బాల ద్విపద భాగవతం : భాగం - 5-601-700
601
నొనర నేకాదశయోజనౌన్నత్య
వినుతమౌ నా పృథివీధరాగ్రమున
నుండిభూమికి దిగనుఱికి శ్రీనిధులు
దండిగా నేగి రిద్దఱును ద్వారకకు
జనభీషకుడు జరాసంధుండు నరులు
చనిరందె యని యేగె సంతుష్టుఁడగుచు
రేవతుఁడు తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి వివాహము చేయగా, శ్రీ కృష్ణుఁడు భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షస విధిలో వివాహమాడుట
అంతనానర్తేశుఁడైన[97] రేవతుఁడు
సంతోషమునఁ దనూజాత రేవతిని
హలధరునకు నిచ్చె నాకథ మున్నె
తెలిపితి నీకు ధాత్రీనాథచంద్ర!
గోవిందుఁడును భీష్మకుని బిడ్డ రుక్మి
ణీవనజాక్షి నన్విత గుణోద్దామఁ
జెలఁగు రాక్షస విధిఁ జేపట్టె” ననుఁడు
నిలఱేఁడు యోగీంద్రు నీక్షించి పొగడి
“ఆకథఁ దెలుపవె” యనుఁడు వైయాసి
చేకొనిఁ యిట్లని చెప్పంగఁ దొణఁగె
పరీక్షిత్తు కోరికపై శుక మహర్షి రుక్మిణీ కల్యాణ గాథను సవిస్తరముగా వర్ణించుట
“వినుము విదర్భ భూవిభునకు భీష్మ
కునకాది రుక్మిగాఁ గొడుకు లేవురును
కన్యరుక్మిణియునుం గలిగిరా కన్య
ధన్యతద్రూపంబుఁదగఁ బల్క దర
[97] ఆనర్తేశుడు- ఆనర్తదేశాధిపతి కకుద్మి ఇతనే రేవతుడు. ఈ రేవతుని కూతురు రేవతి. ద్వారక ఆనర్తదేశం ఉంది
611
పంకజంబులఁ[98] గ్రిందుపఱచు పాదములు
నంకయుతేందుఁ[99] గాదను నఖంబులును
కచ్ఛపంబుల రోయఁగలుగు మీఁగాళ్ళు
తుచ్ఛ కాహళములం[100]దొడరుఁ బిక్కలును
కరభంబులకు[101] నిందగావించు తొడలు
మరు రథాంగము[102] పెంపుమగిడించుఁ బిఱుఁదు
ఆవర్తముల[103] లోఁతుహసియించు నాభి
శైవాలలత[104] చాయచారు నూగారు
అరయ లేనెలల[105] లేదనిపించు నడుము
సరవి జక్కవల మెచ్చని యురోజములు
బిసముల[106] వళుకులంబెట్టు బాహువులు
వెసఁ జిగుళ్ళ రసంబువిఱుచు హస్తములు
క్రముక[107] కంఠము చెల్వుఁగడచు కంఠంబు
కమిలి బింబము[108] డంబుఁగడకొత్తు మోవి
కడఁగి యద్ధములతోఁ గలహించు చెక్కు
లొడికమై[109] నువుఁబువ్వు నుదిరించు ముక్కు
మగమీలఁ[110] దగవులమలరించు కన్ను
లగును శ్రీకారంబులనఁజాలు చెవులు
అళికుల[111] దుర్మదహరములౌ కురులు
పలుఁదోయముల[112] మించుబహు విలాసములుఁ
[98] పంకజము- పద్మము
[99] అంక యుత ఇందుడు- మచ్చతో కూడిన చంద్రుడు
[100] కాహళము- తుత్తూరి / బాకా అను వాద్యము
[101] కరభము- ఏనుగు తొండం, చిటికిన వ్రేలి మొదలు నుండి మణికట్టువరకు గల అరచేతి వెలుపలి భాగము
[102] రథాంగము- చక్రము, మరుని రథచక్రంలా ఉన్న పిఱుదులు
[103] ఆవర్తము- సుడిగుండము
[104] శైవాల లత- నాచు తీగ, నూగారు- రోమరేఖ, బొడ్డుకన్నా పైనుండి రొమ్మువరకు సాగు రోమముల వరుస
[105] లేనెల- లేత చంద్రుడు పాడ్యమినాటి?
[106] బిసము- తామర తూడు
[107] క్రముకము- పోకచెట్టు, ఎఱ్ఱలొద్దుగ
[108] కమిలి- మిగలపండిన, బింబము- దొండపండు
[109] లొడికము- జానపొడుగు?
[110] మగమీల- పోతు చేప
[111] అళికుల- తుమ్మెదల గుంపు
[112] పలుదోయము- సముద్రము
621
గలిగి రుక్మిణి ముజ్జగముల భూషణము
చెలువంపుఁగని యనం జెలువారుచుండె
రుక్మిణీ శ్రీకృష్ణులు పరస్పర ప్రేమ భావనా బద్ధులగుట
ఆరుక్మిణీ దేవి యతిథులు వొగడ
శౌరిగుణంబులు సారె నాలించి
తనకు శ్రీకృష్ణుండె ధవుఁడని యుండె
మనములో నిశ్చయ మహితభావమున
ఆరుక్మిణీదేవి ననురాగ మహిమ
శౌరియు జేపట్టఁ జర్చించె నాత్మ
శిశుపాలునకుఁ దన్నుఁ జేర్చెదననుచు
శిశుబుద్ధిచే రుక్మి చింతించు నంత
రుక్మిణి రహస్య వర్తమానముఁ బంపగా శ్రీ కృష్ణుఁడు రథారూఢుఁడై వచ్చి రుక్మిణిని ద్వారకకుఁగొనిపోవుట
తెలిసి రుక్మిణి ధరిత్రీసురు నొకని
జలజాక్షునకు రహస్యంబుగా ననిపె
జలజాక్షుఁడును నగ్రజన్ముండుఁ దెలుప
నలఘు రథారూఢుఁడైవేడ్కఁ గదలి
ఏకరాత్రంబున నేతెంచె బెండ్లి
యాకాంక్షచేఁ గుండినాహ్వయ పురికి
అటశిశుపాలుండు నంత సాల్వాది
కుటిలాత్మకుల తోఁడఁగూడి యేతెంచె
కలహంబు శౌరికిఁ గలుగునో యనుచు
బలుఁడుఁ గూడఁగ వచ్చె బలయుక్తుఁడగుచు
631
అంతిపురంబున కరిగి విప్రుండు
నింతయు రుక్మిణి కెఱిఁగించె నంత
అంబికావందనంబాచరించుటకు
నంబుజానన యొక్క యరదంబు నెక్కి
తల్లులుం జెలులు బాంధవులును భటులు
నల్లబిల్లిగ జంటలైవెంట నడవ
బహువాద్యరవము లంబరమున నిండ
మహనీయ సంభ్రమమహిమచే నడచి
గౌరిఁబూజించి మంగళ వస్తువిత్త
వారముల్ ముత్తైదువలకు నొసంగి
హరినాత్మఁ దలఁపుచు నతిభీత యగుచు
నరద మెక్కఁగఁ జూచునంతటిలోన
కంసారి యట సొచ్చి కౌఁగిట బొదివి
హంసయానను తన యరదంబు మీదఁ
బొందించి శంఖంబుపూరించి కదలె
నందమై నిజబలం బఱుముక కదల
సాల్వ, దంతవక్త్ర, విదూరథ, రుక్మి మొదలుగాఁగల యోధాగ్రేసరులు శ్రీకృష్ణుని వెంబడించి పరాభూతు లగుట
కనిసాల్వ, దంతవక్త్ర,విదూరథాతి
జనపతు లోర్వంగఁజాలక[113] కవిసి
సరయ దామోదర శార్ఙ్గ విముక్త
శరతేజముల నోర్వజాలక[114] చనిన
[113] ఓర్వంగజాలక- అసూయారోషములచే ఓర్వలేక
[114] ఓర్వజాలక- శౌరి శౌర్యము నడ్డుకొనలేక, ఈ రెండు శబ్దాల ప్రయోగం కవి రచనా శిల్పం వ్యక్తపరచెను
641
అవలేపమున[115] రుక్మి యావహంబునకుఁ
గవిసిన గెలిచి చక్రధరుండు వట్టి
తునుమంగఁ బూని యాతొయ్యలి సేయు
ననునయంబున మాని హస్తముల్ గట్టి
తలయు మొగంబునుం దరవారి ధారఁ[116]
గొలది సందులు వారఁ గొఱిగి పోవిడిచె
యీరీతిఁ దెచ్చి యాయింతిఁ గైకొనియె
శౌరిద్వారకలోన శాస్త్రమార్గమున
శివునిచే భస్మసాత్కృతుఁడైన మన్మథుఁడు ప్రద్యుమ్నుఁడను పేర రుక్మిణీ శ్రీ కృష్ణులకు జన్మించుట
అంతనయ్యింతితో నఖిలోప భోగ
సంతుష్ట చిత్తుఁడై శౌరి చరింప
మునుశంకరుని చేత మునిఁగిన మరుఁడు
జనియించెఁ దిరుగ నా జలజాస్య యందు
మన్మథుని భార్యయైన రతి, ప్రద్యుమ్నుని పత్నియైన విచిత్రోదంతము
సద్యుతి యై యిట్లు సంజాతుఁడైన
ప్రద్యుమ్ను నొక్క శంబరుఁడను నసుర
ఉదధిలో వైచిన నొక్క మీనంబు
చెదరక యుండంగఁ జివుకన మ్రింగె
దానినే జాలరుల్దగఁ బట్టితెచ్చి
కానుక యిచ్చిరా కపటదక్షునకు
అడబాల[117] గొనిపోయి యమ్మీనుఁ జించి
కడుపులో నొక బాలుఁగని వెఱగంది
[115] అవలేపము- గర్వము
[116] తరవారి- పట్టాకత్తి, దార- పదును, అంచు
[117] అడబాల- వంటమనిషి
651
చేరిశంబరునకుఁ జెప్పిన నతఁడు
భీరుఁడయ్యునుఁ గొంత ప్రియముగాఁ దలచి
మున్నుగా నారదముని నిదేశమున
పన్నుగా వంటలపని దాన ననుచు
తతిఁ[118]గోరుకొని దీనతాగతి నున్న
రతిచేతి కిప్పించె రాజసం బెసఁగ
రతిదేవియును బాలు రమణుఁగాఁదెలిసి
ప్రతిదినంబును నింపుపైకొనం బెనిచె
ఆయంగనారత్న మారీతిఁ బెనిచి
ప్రాయంబు వాఁడైన ప్రద్యుమ్నుఁ జూచి
మోహంబు నెఱపి సంభోగ లీలలకు
నూహించుటయునుఁ బ్రద్యుమ్నుండు జడిసి
“తల్లివి నీకిట్లు దగవె” యటన్నఁ
బల్లవాధరి యప్డు ప్రాణేశుతోడ
“నారదుండెఱిఁగించె నాకు మున్నీవు
మారుండ నేను నీమానిని రతిని
కృతమతి రుక్మణీకృష్ణపుత్రుఁడవు
హితుఁడు గాఁడు విరోధి యీశంబరుండు”
అనితెల్ప బ్రద్యుమ్నుఁ డపుడ శంబరుని
ననిగెల్చి రతిఁ గూడి యాద్వారవతికి
[118] తతి- అదను
661
జనుదెంచి నారదసంయమి వలనఁ
దనవార లెఱుఁగుచుఁ దను గారవింప
వుండెసుఖంబున నుర్వీశచంద్ర!
రెండవ కృష్ణుఁడీ శ్రీమంతుఁడనగ
ప్రతిదినమున కెనిమిది బారువల బంగార మిచ్చు శ్యమంతక మణిని సత్రాజితుని తపస్సుకు మెచ్చి సూర్యుఁ డనుగ్రహించుట
బంగార మెనిమిది బారువుల్[1] గురిసి
మంగళంబగుచు శ్యమంతకం బనఁగ
గలరత్న మొకటి భాస్కరుఁ డిచ్చెఁ దపము
చలనమేది[2] యొనర్చు సత్రాజితునకు
అమ్మణి నొక్క నాఁడడిగెఁ గంసారి
యమ్మెయి నీఁ జాలడయ్యె నా లోభి
అతని తమ్ముఁడు ప్రసేనాఖ్యుఁడా రీతి
యతుల రత్నముఁ దన యఱుత[3] ధరించి
అడవి నొక్కెడ వేఁటలాడుచునుండఁ
బడఁగొట్టె వడి నొక్క పంచాననంబు[4]
పంచాననముఁ ద్రుంచి భల్లూకభర్త
సంచిత గురుకీర్తి జాంబవంతుండు
గురుకాంతి యమ్మణిఁ గొనిపోయి తనదు
వరపుత్రి నాడించు వస్తువు సేసె
అంతనిచ్చటఁ దమ్ముఁ డణఁగి పోవుటయు
సంతత దుఃఖియై సత్రాజితుండు
[1] బారువ- ఇరవై మణుగులు, 8x20-160 వీసెలు, 1.65x160- 264 కిలోగ్రాములు
[2] చలనమేది- నిశ్చలంగా
[3] అఱుత- మెడ
[4] పంచాననంబు- సింహము
671
అనుజుని మణికినై హరియ యణంచె
ననుకొను నవ్వార్త హరి యొయ్య వినుచు
శ్రీ కృష్ణుఁడు తన కేర్పడిన నీలాపనిందను బాపికొనుటకు బయలుదేరి జాంబవంతునితో పోరాడి మణితో జాంబవతీమణితో తిరిగి వచ్చుట
పౌరులుఁ గొలువంగ బలయుతుండగుచు
భోరన[5] నవ్వనంబున కేగి యచట
సింహనిర్దళితుం బ్రసేనునిం గాంచి
సింహంబు జాడనె చెచ్చెర నరిగి
గ్రక్కున సింహ మొక్కయెలుంగు[6] చేత
మక్కుటఁగాంచి తన్మార్గంబు వట్టి
చని,జాడ చొచ్చిన శైలగహ్వరము
ననుచరావలి రాకుమని నిల్పి చొచ్చి
జాంబవన్నందనశయ్యాంతికంబు
నంబుజనాభుండు[7] నడయాడఁ జూచి
వడిమొఱలిడ జాంబవంతుఁ డేతెంచి
తడయక బాహు యుద్ధమునకుం గదిసె
యిరువురు నిరువదియెనిమిది నాళ్ళు
పరుషతం జేసిరి బాహు యుద్ధంబు
అటమున్నె పదియు రెండహముల దనకఁ
దటుకన[8] వచ్చు మాధవుఁ డిదె యనుచు
వనరి ప్రతీక్షించి వాకిట నున్న
జనులు వేసట నొంది చనిరి ద్వారకకు
అంతనా ఋక్షేశుఁ[9] డాత్మ సత్వంబు
గొంతయత్తఱిఁ దఱఁగుట, నాత్మలోన
[5] భోరన- శీఘ్రమే
[6] ఎలుగు- భల్లూకము, ఎలుగుబంటి
[7] అంబుజనాభుడు- శ్రీకృష్ణుడు
[8] తటుకన- చటుక్కున, తప్పక
[9] ఋక్షేశుడు- భల్లూకేశ్వరుడు, జాంబవంతుడు
681
నతని మర్త్యతనున్న[10] హరిఁగాఁ దలంచి
నుతియించి యతని మనోరథం బడిగి
వనజలోచన జాంబవతి నాఁగఁ గల్గు
తనపుత్రితో శ్యమంతకము నొసంగి
మణుల బూజించిన మాధవుండలరి
ప్రణతుఁడై నతనికి పరభక్తి యొసఁగి
ఆజాంబవతిఁ గూడి యాగుహ వెడలి
రాజితంబైన యారత్నంబుఁ గొనుచు
తనపురి కేతెంచి తన్మణి యొసఁగె
జనులెల్ల చూడంగ సత్రాజితునకు
శ్యమంతకమణిని సాధించి తెచ్చి యిచ్చిన శ్రీ కృష్ణునికి సత్రాజితుఁడు సత్యభామనిచ్చి తన తప్పును దిద్దుకొనుట
సత్రాజితుండునుంజాల లజ్జించి
పాత్రతం దన తప్పువాపు కోగోరి
అప్పుడ తన బిడ్డయగు సత్యభామ
నప్పుణ్యమణియును హరికి నర్పించె
హరియును వరియించె నాసత్యభామ
విరివి వైభవముల వేదోక్తసరణి
మణియొల్లఁ డయ్యె మామాయని, సుగుణ
మణులు మెచ్చఁగ మామకే యిచ్చె మరల
శతధ్వనుఁడు సత్రాజితుని చంపి శ్యమంతకమణిని గ్రహించి, దానిని యక్రూరునకిచ్చి, తానడవుల కేగుట
ధరణిశ! యట్టి సత్రాజితుం జంపి
హరియించె శతధన్వుఁడాశ్యమంతకము
[10] మర్త్యతనున్న- మానవుడిగా ఉన్నటువంటి, హరి- విష్ణువు
691
అంతలోననె యుల్కి యాశతధన్వుఁ
డంతికంబున నున్న యక్రూరుఁబిలిచి
మణి కొఱకు మామ చంపబడుట, తిరిగి తనపై యపవాదుకు దారితీయునని తలఁచి శ్రీ కృష్ణుఁడు శతధ్వనుని చంపి, యక్రూరుని వద్ద గల మణిని గ్రహించి యథార్థ విషయమును యాదవుల కెఱింగించుట
అమ్మణి యిచ్చి తానటవికిం జనిన
గ్రమ్మనం దోడనె కమలాక్షుఁ డరిగి
వానివధించి యావరరత్న మచటఁ
గానక యక్రూరుకడ నుంటఁ దెలిసి
తావచ్చి యాశ్యమంతకముఁ దెప్పించి
యావిధం బెఱిఁగించె యదువులకెల్ల
శుకుఁడు శ్యమంతకోపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పుట
ఈయుపాఖ్యానంబునింపున వినినఁ
బాయుదుష్కీర్తి పాపములు, మేలొదవు
శ్రీకృష్ణుఁడు కాళింది, మిత్రవిందాది కన్యలనుఁ బెండ్లాడుట
మఱియును భానుకుమారిఁ గాళింది
మెఱయు మేనర్కంబుమిత్ర విందాఖ్య
వొగిసప్తవృషజయం[11]బుంకువ గాఁగ
నగణిత శ్రీమతియగు నాగ్నజితిని
శ్రుతకీర్తికి ననుంగుసుతయగు భద్ర
నతులిత లక్షణయగు మద్రకన్య
పరిణయంబయ్యె సంభావిత శాస్త్ర
పరణిచే వరుస నాశౌరి చిత్రముగ
సత్యభామ సహితుఁడై వచ్చి శ్రీకృష్ణుఁడు నరకాసురుని సంహరించుట
అచల శస్త్రాస్త్రనలాంబు సమీర
రుచిర దుర్గములును రూపైన యట్టి