పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు పొగడుట

  •  
  •  
  •  

10.1-1507-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్
నీ పాదంబులు గంటి నిన్నెఱిఁగితిన్ నీవుం గృపాళుండవై
నాపై నర్మిలిఁజేసి మాన్పఁ గదవే నానా ధనాగార కాం
తా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాతచింతామణీ!"

టీకా:

ఏ = ఏ; పుణ్య = పూర్వజన్మ పుణ్యముల; అతిశయ = గొప్పదనము యొక్క; ప్రభావముననో = మహిమవలననో; ఈ = ఈ యొక్క; జన్మము = జన్మ; అందున్ = లో; ఇక్కడన్ = ఇచ్చట; నీ = నీ యొక్క; పాదంబులున్ = పాదములను; కంటిన్ = చూడగలిగితిని; నిన్నున్ = నిన్ను; ఎఱిగితిని = తెలిసికొంటిని; నీవున్ = నీవు; కృపా = దయాగల; అళుండవు = శీలము కలవాడవు; ఐ = అయ్యి; నా = నా; పైన్ = మీద; అర్మిలిన్ = కృప; చేసి = చూపి; మాన్పగదవే = పోగొట్టుము; నానా = వివిధములైన; ధన = సంపదలు; ఆగార = ఇండ్లు; కాంతా = స్త్రీలు; పుత్రా = కుమారుల; ఆదుల = మున్నగువాని; తోడి = తోటి; బంధనమున్ = తగులమును; భక్తవ్రాతచింతామణీ = శ్రీకృష్ణా {భక్త వ్రాత చింతామణి - అనన్య భక్తుల సమూహమునకు చింతామణి (తలచిన కోరికలు తీర్చెడి మణి) వంటివాడు, విష్ణువు}.

భావము:

భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణా! ఏ మహా పుణ్య మహిమ వలననో ఈ జన్మలో ఇక్కడ నీ పాదపద్మాలు దర్శించగలిగాను; నిన్ను తెలుసుకోగలిగాను. నీవు దయాస్వభావుడవై నా పై ఆపేక్ష చూపి; విత్త, గృహ, దార, సుతాదుల మీద నాకు మోహ పాశమును తొలగించు”