ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట
- ఉపకరణాలు:
""మన సారథి, మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుఁడున్,
మన విభుడు, గురుడు, దేవర,
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!
టీకా:
మన = మన యొక్క; సారథి = మార్గదర్శకుడు, రథసారథి; మన = మనకు; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; మన = మన యొక్క; వియ్యము = వియ్యంకుడు; మన = మనకు; సఖుండు = స్నేహితుడు; మన = మనకు; భాంధవుఁడున్ = బంధువు; మన = మన యొక్క; విభుడు = వైభవమునకు కారకుడును; గురుడు = పెద్ద; దేవర = దేవతా స్వరూపుడును; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; చనియెన్ = వెళ్ళిపోయాడు; మనుజాధీశా = రాజా {మనుజాధీశుడు - మనుజులకు అధీశుడు, రాజు.}.
భావము:
""ఏం చెప్పమంటారు మహారాజా! మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడునీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేన బావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు ఐన కృష్ణుడు మనలని వదలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా”