పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వసుదేవ నందుల సంభాషణ

  •  
  •  
  •  

10.1-211-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి వసుదేవుండు నందాదులైన వల్లవుల వీడ్కొలిపిన వారలు గొబ్బున వడిగల గిబ్బలం బూనిన శకటంబులు ప్రకటంబులుగ నెక్కి, తమతమ పల్లెల త్రోవలుపట్టి చని; రా నందుండు ప్రతీతంబులైన యుత్పాతంబులు ముందరఁ బొడగని "శౌరి తనతోఁ బలికిన పలుకులు తప్ప"వనుచుఁ దలంచుచుం జనియె; నంత.

టీకా:

అని = అని; పలికి = హెచ్చరించి; వసుదేవుండు = వసుదేవుడు; నంద = నందుడు; ఆదులైన = మొదలైన; వల్లవులన్ = గోపకులను; వీడ్కొలిపినన్ = సెలవియ్యగా; వారలు = వారు; గొబ్బునన్ = వెంటనే; వడి = వేగముగా పోవుటకు; కల = సమర్థము లైన; గిబ్బలన్ = ఎద్దులను; పూనిన = కట్టినట్టి; శకటంబులున్ = బళ్ళను; ప్రకటంబులుగన్ = ప్రసిద్ధముగా; ఎక్కి = అధిరొహించి; తమతమ = వారివారి; పల్లెల = మందల యొక్క; త్రోవలున్ = దారులను; పట్టి = పడి; చనిరి = వెళ్ళిపోయిరి; ఆ = ఆ; నందుండున్ = నందుడుకూడ; ప్రతీతంబులు = ఎరుకపడుచున్నవి; ఐన = అయిన; ఉత్పాతంబులున్ = ఆపద సూచకములను; ముందరన్ = ఎదురుగా; పొడగని = కనుగొని; శౌరి = వసుదేవుడు {శౌరి - శూరుని పుత్రుడు, వసుదేవుడు}; తన = అతని; తోన్ = తోడ; పలికిన్ = హెచ్చరించిన; పలుకులు = మాటలు; తప్పవు = తప్పిపోవుటలేదు; అనుచున్ = అని; తలంచుచున్ = భావించుచు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు.

భావము:

ఇలా చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన గోపకులకు వీడ్కోలు చెప్పి పంపించాడు. వాళ్ళు కూడా త్వరత్వరగా పోయే గిత్తలను పూన్చిన బళ్ళు ఎక్కి తమ తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళిపోయారు. నందుడు తన ఎదురుగా స్పష్టమైన ఉత్పాతాలను చూసాడు. “వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో” అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు.