పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సర్పరూపి శాపవిమోచనము

  •  
  •  
  •  

10.1-1113-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొక్కనాడు నందాదులైన గోపకు లంబికావనంబునకు శకటంబు లెక్కి జాతరకుం జని సరస్వతీనదీజలంబుల స్నానంబులు చేసి, యుమామహేశ్వరుల నర్చించి కానికలిచ్చి బ్రాహ్మణులకు గో హిరణ్య వస్త్రాన్న దానంబు లొసంగి, జలప్రాశనంబు చేసి, నియమంబున నుండ దైవయోగంబున నాఁకొని యొక్క మహోరగంబు నిదురబోయిన నందునిం గఱచి మ్రింగ నగ్గలింప నతఁడు "కృష్ణకృష్ణేతి" వచనంబులం దన్ను విడిపింపు మని మొఱయిడిన విని.

టీకా:

అంతన్ = ఆ తరువాత; ఒక్కనాడు = ఒక రోజున; నంద = నందుడు; ఆదులు = మొదలగువారు; ఐన = అయిన; గోపకులు = యాదవులు; అంబికా = అంబిక అనెడి; వనంబున్ = అడవి; కున్ = కి; శకటంబులు = బళ్ళు; ఎక్కి = ఎక్కి; జాతర = ఉత్సవము చేసికొనుట; కున్ = కు; చని = వెళ్ళి; సరస్వతీ = సరస్వతి అనెడి; నదీ = నది యొక్క; జలంబులన్ = నీటి యందు; స్నానంబులు = స్నానములు; చేసి = చేసికొని; ఉమామహేశ్వరులన్ = పార్వతీపరమేశ్వరులను; అర్చించి = పూజించి; కానికలు = కానుకలు, దక్షిణలు; ఇచ్చి = చెల్లించి; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; వస్త్ర = బట్టలు; అన్న = అన్నములను; దానంబులు = దానములుగా; ఒసంగి = ఇచ్చి; జలప్రాశనంబు = ఉపవాసవిశేషము {జలప్రాశనంబు - నీరుమాత్రమే ఆహారముగా తీసుకొని ఉపవాసముండుట}; చేసి = చేసి; నియమంబునన్ = వ్రతనిష్ఠలో; ఉండన్ = ఉండగా; దైవయోగంబున = దైవికముగా; ఆకొని = ఆకలివేసి; ఒక్క = ఒకానొక; మహా = పెద్ద; ఉరగంబు = పాము; నిదురబోయిన = నిద్రపోతున్న; నందునిన్ = నందుడిని; కఱచి = కరిచి; మ్రింగన్ = మింగివేయుటకు; అగ్గలింపన్ = ప్రయత్నించుచుండగా; అతడు = అతను; కృష్ణకృష్ణ = కృష్ణా కృష్ణా; ఇతి = అనెడి; వచనంబులన్ = మాటలతో; తన్ను = తనను; విడిపింపుము = విడిపించుము; అని = అని; మొఱయిడినన్ = మొరపెట్టగా; విని = విని.

భావము:

అటుపిమ్మట ఒక రోజు నందుడు మొదలగు యాదవులు పశుపతి జాతర కోసం ఎడ్లబండ్లు ఎక్కి అంబికావనానికి వెళ్ళారు. వారక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీపరమేశ్వరులను పూజించి, కానుకలు అర్పించారు. విప్రులకు గోవులు, బంగారము, వస్త్రాలు, అన్నమూ దానాలు చేసారు. తాము నీరు మాత్రమే పుచ్చుకుని నియమంతో ఉన్నారు. అప్పుడు ఆకలితో ఉన్న ఒక మహాసర్పం దైవికంగా నిద్రపోతున్న నందుణ్ణి చుట్టిపట్టి మ్రింగడానికి ప్రయత్నించింది. అతడు “కృష్ణా! కృష్ణా! నన్ను విడిపించు” అని మొరపెట్టుకున్నాడు. ఆయన ఆక్రందనలు గోపకులు అందరూ విన్నారు.