పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసు డక్రూరునితో మాట్లాడుట

  •  
  •  
  •  

10.1-1162-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చాణూరుండును ముష్టికుండును సభాసంఖ్యాతమల్లుల్ జగ
త్ప్రాణున్ మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామపా
రీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే?
క్షీప్రాణులఁ జేసి చూపుదురు సంసిద్ధంబు యుద్ధంబునన్.

టీకా:

చాణూరుండును = చాణూరుడు; ముష్టికుండును = ముష్టికుడు; సభా = (మల్ల) సంఘమునందు; సంఖ్యాత = ఎంచదగిన; మల్లుల్ = మల్లయోధులు; జగత్ప్రాణున్ = వాయుదేవుని {జగత్ప్రాణుడు -సర్వలోకములకు ప్రాణము రూపమున ఉండువాడు, వాయువు}; మెచ్చరు = లక్ష్యపెట్టరు; సత్వ = బలము; సంపదలన్ = కలిగి ఉండుటలో; బాహాబాహి = మల్ల; సంగ్రామ = యుద్ధము నందు; పారీణుల్ = మిక్కిలి నేర్పరులు; వారలు = వారు; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; బల = బలము యొక్క; ఉద్రేకంబున్ = అతిశయమును; సైరింతురే = ఓర్చుదురా; క్షీణ = కృశించిన; ప్రాణులన్ = ప్రాణములు కలవారినిగ; చేసి = చేసి; చూపుదురు = కలబరచెదరు; సంసిద్ధంబు = తప్పక; యుద్ధంబునన్ = పోరులో.

భావము:

చాణూరుడు, ముష్టికుడు మల్లుర సమూహంలో గణింపదగిన యోధులు. కుస్తీపట్టుటలో వారు వాయుదేవుడిని సైతం లక్ష్యపెట్టరు. శక్తి సామర్థ్యాలతో మల్లయుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరులు. వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని ఏమాత్రం సహించరు. పోరాటంలో వారి ప్రాణాలుతోడి తెగటారుస్తారు. ఇది ముమ్మాటికీ నిజం.