పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుని దివ్యదర్శనములు

  •  
  •  
  •  

10.1-1231-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిం దుదిం గ్రమ్మఱం
గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ ల్యాణచారిత్రు లే
వెంటం దోఁచిరి రెండు దిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో
నుం టాశ్చర్యము; చూతు" నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై.

టీకా:

కంటిన్ = చూసితిని; మున్ను = ఇంతకుముందే; రథంబు = రథము; పైన్ = మీద; జలము = నీటి; లోన్ = అందు; కంటిన్ = చూసితిన్; తుదిన్ = చివరగా; క్రమ్మఱన్ = మరల; కంటిన్ = చూసితిని; తొంటి = మునుపటి; రథంబు = రథము; మీఁదన్ = పైన; ఇదె = ఇదిగో; ఈ = ఈ యొక్క; కల్యాణ = శుభకరమైన; చారిత్రులు = నడవడికలు కలవారు; ఏ = ఏ; వెంటన్ = విధముగ; తోచిరి = కనబడిరి; రెండు = రెండు (2); దిక్కులన్ = చోటు లందు; మనస్ = మనసు నందు కలిగిన; విభ్రాంతియో = కలవరమా ఏమి; నీటి = జలముల; లోన్ = లోపల; ఉంట = ఉండుట; ఆశ్చర్యము = వింత యైన విషయము; చూతును = పరిశీలించెదను; అంచున్ = అని; మఱియున్ = మరీమరీ; ఊహించి = భావించి; మగ్నాంగుడు = నీటిలో మునిగినవాడు {మగ్నాంగుడు - మునిగినదేహము కలవాడు, నీటిలో మునిగిన వాడు}; ఐ = అయ్యి.

భావము:

“ముందు రథంలో చూసాను. తరువాత నీటిలో వీక్షించాను. మళ్ళీ వారు ముందటి లాగే రథం మీదనే ఉండడం దర్శించాను. మంగళ స్వరూప గుణులైన రామకృష్ణులు ఎలా ఇక్కడ అక్కడా రెండు చోట్లా కనపడ్డారు. నా మనస్సు ఏమైనా భ్రమ పడిందా? నీళ్ళలో వీళ్ళుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి చూస్తాను” అని తలంచి, తిరిగి నదీజలాలలో మునిగాడు.