పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పాషాణ సలిల వర్షంబు

  •  
  •  
  •  

10.1-899-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పర్వతప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవసమేతులై మందకుం జని; రంత మహేంద్రుం డంతయు నెఱింగి మహాకోపంబునఁ బ్రళయ ప్రవర్తకంబు లగు సంవర్తకాది మేఘంబులం జీఱి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పర్వత = కొండకు; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు; చేసి = చేసి; గోపకులు = యాదవులు; మాధవ = కృష్ణునితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; మంద = వ్రేపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; అంత = అప్పుడు; మహేంద్రుండు = దేవేంద్రుడు; అంతయున్ = సమాచార మంతా; ఎఱింగి = తెలిసి; మహా = మిక్కిలి అధికమైన; కోపంబునన్ = కోపముతో; ప్రళయ = ప్రళయమును; ప్రవర్తకంబులు = కలిగించెడివి; అగు = ఐన; సంవర్తక = సంవర్తకము {సంవర్తకాది, నవమేఘములు - 1సంవర్తకము 2ఆవర్తకము 3పుష్కరము 4ద్రోణము 5కాలము 6నీలము 7అరుణము 8తమస్సు 9వారుణము అనెడి మేఘములు}; ఆది = మున్నగు; మేఘంబులన్ = మేఘములను; చీఱి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా గిరిప్రదక్షిణలు చేసిన గోపాలురు కృష్ణుడితో పల్లెకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు జరిగిన దంతా తెలిసి, మిక్కిలి కుపితుడై ప్రళయ భయంకరమైన సంవర్తకము లనే మేఘ సమూహాలను పిలిచి ఇలా అన్నాడు.