పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మాయ మింటనుండి పలుకుట

  •  
  •  
  •  

10.1-157-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నాబోటి పలికిన కలికి పలుకులు ములుకులై, చెవులఁ జిలికిన, నులికిపడి, జళుకు గదిరిన మనంబున, ఘనంబుగ వెఱఁగంది, కంది, కుందెడు దేవకీవసుదేవుల రావించి, యాదరంబున సంభావించి, చేరి, వారితో నిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; బోటి = ఆమె; పలికిన = చెప్పిన; కలికి = చతురమైన; పలుకులు = మాటలు; ములుకులు = బాణములు; ఐ = అయ్యి; చెవులన్ = చెవుల యందు; చిలికినన్ = సోకగా; ఉలికిపడి = అదిరిపోయి; జళుకు = దిగులు; కదిరిన = పుట్టిన; మనంబునన్ = మనసుతో; ఘనంబుగా = మిక్కిలి అధికముగా; వెఱగంది = బెదిరిపోయి; కంది = సంతాపించి; కుందెడు = దుఃఖించెడి; దేవకీ = దేవకి; వసుదేవులన్ = వసుదేవులను; రావించి = పిలిపించి; ఆదరంబునన్ = ఆత్మీయతతో; సంభావించి = మన్నించి; చేరి = దగ్గరకుపోయి; వారి = వారల; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అప్పుడు ఆ యోగమాయ పలుకులు బాణాలై చెవులో దూరి కలతపెట్టాయి. అతడు ఉలిక్కిపడ్డాడు. చెదరిన మనస్సుతో బాగా భయపడ్డాడు. దుఃఖంతో కుంగిపోతున్న దేవకీవసుదేవులను పిలిపించి, ఆదరించి, గౌరవించాడు. దగ్గరకు చేరి వారితో ఇలా అన్నాడు.