బాల ద్విపద భాగవతం : భాగం-6-401-500
401
అవధారు సోమవంశాంభోధి చంద్ర!
నవభోజ! చినతిమ్మ నరనాథచంద్ర!
పాండుభూపాలుని పౌత్రపుత్రుండు,
చండశౌర్యుఁడు, ధనంజయుని పౌత్రుండు
నలువొందు నభిమన్యునకు నందనుండు,
కలియుగంబున కాదిఁ గలిగిన రాజు
వెలసెఁ బరీక్షిత్తు విమల వర్తనుఁడు,
కలిగర్వభంజన కౌశలాన్వితుఁడు;
అతఁడు మాద్రవతి యందాత్మజుం గీర్తి
యుతుఁగాంచె జనమేజయుండనునతని;
అతఁడు భారతమహాఖ్యానంబు వినియె
నుతుఁడు వైశంపాయనుఁడు వివరింప;
అతఁడు శతానీకుఁడను పుత్రుఁ గాంచె
సతత శోభిత వపుష్టమయుండు వెలయ;
మెఱయ నాతని కశ్వమేధదత్తుండు
వఱలెఁ దనూజుండు వైదేహి యందు;
చంద్రాస్య యైన విశాల యం దతని
కింద్రసన్నిభుఁడు క్షేమేంద్రుండు పొడమె;
ఆమహీపతి సురూపాంగన యందు
సోమేంద్రుఁ డనుపేరి సూనునిం గాంచె;
411
జననాథ! యతనికి శతరూపవలన
నొనరంగ నుదయించె నుత్తుంగభుజుఁడు;
నరనాథ! యతనికి నందుండు సుతుఁడు
మరుసన్నిభుఁడు కాంతిమతియందు పొడమె;
నందుండు నందా సనాథుఁడై భక్తిఁ
గందువ యరయంగ కాశికి నేఁగి
తమకు నచ్చోట మోదంబుఁ గావించి
తమశక్తి నెఱపిన ధరణీసురలకు
వసుధ నెన్నఁగ నందవర మను పేరి
యసమానమగు నగ్రహారంబు నొసఁగె;
నందున కిచ్చె శ్రీనరసింహుఁ డెసము
నొందిలోకముఁ బ్రోవ నొక్క చక్రంబు
అందుననే కదా యానందుఁ డఖిల
వందితుఁడై చక్రవర్తి నాఁ బఱఁగె;
యిందుపరీక్షి దుర్వీశుని నుండి
నందుని యభిషేచనంబగు తఱికిఁ
బలుకంగ వేయునేఁబదియు నేండ్లనుచుఁ
బలుకు విష్ణుపురాణ పద్యంబుఁ దెలియ;
నందుండు ప్రమదాంగనామణి యందు
నందితమతిఁ గాంచె నరమేధదత్తు;
421
అతఁడు లక్ష్మీదేవి యను నింతి యందు
సుతుసహస్రానీకు శుభచిత్తుఁ గాంచె;
అతనికి వైదేహియను దేవి యందు
చతురుఁ డాత్మజుఁ డయ్యె సత్పురుషుండు;
ఆరాజునకుఁ గుంతి యందయ్య దేవ
ధీరుండు నాఁగల్గు ధీరుఁడౌ సుతుఁడు;
మనుజేశుఁ డాతఁడు మతివరుం గాంచె
తనుఁబోలు నతనిఁ జందల దేవియందు;
ధరణీశుఁ డతఁడు సత్యవ్రత యందు
హరిశౌర్యుఁడైన యాహవమల్లుఁ గనియె;
గిరిజ యందా జగద్గీతయశుండు
మరునిభుం ద్రిభువనమల్లునిం గాంచె;
మలిదేవి యందా సమగ్ర శౌర్యుండు
బలియుఁ జళుక్యభూపాలునిం గాంచె;
ఒనరఁ జళుక్యునినుండి చాళుక్యు
లనుపేరుఁ గల్గె మీకందఱ కధిప;
సుగుణాఢ్యుఁ డాతండు సోమాంబ యందు
జగదేక మల్లుఁ డన్- జగతీశుఁ గనియె!
రాజేంద్ర! యా మహీరమణుండు ధాత్రి
రాజిల్లు రాజాధిరాజ నామమున;
431
మఱియు నా జగదేకమల్ల భూపాలుఁ
డెఱుకమై నిల యెల్ల యేలుచు నుండి
రాయ,చూడామణిరాయ, కందర్ప
రాయ,రక్షామణిరాయ, భేరుండ
రాయ,కోలాహలరాయ, ఘరట్ట
రాయ,దిశాపట్టిరాయ, శృంగార,
సకలకళాధర, సార్వభౌమాది
సకల జనోద్గీత సహజాంకుఁ డగుచు
యీడుజోడును లేక యెసఁగు సంగీత
చూడామణీ నామశోబితంబైన
లక్షణ గ్రంథంబు లాగుగా నిలిపె
నీక్షోణి నా భాస్కరేందువుఁ గాఁగ;
జగతి నిట్లు ప్రసిద్ధిఁజాలఁ గైకొనిన
జగదేకమల్లుని భామ గౌరాంబ
భువనైకమల్లుఁడే పొసఁగు ననంగ
భువనైకమల్లునిఁ బుత్రుఁగా గనియె;
కదనభీముఁ డతండు గంగాంబ వలన
నుదయ భూనాయకు నుదితుఁగాఁ జేసె;
యానరేంద్రుఁడు తన యంకనం బెసఁగఁ
బానుగంటిపురిని బాలించి వెలసె;
441
ఘనత నా నృపునకుం గామలదేవి
తనయుని విష్ణువర్థన నాముఁ గనియె;
అతనికిఁ దగ విమలాదిత్యుఁ డొదవె;
రతికి నీడనఁ జాలు రత్నాజి యందు
ఆజగతీశు తొయ్యలి భానుమతికి
రాజరాజనరేంద్ర రాజ్యనుఁ డొదవె;
అతఁడు వేంగీదేశమను హారమునకు
నతుల నాయకమణి యనఁదగునట్టి
రాజమహేంద్రవరంబను పేరి
రాజధాని మనోహరముగఁ గట్టించె;
ఆరాజమణి కార్యుఁ డగు పెద్దకడుకు
సారంగధరుఁ డతిశాంతుఁడై యుండి
ఆసక్తిఁ బినతల్లియైన చిత్రాంగి
సేసిన యాపదం జెచ్చెఱం గడచి
అనఘుడై చౌరంగి యను సిద్ధుఁడయ్యె;
జననాథ! నేఁడును జగతిపై నిలిచె;
అతఁడె యా భారతాఖ్యానంబు నందు
ప్రతిలేని మొదలి పర్వంబుల మూఁటి
నందెతెనుంగున నానన్నపార్యుఁ
డందఱు వెఱగందునట్లుగా నొడువ
451
అతఁడు శ్రీకాంత యందాత్మజుం గనియె
చతురిమోపేంద్రాభుఁ జాళుక్యభీమ
మహిపతి; నతనికి మదన లేఖకును
సహజశౌర్యుఁ డుపేంద్రజగతీశుఁ డొదవె;
అతఁడు లక్కాంబ యం దనఘు విశ్వేశు
మతిమంతుఁ జౌహత్తమల్లునిం గనియె;
వెలయంగ నందులో విశ్వేశ్వరుండుఁ
గలిగించె భువి నలంకారసారంబు
కడుమించి సంగీతకౌస్తుభం బనఁగ
నొడికంబుఁ గలిగిన యొక్క గ్రంథంబు
చౌహత్తమల్ల భూజాని నిర్మించెఁ
గోహళ మత మెల్లఁ గుదురు కొనంగ;
ఆయుత్తముని యింతి యగు గొంతిదేవి
రాయపితామహ రాజన్యుఁ గాంచె;
సుకుమార జనపతి; సుతుఁ డవ్విభునకుఁ
బ్రకటితకీర్తి యౌభళదేవి యందు
సుతుఁడయ్యె సర్వజ్ఞసోమేశ నృపతి;
సుతుఁడయ్యె సర్వజ్ఞసోమేశ నృపతి;
అనఘాత్మ! యతఁడు సోమాంబయుం గనిరి
తనయునిం గృష్ణకందాళరాయాంకు;
461
ఆనరేంద్రునకు రుద్రాంబ కాత్మజుఁడు
శ్రీనిధియైన దేశింగ రాయండు;
అతనికి సుతుఁడు కల్యాణ బిజ్జలుఁడు;
తతయశుం డొదవె సిద్ధమ దేవియందు;
ఆతండు కల్యాణ మను పట్టణమున
నూతన ద్యుతు లేడునూఱు దంతలును
పదిరెండువేలు శోభన సైంధవములు
పదిరెండు లక్షలు బలువైన భటులు
పనులకు మిగిలి ముప్పదిఁగోట్లు నిలుచు
ధనమున నర్ఘ్యరత్నంబులు లక్ష
తలఁపంగఁ గడలేని ధ్యానరాసులును
కలిమిచే మించు దుర్గంబులు నూఱుఁ
గలిగి సమస్తలోకము జయవెట్ట
బలదేవునికి మంత్రిపదవి యొసంగి
పాలించె నిమ్మహిం బరమహీపాల
జాలంబు శైలసంచారంబుఁ జేయ
అతఁడు కల్యాణపురాధీశ్వరాది
వితత నామంబుల వెలయించె ధాత్రి
ఘనున కా నృపతికి గంగాంబ యందు
మనునిభుం డైన హేమల్లరాయండు
471
అరిభీకరుండు చౌహత్తమల్లుండు
హరితేజుఁ డగు భువనైకమల్లుండు
బలశాలి రాయవిభాళుండు ననఁగ
నలుగురు పుట్టి రున్నతులైన సుతులు;
అందుహేమల్లరాయఁడు ధరయెల్ల
నెందునుఁ దన కెదురెఱుఁగక యేలె
ధీరుండు లక్కమదేవి యందతఁడు
వీరహెమ్మాడిభూవిభుఁ బుత్రుఁ గాంచె;
ఆవీర హెమ్మాడి యసమ శౌర్యమున
భూవర నత పదాంభోజుఁడై యుండి
ఆరూఢి గలుగు నందమరిన వీర
నారాయణుండు స్వప్నమునందు వెలసె;
అపుడు శైవాచార మంతయు మాని
నిపుణత వైష్ణవనిష్ఠుఁడై వెలసె;
గణనీయ మగునట్టి కందుల నాట
గణపురనామ దుర్గము సమీపమున
గంగాపురా పరాఖ్యంబై సమగ్ర
మంగళం బగునట్టి మాయాపురమున
వెలయంగఁ దొమ్మిదివేల నాగములు
లలిత హయంబుల లక్షలు పదియు
481
బలమపారంబును భాసిల్లుచుండ
నిలయేలె సమ్రాజుఁ డితఁ డని పొగడ
ప్రాకార గోపుర భద్రమంటపము
లాకలితైశ్వర్యుఁడైయొనరించి
చెన్నకేశవుఁ బ్రతిష్టితుఁగా నొనర్చె;
నన్నరేంద్రోత్తముఁ డాపట్టణమున
అతఁడొక దినమునం దాకేశవునకుఁ
బ్రతిలేని భక్తిచే బ్రణతుఁడౌ వేళఁ
దనపదకంబులోఁ దగు నాయకంబు
నొనరిన పరపు తా యొఱుసునో, యనుచు
తలఁచుట కారాత్రి దైత్యారి చేతఁ
బలుఁదెఱంగులఁ దూఱఁబడిన వాఁడగుచు
ఆవేఁకువనె లేచి యార్యులం గూర్చి
దేవతాద్రోహికిఁ దెఱఁగైన శిక్ష
యడిగి వారలుఁ దెల్ప నడఁగక యెగరు
గడుసరి కోడెలం గాఁడిఁ గట్టించి
యందురజ్జువుఁ గట్టి యాత్మపాదముల
నందుయత్నమున సంయతములు సేసె;
“వనజాక్షు గేహంబు వలఁగొని బెదరు
జనియించి యెందేనిఁ జనునట్లుఁ గాఁగ
491
తోలుఁడీ” యనుచు భృత్యుల నియోగింప
నాలీల వారును నప్పుడ కూడి
వాద్యముల్మొఱయించి వలనెద మోఁది
యుద్యుక్తిఁ గోడెలనొత్తి పీడింప
అవియునుం దెమలక యడుగుపై నడుగు
సవరగాఁ బెట్టుచు జవమెల్ల మఱచి
మసలి పొద్దున నుండి మాపటి దనకఁ
గసరుచు హరికి నొక్కప్రదక్షిణంబు
తిరిగి ప్రొద్దునుఁ గ్రుంకి తిమిర మౌనంత
గరుడ గంబము చేరి కడునొచ్చి నటుల
పదములు చాఁచుక పదినోళ్ళుఁ దెఱచి
మెదలకయుండు నమ్మెయిఁ జాలమెచ్చి
సురలు దుందుభులు హెచ్చుగ మొఱయించి
కురిసి రా నృపతిపైఁ గుసుమ వర్షముల
అతని దేహంబున నాశిలాఫలక
వితతిమోచిన చోట్ల విస్మయం బొదవ
సలలితగతి సుదర్శన పాంచజన్య
ములుగానఁగా వచ్చె మునుముట్ట నరుడ
తొడరి యేనినుఁ జేరిదూఱుట కింత
సడిఁబెట్టి తిఁకనైన క్షమియింపు మనుచు