పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వృషభాసుర వధ

  •  
  •  
  •  

10.1-1148-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వృషభాసురుం జంపిన నిలింపులు గుంపులుగొని విరులు వర్షింప గోపకులు హర్షింప గోపసతు లుత్కర్షింప బలభద్రుండును దానును గోవిందుండును బరమానందంబున మందకుం జని; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వృషభాసురున్ = వృషభాసురుని; చంపినన్ = సంహరించగా; నిలింపులు = దేవతలు; గుంపులుగొని = గుంపులుకట్టి; విరులన్ = పూలను; వర్షింపన్ = కురిపించగా; గోపకులు = గోపాలకులు; హర్షింపన్ = సంతోషించగా; గోపసతులు = గోపికాస్త్రీలు; ఉత్కర్షింపన్ = స్తుతించగా; బలభద్రుండును = బలరాముడు; తానును = అతను; గోవిందుండును = కృష్ణుడు; పరమ = మిక్కిలి; ఆనందంబునన్ = సంతోషముతో; మంద = గొల్లపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి.

భావము:

ఈవిధంగా వృషభాసురుడిని సంహరించగానే దేవతలు గుంపులు కట్టి గోపాలునిపై పూలు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపాంగనలు ఉప్పొంగి పోయారు. గోవిందుడు బలరాముడితో కూడి మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళిపోయాడు.