చి ఆ కళేబరం ముక్కలు దహనం చేసారు.