పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల యెడ ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

10.1-857-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత గోపకులు నిరాశులై వచ్చి యెఱింగించిన హరి లౌకికానుసారి యగుచు “మీ ర య్యార్యుల నడుగక, వారి భార్యలకు మారాకఁ జెప్పుఁ; డన్నంబు పెట్టుదు” రని పంచిన వారు చని బ్రాహ్మణసతుల దర్శించి నమస్కరించి సంపూజితులై యిట్లనిరి.

టీకా:

అంతన్ = అంతట; గోపకులు = గొల్లవారు; నిరాశులు = నిరాశ చెందినవారు; ఐ = అయ్యి; వచ్చి = వెనుకకు వచ్చి; ఎఱింగించినన్ = తెలుపగా; హరి = కృష్ణుడు; లౌకిక = లోకరీతి; అనుసారి = అనుసరించువాడు; అగుచున్ = అగుచు; మీరు = మీరు; ఆ = ఆ యొక్క; ఆర్యులన్ = బ్రాహ్మణులను; అడుగక = అడుగకుండా; వారి = వారి యొక్క; భార్యల్ = సతుల; కున్ = కు; మా = మేము; రాకన్ = వచ్చుటను; చెప్పుడు = చెప్పండి; అన్నంబున్ = భోజనము; పెట్టుదురు = ఇచ్చెదరు; అని = అని; పంచినన్ = పంపగా; వారు = వారు; చని = వెళ్ళి; బ్రాహ్మణ = విప్ర; సతులన్ = భార్యలను; దర్శించి = చూసి; నమస్కరించి = మ్రొక్కి; సత్ = చక్కగా; పూజితులు = గౌరవింపబడినవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అప్పుడు గోపబాలకులు నిరాశతో మరలివచ్చి శ్రీ కృష్ణుడికి విషయం వివరించారు. గోవిందుడు లోకవ్యవహారం అనుసరిస్తూ వారితో “మీరు మళ్ళీ ఆ పెద్దలను అడగకండి. వారి పత్నులకు రామకృష్ణులు ఈ వనానికి ఏతెంచారు అని చెప్పండి. అన్నం పెడతారు వెళ్ళండి.” అని మళ్ళీ గొల్లపిల్లలను పంపాడు. వారు యజ్ఞవాటికకి వచ్చి బ్రాహ్మణ స్త్రీలను దర్శించి నమస్కరించారు. తమను ఎంతో సంతోషంతో ఆదరించిన ఆ ఇల్లాండ్రతొ గొల్లపిల్లలు ఇలా అన్నారు.