పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మాయ మింటనుండి పలుకుట

  •  
  •  
  •  

10.1-161-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి, కన్నీరు నించి, వగచి, వెఱచుచు, దేవకీవసుదేవుల పాదంబులఁ బట్టుకొని, సంకెలలు విప్పించి, మిక్కిలి యక్కఱ గల వాక్యంబుల నైక్యంబులు నెఱపిన, వారును బరితప్తుం డైన కంసునిఁ జూచి, రోషంబును బాసి; రంత నా వసుదేవుండు బావ కిట్లనియె.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; కన్నీరు = కన్నీటిని; నించి = కార్చి; వగచి = విచారించి; వెఱచుచున్ = బెదురుతూ; దేవకీ = దేవకి; వసుదేవుల = వసుదేవుల యొక్క; పాదంబులన్ = కాళ్ళు; పట్టుకొని = పట్టుకొని; సంకెలలన్ = సంకెళ్ళను; విప్పించి = ఊడదీయించి; మిక్కిలి = అధికమైన; అక్కఱ = ప్రీతి; కల = కలిగిన; వాక్యంబులన్ = మాటలతో; ఐక్యంబులు = దగ్గరి తనములు; నెఱపినన్ = నడపగా; వారును = వారు; పరి = మిక్కిలి; తప్తుండు = పశ్చాత్తాపము పడువాడు; ఐన = అయినట్టి; కంసునిన్ = కంసుని; చూచి = కనుగొని, ఉద్దేశించి; రోషంబునున్ = కోపమును; పాసిరి = విడిచి పెట్టారు; అంతన్ = అంతట; ఆ = ఆ; వసుదేవుండు = వసుదేవుడు; బావ = భార్యకి అన్న; కిన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

కంసుడు ఇలా పలికి, దుఃఖించి, కన్నీరు పెట్టుకున్నాడు. బెదురు బెదురుగా దేవకీవసుదేవుల కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు. వారి సంకెళ్ళు ఊడదీయించాడు. చాలా ప్రేమ కురిసే మాటలతో ఐకమత్యాలు చూపించాడు. వారు కూడ పశ్చాత్తాపం పడుతున్న కంసుని చూసి శాంతించారు. అప్పుడు వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు.