పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు

  •  
  •  
  •  

10.1-859-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని గోవింద సందర్శన కుతూహలలై ధరణీసుర సుందరులు సంభ్రమానందంబులు డెందంబుల సందడింప, భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయ భేదంబులుం గలిగి, సంస్కార సంపన్నంబులైన యన్నంబులు కుంభంబుల నిడికొని సంరంభంబున సముద్రంబునకు నడచు నదుల తెఱంగున.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; గోవింద = కృష్ణుని; సందర్శన = చూడవలెనని; కుతూహలలు = కుతూహలము కలవారు; ఐ = అయ్యి; ధరణీసుర = విప్ర; సుందరులు = అందగత్తెలు, స్త్రీలు; సంభ్రమ = తొట్రుపాటు; ఆనందంబులున్ = సంతోషములు; డెందంబులన్ = మనసు లందు; సందడింపన్ = అతిశయింపగా; భక్ష్య = కొరికి తిన గలిగినవి {పంచభక్ష్యములు - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి) 4చోష్యము (జుఱ్ఱుకో దగినవి) 5పానీయము (తాగ గలిగినవి) ఐన ఆహార పదార్థములు}; భోజ్య = పిడుచగా తిన గలిగినవి; లేహ్య = నాకి చప్పరించ గలవి; చోష్య = జుఱ్ఱుకో దగినవి; పానీయ = తాగ గలిగినవి అను; భేదంబులున్ = రకములై; కలిగి = ఉండి; సంస్కార = పరిశుద్ధత అనెడి; సంపన్నంబులు = సంపత్తి కలగిన; అన్నంబులున్ = ఆహారపదార్థములను; కుంభంబులన్ = కుండలలో; ఇడికొని = పెట్టుకొని; సంరంభంబున = వేగిరపాటుతో; సముద్రంబు = కడలి; కున్ = కు; నడచు = పారెడి; నదుల = నదులు; తెఱంగునన్ = వలె.

భావము:

గోపబాలకుల మాటలు వింటూనే దేవకీనందనుడైన కృష్ణుడిని సందర్శించాలని ఆ స్త్రీలు ఉబలాటపడ్డారు. హృదయాలలో సంబరమూ, సంతోషమూ చెలరేగగా భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయములు అనే పంచభక్ష్యములైన పంచవిధాహారాలు; పక్వంగా వండిన అన్నమూ; కుండలలో పాత్రలలో నింపుకున్నారు. సాగరుణ్ణి చేరడానికి వెళ్ళే నదీమతల్లుల వలె వేగంగా బయలుదేరారు.