పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వృషభాసుర వధ

  •  
  •  
  •  

10.1-1141-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలుర నింతులం బసులఁ బాఱఁగఁ దోలుట బంటుపంతమే
చాలు; వృషాసురేంద్ర! బలసంపదఁ జూపఁగ నెల్లఁబాడి గో
పాలురమందఁ గాదు; చను పైఁబడితేని ప్రచండ కృష్ణశా
ర్దూము నేడు నీ గళము ద్రుంపక చంపక పోవనిచ్చునే?"

టీకా:

బాలురన్ = పిల్లలను; ఇంతులన్ = స్త్రీలను; పసులన్ = పశువులను; పాఱగన్ = పారిపోవునట్లు; తోలుట = తరుముట; బంటు = శూరుని యొక్క; పంతమే = ఒక పౌరుషమా, కాదు; చాలు = ఇక చాలులే; వృష = వృషభరూప; అసుర = రాక్షస; ఇంద్ర = ప్రభువా; బలసంపద = మిక్కిలి బలము; చూపగన్ = చూపుటకు; ఎల్లన్ = అంతా, ఎంత మాత్రమూ; పాడి = తగినది; గోపాలుర = గోపాలకుల; మంద = సమూహము; కాదు = కాదు; చనున్ = తగినది; పైబడితేని = మీదపడ గలిగితే; ప్రచండ = మిక్కిలి భీకరమైన; కృష్ణ = కృష్ణుడు అనెడి; శార్దూలము = పెద్దపులి; నేడు = ఇవాళ; నీ = నీ యొక్క; గళమున్ = కంఠమును; త్రుంపక = ఖండిపకుండ; చంపక = చంపకుండా; పోవనిచ్చునే = వెళ్ళనిచ్చునా, వెళ్ళనివ్వదు.

భావము:

“ఓరీ! వృషభాసురా! పిల్లలను, ఆడవాళ్ళను పశువులను బెదరగొట్టడం పరాక్రమం కాదు. నీ ప్రతాపాలు ఇక చాలించు. నీ బలం చూపించి గోపగోపీజనాన్ని భయపెట్టడం పౌరుషం అనిపించుకోదు వెళ్ళిపో. లేదా చేతనైతే నా పైకి రా. వచ్చావా, ఈ కృష్ణుడనే భయంకరమైన బెబ్బులి నీ కంఠం ఖండించకుండా, నిన్ను చంపకుండా విడచిపెట్టదు సుమా!”