పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు నీరగుట

  •  
  •  
  •  

10.1-1654-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబులైన వరంబు లడుగు మిచ్చెద మద్భక్తులగు జనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా" రనిన హరికి ముచికుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి యిరువదియెనిమిదవ మహాయుగంబున నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలచి.

టీకా:

వినుము = శ్రద్ధగా వినుము; తొల్లియున్ = ముందునుండి; నీవు = నీవు; నన్నున్ = నన్ను; సేవించిన = కొలిచిన; కతంబునన్ = కారణముచేత; నిన్నున్ = నిన్ను; అనుగ్రహింపన్ = అనుగ్రహించుటకోసము; ఈ = ఈ యొక్క; శైల = కొండ; గుహ = గుహ; కున్ = కు; ఏతెంచితి = వచ్చితిని; అభీష్టంబులు = మిక్కిలి ఇష్టమైనవి అగు; వరంబులున్ = కోరికలుతీరుటను; అడుగుము = కోరుకొనుము; ఇచ్చెదన్ = ఇచ్చెదను; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగు = ఐన; జనులు = వారు; క్రమ్మఱన్ = మరల; శోకంబున్ = దుఃఖము పొందుట; కున్ = కు; అర్హులు = తగినవారు; కారు = కాదు; అనినన్ = అనగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ముచికుందుండు = ముచికుందుడు; నమస్కరించి = నమస్కారము చేసి {నమస్కారము - న మహః (నేను నీకు ఇతరుడను కాను) అని తెలుపుకొను ప్రక్రియ, చేతులు జోడించుటాది}; నారాయణదేవుడు = ఇతనే విష్ణుమూర్తి {నారాయణుడు - నారం విఙ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; అగుటన్ = అయి ఉండుటను; ఎఱింగి = తెలిసికొని; ఇరువదియెనిమిదవ = ఇరవైయెనిమిదవ (28); మహాయుగంబునన్ = మహాయుగమునందు {మహాయుగము - ఒక చతుర్యుగపర్యంత కాలము (1కృతయుగము 1728000, 2త్రేత 1298000, 3ద్వాపర 864000 కలి 432000, మొత్తం 4320000 మానవ సంవత్సరముల కాలమునకు సమానము)}; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణ - శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), నారాయణశబ్ద వాచ్యుడు, విష్ణువు}; అవతరించును = తన అంశతో పుట్టును; అని = అని; మున్ను = ఇంతకు పూర్వము; గర్గుండు = గర్గమహా ఋషి; చెప్పుట = తెలియజెప్పుట; తలచి = జ్ఞప్తితెచ్చుకొని, స్మరించి.

భావము:

పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వతగుహకు వచ్చాను. నీ కిష్టమైన వరాలు అడుగు ఇస్తాను. నా భక్తులైనవారు ఇక శోకం పొందుటకు తగరు.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ముచుకుందుడు నందనందనుడికి నమస్కరించి, అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి ఇరువైయెనిమిదవ మహాయుగంలో భూమిపై విష్ణువు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా అన్నాడు.