పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మాయ మింటనుండి పలుకుట

  •  
  •  
  •  

10.1-162-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బావా! నీ వచనంబు నిక్కము సుమీ; ప్రాణుల్ గతజ్ఞాను లై
నీవే నంచును లోభ మోహ మద భీ నిర్మిత్రతామోద శో
కావేశంబుల నొండొరుం బొడుతు రేకాకారుఁడై సర్వరూ
పావిష్టుండగు నీశ్వరుం దెలియలే న్యోన్యవిభ్రాంతులై"

టీకా:

బావా = బావా; నీ = నీ యొక్క; వచనంబు = మాట; నిక్కము = నిజమే; సుమీ = సుమా; ప్రాణుల్ = జీవులు; గత = పోయిన; జ్ఞానులు = విజ్ఞానము కలవారు; ఐ = అయ్యి; నీవు = నీవు; ఏను = నేను; అంచునున్ = అనుచు; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; భీ = భీతి; నిర్మిత్రతామోద = స్నేహాంగీకార రాహిత్యము; శోక = దుఃఖము; ఆవేశంబులన్ = ఆవేశములతో; ఒండొరున్ = ఒకరినొకరు; పొడుతురు = చంపెదరు; ఏకాకారుడు = అఖండ స్వరూపుడు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; రూప = రూపముల జీవు లందు; ఆవిష్టుండు = ఉన్నవాడు; అగు = ఐన; ఈశ్వరున్ = భగవంతుని; తెలియ = తెలిసికొన; లేరు = లేరు; అన్యోన్య = ఒకిరిపై నొకరు; విభ్రాంతలు = నమ్మలేనివారు; ఐ = అయ్యి.

భావము:

"బావా! కంసమహారాజా! నీవు చెప్పిన మాట నిజమే సుమా! ప్రాణు లందరు అహంకారంచేత జ్ఞానాన్ని నష్టపోతారు. లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దుఃఖం, ఆవేశం మొదలైనవాటికి లోనై నువ్వా, నేనా అంటు ఒకరినొకరు వధించుకుంటూ ఉంటారు. అంతేగాని, ఉన్నది పరమాత్మ ఒకడే అనీ, అతనే అనేక రూపాలలో ఉంటాడని తెలుసుకోలేక, ఇతరులు వేరు తాము వేరు అనుకుంటూ భ్రాంతిలో పడుతూ ఉంటారు."