పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ద్వారకానగర నిర్మాణము

  •  
  •  
  •  

10.1-1613-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ మనియెడి దేవసభను దేవేంద్రుం డిచ్చెఁ; గర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె; మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబు లను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె; నిజాధికార సిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించి రి వ్విధంబున.
^ కుబేరుని నవ నిధులు

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ యొక్క; పుర = పట్టణములలో; వరంబునన్ = శ్రేష్ఠమైనదాని యందు; హరి = కృష్ణుని; కిన్ = కి; పారిజాత = కల్ప; మహీజంబును = వృక్షమును; సుధర్మ = సుధర్మ; అనియెడి = అనెడి; దేవ = దివ్యమైన; సభను = సింహాసనమును; దేవేంద్రుండు = ఇంద్రుడు; ఇచ్చెన్ = ఇచ్చెను; కర్ణ = చెవులు; ఏక = ఒకే ఒక్క; దేశంబులన్ = చోటులందే; నలుపు = నలుపురంగు; కలిగి = ఉండి; మనః = మనస్సు వంటి; జవంబులును = వేగములు కలిగినవి; శుక్ల = తెల్లటి; వర్ణంబులున్ = రంగు కలవి; ఐన = అయినట్టి; తురంగంబులన్ = గుఱ్ఱములను; వరుణుండు = వరుణదేవుడు; ఒసంగెన్ = ఇచ్చెను; మత్స్య = మత్స్యము; కూర్మ = కూర్మము; పద్మ = పద్మము; మహాపద్మ = మహాపద్మము; శంఖ = శంఖము; ముకుంద = ముకుందము; కచ్ఛప = కచ్ఛపము; నీలంబున్ = నీలములు; అను = అనెడి; ఎనిమిది = ఎనిమిది (8); నిధులన్ = నిధులను {నిధులు - ఎనిమిది చెప్పబడినవి (1మత్స్య 2కూర్మ3పద్మ 4మహాపద్మ 5శంఖము 6ముకుందము 7కచ్ఛపము 8నీలము) తొమ్మిదవది వరము తప్పించి, మరియొక విధమున నవనిధులు అని చెప్పెదరు (1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము (మొసలి) 5కచ్ఛపము (తాబేలు) 6ముకుందము 7కుందము (పంది) 8నీలము 9వరము (ఖర్వము)), మరియొక విధమున నవనిధులు అని చెప్పునవి 1. కాళము 2. మహాకాళము 3. పాండుకము 4. మాణవకము 5. నైసర్పము 6. సర్వరత్నము 7. శంఖము 8. పద్మము 9. పింగళము.}; కుబేరుండు = కుబేరుడు; సమర్పించెన్ = ఇచ్చెను; నిజ = తమతమ; అధికార = అధికారముల; సిద్ధి = సిద్దించుట; కొఱకున్ = కోసము; తక్కిన = మిగిలిన; లోకపాలకులును = దిక్పాలకులు; తొల్లి = మునుపు; తమ = వారి; కున్ = కి; భగవత్ = పరమేశ్వరుని; కరుణా = దయగల; కటాక్ష = దృష్టితో; వీక్షణంబులన్ = చూచుటచేత; సంభవించిన = కలిగిన; సర్వ = సమస్తమైన; సంపదలన్ = సంపదలను; మరల = తిరిగి; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; సమర్పించిరి = ఇచ్చితిరి; ఈ = ఇట్టి; విధమున = విధముగా.

భావము:

మఱియు శ్రేష్ఠమగు ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి పారిజాతవృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపురంగు తక్కిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గుఱ్ఱాలను వరుణుడు ఇచ్చాడు. వరము తప్పించి నవనిధులలోని మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను కుబేరుడు సమర్పించాడు. తక్కిన లోకపాలురు అందరూ తమతమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వలన లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు.