దశమ స్కంధము - పూర్వ : పాషాణ సలిల వర్షంబు
- ఉపకరణాలు:
"పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి, భువి నాభీరుల్ మదాభీరులై
గిరిసంఘాత కఠోరపత్రదళనక్రీడా సమారంభ దు
ర్భర దంభోళిధరుం బురందరు ననుం బాటించి పూజింప క
గ్గిరికిం బూజలు చేసి పోయి రిదిగో కృష్ణుండు ప్రేరేఁపఁగన్.
టీకా:
పెరుగుల్ = పెరుగులు {పెరుగు - పాలు తోడుకొనుటచే ఏర్పడును}; నేతులున్ = నెయ్యి లను; త్రావి = తాగి; క్రొవ్వి = మదించి, కొవ్వెక్కి; భువిన్ = భూలోకము నందు; ఆభీరుల్ = గొల్లవాళ్ళు; మద, మత్ = గర్వముచేత, నా ఎడల; అభీరులు = భయము లేనివారు; ఐ = అయ్యి; గిరి = పర్వత; సంఘాత = సమూహముల యొక్క; కఠోర = కఠినమైన; పత్ర = రెక్కలను; దళన = ఖండించు, తెగగొట్టు; క్రీడా = ఆట యందు; సమారంభ = ఆటోపము కలిగిన; దుర్భర = భరింపరాని; దంభోళి = వజ్రాయుధము; ధరున్ = ధరించెవాడను; పురన్ = శత్రువుల పట్టణములను; తరున్ = భేదించువాడను; ననున్ = నన్ను; పాటించి = ఆదరించి; పూజింపక = పూజించకుండా; ఆ = ఆ యొక్క; గిరి = కొండ; కిన్ = కి; పూజలు = పూజలు; చేసి = చేసి; పోయిరి = వెళ్ళిపోయిరి; ఇదిగో = ఇప్పుడే; కృష్ణుండు = కృష్ణుడు; ప్రేరేపగన్ = రెచ్చగొట్టగా.
భావము:
“పెరుగులు నేతులు ద్రావి క్రొవ్వెక్కి పొగరెక్కిన గొల్లలు జంకుగొంకులు లేకుండా పర్వతపంక్తుల కర్కశపు ఱెక్కలు అవలీలగా ముక్కలు చేసే అమోఘ వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను, సగౌరవంగా పూజించకుండా కృష్ణుడు ప్రోత్సహిస్తే కొండకు పూజలు చేసి వెళ్ళిపోయారు.