పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు మథురకు చనుట

  •  
  •  
  •  

10.1-1224-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత మఱునాడు సూర్యోదయకాలంబునం దనతోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను “మరలివత్తు” నని దూతికా ముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానుకలును గోరసంబు నిడికొని నందాదులైన గోపకులు వెనుదగుల నక్రూరచోదితంబైన రథంబెక్కి మథురాభిముఖుండై చను సమయంబున.

టీకా:

అంతన్ = అటుపిమ్మట; మఱునాడు = మరుసటిరోజు; సూర్యోదయ = ఉదయపు; కాలంబునన్ = సమయము; తన = తన; తోడన్ = తోటి; పయనంబున్ = బయలుదేరుట; కున్ = కు; గమకించి = యత్నించి; నడచు = బయలుదేరు; గోపికలను = గొల్లభామలను; మరలివత్తును = తిరిగివచ్చెదను; అని = అని; దూతికా = దూతికల; ముఖంబునన్ = వలన; నివర్తించి = నిలువరించి; కృష్ణుండు = కృష్ణుడు; శకటంబుల్ = బళ్ళ; అందున్ = లో; కానుకలు = బహుమతులు; గోరసంబున్ = పాలును; ఇడికొని = ఉంచుకొని; నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; ఐన = అయిన; గోపకులున్ = గొల్లవారు; వెనుదగులన్ = వెంటరాగా; అక్రూర = అక్రూరునిచేత; చోదితంబు = నడపబడుతున్నది; ఐన = అయిన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; మథురా = మథురాపట్టణము; అభిముఖుండు = వైపునకు పోవువాడు; ఐ = అయ్యి; చను = వెళ్ళడి; సమయంబున = సమయము నందు.

భావము:

శ్రీకృష్ణుడు మరునాటి ఉదయం తన వెంట వస్తామని సిద్ధపడుతున్న గోపికాస్త్రీలకు “మళ్ళీ వస్తా” నని దూతికల ద్వారా చెప్పించి, వారిని వెనుకకు మరలించాడు. బండ్ల నిండా కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మున్నగు వాటిని ఎక్కించుకుని నందుడు మొదలుగా గల గోపకులు కూడా వస్తుండగా అక్రూరుడు తోలే రథం ఎక్కి శ్రీకృష్ణుడు మథురానగరం వైపు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు. . .