పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూతన నేలగూలుట

  •  
  •  
  •  

10.1-235-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప, "నో!
బాలా! ర"మ్మని మూపుఁ జేర్చుకొని, సంస్పర్శించి, యూరార్చుచున్
గోలాంగూలముఁ ద్రిప్పి, గోవురజమున్ గోమూత్రముం జల్లి, త
ద్బాలాంగంబుల గోమయం బలఁది; రా పండ్రెండు నామంబులన్.

టీకా:

నేలన్ = భూమిపైన; కూలిన = పడిపోయిన; దాని = ఆమె యొక్క; పెన్ను = బాగ పెద్ద; ఉరము = వక్షస్థలము; పైన్ = మీద; నిర్భీతిన్ = భయము లేకుండగ; క్రీడింపన్ = ఆడుకొంటుండగా; ఓ = ఓయీ; బాలా = పిల్లవాడా; రమ్ము = రా; అని = అని; మూపున్ = భుజముపై; చేర్చుకొని = ఎత్తుకొని; సంస్పర్శించి = ఒడలు నిమిరి; ఊరార్చుచున్ = ఊరడించుచు; గో = ఆవు యొక్క; లాంగూలమున్ = తోకను; త్రిప్పి = దిగదుడిచి; గోవు = ఆవు యొక్క; రజమున్ = కాలి దుమ్మును; గో = ఆవు యొక్క; మూత్రమున్ = పంచితము (ఉచ్చ); చల్లి = చిలకరించి; తత్ = ఆ; బాల = పిల్లవాని; అంగంబులన్ = ద్వాదశావయవములకు (12) {ద్వాదశావయవములు - 1నుదురు 2మెడ 3రొమ్ము 4బొడ్డు 5-6మూపులు 7-8మోచేతులకీళ్ళు 9-10మణికట్టులు 11-12మోకాళ్ళు}; గో = ఆవు యొక్క; మయంబున్ = పేడను; అలదిరి = రాసిరి; ఆ = ఆ; పండ్రెండు = ద్వాదశ (12); నామంబులన్ = కేశవనామములు.

భావము:

చచ్చి పడి ఉన్న ఆ రాకాసి విశాలమైన వక్షస్థలం మీద చిన్నికృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటున్నాడు. రమ్మని పిలిచి ఎత్తుకున్నారు ఒళ్ళు నిమురుతూ ఓదార్చారు. పీడ వదలిపోడానికి ఆవుతోక పిల్లవాడి చుట్టు తిప్పి దిష్టి తీశారు. గోధూళిని, గోమూత్రాన్ని బాలుని మీద చల్లారు. పన్నెండు నామాలతో పన్నెండు అవయవాలు లోను గోమయము (ఆవుపేడ) పట్టించారు.