పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సుదాముని మాలలు గైకొనుట

  •  
  •  
  •  

10.1-1267-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారు గృహంబునకుం జనిన; నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన నర్ఘ్య పాద్యాదికంబు లాచరించి; సానుచరు లయిన వారలకుఁ దాంబూల కుసుమ గంధంబు లొసంగి యిట్లనియె.

టీకా:

అంతన్ = తరువాత; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; సుదాముండు = సుదాముడు {సుదాముడు - సు (మంచి) దామములు (దండలు) వాడు, మాలాకారుడు}; అను = అనెడి; మాలాకారు = పువ్వులు కట్టువాని; గృహంబున్ = నివాసమున; కున్ = కు; చనిన = వెళ్ళగా; అతండు = అతను; కని = చూసి; లేచి = లేచి నిలబడి; గ్రక్కున = చటుక్కున; మ్రొక్కి = నమస్కరించి; చక్కనన్ = వెంటనే; అర్ఘ్య = అర్ఘ్యమిచ్చుట {అర్ఘ్యము - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు (1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భ 8పుష్పము)}; పాద్య = పాద్య మిచ్చుట {పాద్యము - పాదముల కొఱకైనది, జలాదులు}; ఆది = మున్నగునవి; ఆచరించి = చేసి; సానుచరులు = అనుచరులతో కూడినవారు; అయిన = ఐన; వారలు = వారి; కున్ = కి; తాంబూల = తాంబూలము; కుసుమ = పూలు; గంధంబులు = మంచిగంధములు; ఒసంగి = ఇచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ తరువాత, రామకృష్ణులు పూలదండలు కట్టే సుదాముడి ఇంటికి వెళ్ళారు. అతడు వారిని చూసి వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా ఆర్ఘ్యము, పాద్యము, మొదలైన విధులతో సత్కరించాడు. రామకృష్ణులకూ, వారి వెంట వచ్చినవారికీ తాంబూలములు, పూలు, గంధములు ఇచ్చి ఇలా అన్నాడు,