పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమనంబు

  •  
  •  
  •  

10.1-1739-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని నమస్కరించె; నంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్తప్రకారంబునం బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజనసేనా సమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి, విడియించె; నిట్లు కూడిన రాజుల కెల్లను వయోవీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి, పూజించె; నంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబుఁ జేయుచు.

టీకా:

అని = అని; నమస్కరించెన్ = నమస్కారము చేసెను; అంతన్ = అటుపిమ్మట; రామ = బలరాముడు; కృష్ణులు = శ్రీకృష్ణులు; తన = అతని; కూతు = పుత్రిక; వివాహంబున్ = పెండ్లి; కున్ = కి; వచ్చుట = వచ్చుట; విని = విని; తూర్య = వాయిద్యముల; ఘోషంబు = ధ్వని; తోన్ = తోటి; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; విధ్యుక్త = పద్ధతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పూజించి = గౌరవించి; మధుపర్కంబులు = పెరుగుతో కలిపిన తేనెలు; ఇచ్చి = ఇచ్చి; వివిధ = అనేకరకముల; అంబర = వస్త్రములు; ఆభరణంబులున్ = భూషణములు; మొదలైన = మున్నగు; కానుకలు = బహుమతులు; ఒసంగి = ఇచ్చి; భీష్మకుండు = భీష్మకుడు; బంధు = బంధువుల; జన = సమూహములు; సేనా = సైన్యములతో; సమేతులు = కలిసి ఉన్నవారు; ఐన = అయిన; వారల = వారి; కున్ = కి; తూర్ణంబ = శీఘ్రమే; సకల = ఎల్ల; సంపత్ = వసతులతో; పరిపూర్ణంబులు = నిండినవి; ఐన = అయిన; నివేశంబులు = నివాసములు; కల్పించి = ఏర్పరచి; విడియించి = విడిదులుగా దింపి; ఇట్లు = ఈ విధముగ; కూడిన = చేరిన; రాజులు = రాజులు; కిన్ = కి; ఎల్లను = అందరికి; వయః = వయస్సు; వీర్య = శూరత్వము; బల = సైనికబలములు; విత్తంబులు = ధనములను; ఎట్లట్ల = అనుసరించి; కోరిన = అడిగిన; పదార్థంబులు = వస్తువులు; ఎల్లన్ = అన్నిటిని; ఇప్పించి = సమకూర్చి; పూజించెన్ = గౌరవించెను; అంతన్ = అటుపిమ్మట; విదర్భపురంబు = కుండిననగరము యొక్క {విదర్భపురము - విదర్భదేశపు పట్టణము, కుండిన}; ప్రజలు = పౌరులు; హరి = కృష్ణుని; రాకన్ = వచ్చుటను; విని = తెలిసి; వచ్చి = వచ్చి; చూచి = దర్శనము చేసికొని; నేత్ర = కళ్ళు అనెడి; అంజలులన్ = దోసిళ్ళతో; తదీయ = అతని; వదన = ముఖము అనెడి; కమల = పద్మము యొక్క; మధు = మకరందమును; పానంబుజేయుచు = తాగుతు.

భావము:

ఇలా రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు. .