పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మాదుల స్తుతి

  •  
  •  
  •  

10.1-88-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అ య్యవసరంబున ననుచరసమేతులైన దేవతలును, నారదాది మునులునుం గూడ నడువ నలువయును, ముక్కంటియు నక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబున నర్భకుండై యున్న పురుషోత్తము నిట్లని స్తుతియించిరి.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; అనుచర = పరివారముతో; సమేతులు = కూడినవారు; ఐనన్ = అయినట్టి; దేవతలునున్ = దేవతలు; నారద = నారదుడు; ఆది = మున్నగు; మునులునున్ = ఋషులు; కూడనడువ = వెంటరాగా; నలువయునున్ = చతుర్ముఖబ్రహ్మ {నలువ - నలు (నాలుగు, 4) వ (ముఖముల వాడు), బ్రహ్మ}; ముక్కంటియున్ = పరమశివుడు {ముక్కంటి - మూడు కన్నులు కలవాడు, శివుడు}; అక్కడ = ఆ స్థలమున; కున్ = కు; వచ్చి = వచ్చి; దేవకీ = దేవకి అనెడి; దేవి = ఉత్తమురాలి; గర్భంబునన్ = కడుపులో ఉన్న; అర్భకుండు = పిల్లవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమునిన్ = విష్ణుమూర్తిని; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించిరి = కీర్తించిరి.

భావము:

మధురలో పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమ శివుడు అనుచరులు, దేవతలు, నారదాది మునులు వెంటరాగా దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈవిధంగా స్తోత్రం చేసారు.