బాల ద్విపద భాగవతం : భాగం-6-301-400
శౌనకాది మహర్షులు సూతునితో వ్యాసుఁడు వేదములను లోకమందే రీతిగా వెలియించెనో తెల్పు డని కోరుట
301
అనివల్కుటయు శౌనకాదులా సూతుఁ
గనుఁగొని “యో మహాగమమార్గనిపుణ!
వేదంబు లేగతి వెలయించె వ్యాసు
లాదరంబునఁ దెల్పుమామాకు” ననిన
ఆరౌమహర్షణి హర్షంబు తోడ
నారమ్యమతులతో నప్పు డిట్లనియె
“కమలజుం డాత్మ ముఖముల నాల్గింటఁ
గ్రమముతో శ్రుతి చతుష్కంబుఁ బుట్టించి
ఆవేదములఁ దనయశ్రేణి చేత
సావితో జదివించె సహ లక్షణముగ;
అదన వారును నల్వయానతిం జేసి
చదివించి రాత్మ శిష్యశ్రేణి చేత
బహుకాల మీగతి బహు పాఠగతుల
రహికెక్కి నడచె నారభటి నా శ్రుతులు;
ద్వాపరంబునఁ జదువఁగఁజాలు వార
లేపుమై ధర జనియింపమి కతన
ఆరీతిఁ జాగక యచ్చట నచట
నూరక చిక్కులై యుండె వేదములు;
ఆవేదముల చిక్కులన్నియు దీర్చు
భావంబుచే రమాభర్త యవ్వేళ
311
సత్యవతీ పరాశరులకుం బుట్టి
సత్యసంధత వ్యాససంజ్ఞచే నలరె;
అమ్మౌని నిగమాబ్ధియందు శోధించి
యిమ్మేటి నాల్గు సంహితలు నేర్పరచె;
ఆదిఋగ్వేదంబు నాతండు పైలు
నాదర సంయుతుఁడైచదివించె;
కడుఁజిత్రమగు యజుర్గణము నంతఁయును
నొడివె వైశంపాయసునకు మోదమున;
ఛందోగసంహిత జైమిని చేత
నందఱుం జూచి మేలని మెచ్చ నేర్పె;
సన్నుతాధర్వణసంహితం గొల్చి
యున్నసుమంతున కొప్పున సేసె;
వలనుగా నవి వారివారి శిష్యులునుఁ
బలుదెఱంగులఁ గూడి పఠియించి రర్థి;”
తమ కులములో పుట్టిన మార్కండేయుఁడు నారాయణుని యుదర ప్రవేశము చేసి, అఖిలమును యే విధముగా సందర్శింప గలిగినాడో తెల్పుడని శౌనకుఁడు సూతుని ప్రశ్నించుట
“వినుతాత్మ! మత్కులవిఖ్యాతుఁడైన
ఘనతపోరాశి మార్కండేయుఁ డెటుల
నొనర నారాయణు నుదరంబు సొచ్చి
అఖిలంబుఁ జూచె? మాకదిఁ దెల్పు” మనిన
సుఖక రాలాపుఁ డా సూతుఁ డిట్లనియె
321
“అనఘ! మార్కండేయుఁ డమరు బాల్యమున
జనకుని యొద్దనె సకలంబు జదివి
తరువల్కలాక్షసూత్రమృగాజినములు
వరకమండలు కుశోజ్జ్వల పవిత్రములు
అనలార్క విప్ర నారాయణ భజన
మునుతపః స్వాధ్యాయములు భిక్షకుడుపు
కలుగు వ్రతంబుచేఁ గడు మించి యెన్నఁ
గలమృత్యు గర్వంబుఁ గడకొత్తి మెఱయ
కనఁబడ మనుషట్కకాలంబు[38] చనియె;
మనువు సప్తముఁ డంత మహి యేలుచుండ
అతని తపంబున కాత్మ భీతిల్లి
శతమన్యుఁ[39] డొక బాధ సవరించు పనికిఁ
దలపెట్టె పుంజికస్థలి[40] యనుపేర
గలుగు నచ్చర బుద్ధిగఱపి పుత్తేర
హిమనగోత్తర సీమ నెంతయు వెలయు
రమణీయ పుష్పభద్రానదిఁ గదిసె;
పొలుపారు నతని తపోవనంబునకు
మలయుచు నవ్వేల్పుమగువ[41] యేతెంచి
పెక్కుచందముల దర్పించి క్రీడింప
నక్కొమ్మఁ దత్తేజ మలముక ప్రేల్చె
[38] మనుషట్కకాలము- ఆరు మన్వమతరముల కాలము
[39] శతమన్యుడు- ఇంద్రుడు
[40] పుంజికస్థలి- ఒక అప్సరస
[41] మలయు- మెలగు, వేల్పుమగువ- దేవతాస్త్రీ, అఫ్సరస
331
నప్పుడ తన సహాయంబులుం దానుఁ
జప్పుడుఁ గాకుండ జరగె నక్కొమ్మ
వెలసిన యివ్వార్త విని తపోవృత్తి
నలఘులు నరుఁడు నారాయణ మునియు
వచ్చిపూజన మంది “వరమిత్తు” మనుచు
గచ్చుక[42] పలుక; మార్కండేయ మౌని
“మదిలోన భవదీయమాయ చూడంగఁ
గదిరెడు కాంక్షఁ జక్కఁగఁ జేయ వలయు”
ననిన “నయ్యెడుఁగాక!” యనుచు నమ్మునులు
చని; రంత నొక దివసము వేగుఁబోక
నటమృకండుతనూజఁ[43] డాపుష్పభద్ర
తటమున నున్న యత్తఱి; నుండి యుండి
గిఱ్ఱుగిఱ్ఱునఁ గులగిరుల నూగించు
నొఱ్ఱె[44]వాయువులు బిట్టొలఁపుచు విసరె;
గాలితోడనె కూడి గగన స్థలమున
నీలమేఘావళి నిండె గాఢముగ;
గర్జిత తటిదభిఘాత భీమముగ
నూర్జితంబగు వాన యుడుగక కురిసె;
అంబుధుల్ దరలె నోయన భూతలంబు
నంబుపూరములు చయ్యన నావరించె;
[42] కచ్చు- బింకము, డాబు, ఆపేక్ష
[43] మృకండుతనూజుడు- మార్కండేయుడు
[44] ఒఱ్ఱె- అలవుమీరిన
341
అపుడమ్మునీంద్రుండు నంతంత కొదవు
చపలత నొండు విచారంబు లేక
అవధి లేక యెసంగు నానీటిలోనఁ
దివిరి విభ్రాంతుఁడై తిరుగంగ దొణఁగె;
వొక్కచోట మునుంగు; నొకచోట నీదు;
పుక్కిలి బంటి యైపోవు నొక్కెడల;
వొకచో జలగ్రహయుక్తిచేఁ గందు;
నొకచోట సుళ్ళు డాయుచు నోహటించు[45];
క్రమ్మఱఁ గ్రమ్మఱం గలయు నీ రీతిఁ;
ద్రిమ్మరి త్రిమ్మరి తెలియక దాని
నొక్కచోఁ గనఁబడునొక మఱ్ఱి మీఁద;
చక్కనై యున్న యీశదిగింత[46] శాఖ
పసరు మించిన యాకుపైఁబవ్వళించి
కసుగందు కేల్దమ్మిఁ గాలివేల్పట్టి
ఆననకమలంబునందిడుకొనుచు
నానాగతుల లీల నటియించు బాలు;
అతులాత్ముఁ బొడగని యలపెల్ల మఱచె;
యతని నేమేనియు నడుగంగఁ దలఁచి
కదిసె; నవ్విభు నూర్పుగాడ్పులం జాల
నదవద[47] పడి తదీయాంగంబు సొచ్చె;
[45] ఓహటించు- వెనుదీయు
[46][46] ఈశదిగంతము- ఈశాన్యదిక్కు చివర
[47] అదవద- కలత
351
చొచ్చిబాహ్యంబునం జూచు లాగుననె
యచ్చోట నీ జగంబంతయుం జూచి
వెఱగంది యతనిచే వెసఁ జిమ్మఁ బడుచు
తెఱఁగొప్ప వెల్లిపైఁ[48] దిరుగ వేగమునఁ
బడుచు బాలుఁడు తొంటిపగిదినే కానఁ
బడుచున్న గతికి విభ్రాంతుఁ డౌనంత
ఆయర్భకుం డదృశ్యత నొందె; జలముఁ
బోయ;మున్నిటియట్ల భూమి దీపించె;
ఆమునీంద్రుండు నాత్మాశ్రయ భూమిఁ
దామున్ను మెలఁగు చందంబున నుండె;
హరుఁడంతఁ జనుదెంచి యమ్మౌని మెచ్చి
వరమొసంగఁగఁ బూని వరయుక్తి నతఁడు
హరిభక్తి దయ సేయు మన సమ్మతించి
యరిగె నప్పుడు విస్మయాధీనుఁడగుచు;”
సూర్యుని మహత్త్వముఁ దెలుపుఁడని శౌనకుఁడు సూతుని కోరుట
మనుశౌనకునకు నిట్లనియె సూతుండు
మానితంబగు చైత్రమాసంబునందు
తానొప్పు భానుండు ధాతృ నామమున;
మునివర్య! వైశాఖమున నర్యముండు;
చనుమిత్రుఁ డనఁగ జ్యేష్ఠంబను నెలను;
[48][48] వెల్లి- వెల్లువ- ప్రవాహము
361
మానిత ‘వరుణ’ నామమున నాషాఢ
మున; నొప్పు శ్రావణంబున ‘నింద్రుఁ’ డనఁగ;
అతఁడె భాద్రంబున నగు వివస్వంతుఁ;
డతని కాశ్వినమున నగుఁ ద్వష్ట పేరు;
వెలయుఁ గార్తికమున విష్ణు నామమున;
నలరు మార్గంబున నంశుం డనంగ;
భగుఁడు పౌషమునం; దపంబునం బూషు
యగు;నట్లు పర్జన్యుఁ డట ఫాల్గునమున;
యీరీతి నెలనెల నేకైక నామ
చారిమ వంతుఁడై చరియించు నినుఁడు;
వెనువెంట గంధర్వవితతులు గాన
మునఁగొల్వ; నలయక మునులు నుతింప;
అచ్చరల్ శాస్త్రోక్తి నంగహారంబు
లచ్చుపడంగ మోహనత నటింప;
అందున గానంబు లరదంబు నందు
సందులు గట్లైన సరవితో బిగియు
వడిఁబుణ్యజనులు సవర్గ్యులై కదిసి
బడివనివారలై భక్తి భజింప;
వినుతాత్మ! లఱువదివేవురై నట్టి
యనఘులు వాలఖిల్యాదులు భక్తి
371
నగ్రభాగంబున నభిముఖు లగుచు
నుగ్రాతపాహతి కోర్చి సేవింప;
తగునిమేషార్థ మాత్రంబున సరయ
మగునరదంబుచే నబ్జబాంధవుఁడు
విడువక దివి రెండువేలు నిన్నూఱుఁ
గడపట రెండునుం గల యోజనములు
దిరుగుచు జగమెల్లఁ దెలివినొందించు
నిరుపమ నిగమ వర్ణితమైన సరణి”
శౌనకాది మహర్షులతో సూతుఁడు భాగవత పురాణార్థ సమన్వయము చక్కఁగా ప్రతిపాదింప బడినదని పల్కఁగా సంతోషించిన మునులు సూతుని భక్తితో సత్కరించుట
గనుఁగొని సూతుండు కడుఁ బ్రమోదమున
“వర్ణిత శ్రీభాగవతపురాణంబు
నిర్ణీత సరణి నన్వితమయ్యె నిపుడు”
అనిపల్కుటయు భక్తి నతనిఁ బూజించి
వినుతించి రందఱు వివిధ మార్గముల.
ఆరెవీటి వంశరాజుల యాస్థాన కవియైన దోనూరి కోనేరునాథ కవి రచించిన ద్విపద బాలభాగవత ప్రబంధమును సంపూర్ణముగా విన్న కృతిభర్త చినతిమ్మ భూపాలుఁడు తమ రాజవంశ చరిత్ర మాద్యంతముఁ దెల్పుఁడని కోరుట
మునగల్గు కథ లెల్ల ముదమునం బలుక
చినతిమ్మ భూపాలశేఖరుం డలరి
ననుఁజాచి పలికె నున్నత భక్తియుక్తి
“గుణనిథి! దోనూరి కోనేరునాథ!
ప్రణుతంబుగా బాలభాగవతంబు
381
వినఁగఁ జేసితి శాస్త్రవేదులు మెచ్చ;
జనియించె మాకును సంతోష భరము;
తగయుగాదినె మాకుఁ దాతయు ఘనుఁడు
నగుపరీక్షిత్తు వ్యాసాత్ముజు వలన
నతిభక్తిచే విన్నయదిఁ గదా! యనియు
నతులమై సాత్త్వికం బనఁబడు ననియు
తలపోసి భాగవతంబుపై మాకుఁ
గలఁదు తాత్పర్య మగ్గలముగా నెపుడు;
అట్టిభాగవతంబు నాదివిష్ణుండు
పట్టినల్వకుఁ దేటపరచిన రీతి
నలువయుఁ బ్రియముతో నారదమునికి
ఫలితార్థమ మెరుగఁబలికిన కరణి
అన్నారదుఁడు నెయ్యమున వ్యాసులకను
ధీనుత క్రమమునం దెలిపిన సరణి
వ్యాసులు శుకయోగివరునకు మిగుల
నాసక్తి నొడివినయట్టి మార్గమున
శుకయోగి యభిమన్యుసూనును యెదుటఁ
బ్రకటితార్థంబుగా భాషించి నటుల
పలుదెఱంగుల మించి భాగవతమునఁ
గలకథలెల్లఁ జక్కఁగఁ దెల్పి తిపుడు
391
మహిమ మించిన నవమస్కంధ కథలు
రహిఁబల్కు వేళ మారాజ వంశంబు
నుతకళాశాలి చంద్రుండాదిఁగాఁగ
గృతకృత్యుఁడగు పరీక్షిత్తునిం దనుక
చెప్పితి వా పరీ క్షిత్తుని నుండి
యెప్పుడుం బెనుపొందునిట్టి వంశమున
జననుత కీర్తి మజ్జనకుండు రామ
జననాథు తిమ్మరాజన్యవర్యునకు
తనర నల్వదియేను తరము లటంచు
వినఁబడు నార్యులు వివరించి పలుక
అందునందుం డాదియగు మహానృపతు
లెందుఁగీర్తులుఁ గాంచి యెసఁగినవారు
యిట్టిమా పెద్దల యెన్నికకెక్కు
నట్టిచరిత్ర మాద్యంతంబు నిపుడు
నిలువ వక్కాణింపనేర్తువు నీవు
పలుక; మాకు వినంగఁ బ్రమదంబుఁ గలదు
క్రమముతో సకల పురాణంబులందు
రమణీయ కలియుగ రాజవంశములు
అరసి చూచిన వాఁడ వాపరీక్షిత్తు
తరవాతి రాజులం దగఁ దెల్పు మనఘ!”
దోనూరి కోనేరు నాథ కవి ఆరెవీటి వంశచరిత్రము నాద్యంతము నభివర్ణించుట
వినజేయఁ బూని భావించి యిట్లంటి