బాల ద్విపద భాగవతం : భాగం-5-1101-1200
1101
కరుణయై నతని యాకల[149] నున్న నృపుల
నిరువది వేవుర నెనమ నూర్గురను[150]
విడిపించి వారల వినుతు లాలించి
వడముడి కవ్వడుల్వరుసతో[151] గదిసి
తనుభజియింప నింద్రప్రస్థ పురికిఁ
జనియె; ధర్మజుఁడును సంతసంబంది
ధర్మజ రాజసూయ ధ్వరమునందగ్రపూజ నందిన శ్రీకృష్ణుని నిందించి, శిశుపాలుడాతని సుదర్శన చక్రముచే ఖండిత శిరస్కుఁడగుట
రాజసూయ మహాధ్వరంబొనరించె
రాజులు మునులు వారక పనుల్సేయ
ఆరాజ సూయంబు నందగ్రపూజ
వారిజాక్షున కిచ్చె వరమతుల్ మెచ్చ
అదిచూచి శిశుపాలుఁ డపు డోర్వ లేక
పదపడి యా శౌరి బలుమారుఁ దెగఁడె
నచ్చక్రియును నిశితాంత చక్రమునఁ
జెచ్చెఱ ఖండించె శిశుపాలు శిరము
శిశుపాలు తేజంబు శ్రీకృష్ణుఁ జేరెఁ
బ్రశమ చిత్తులకునుఁ బరితాప మొదవ
జగతీపతుల మునీశ్వరుల బంధువులఁ
దగుపూజ లర్పించి ధర్మజుం డనిపె
తన మిత్రుఁడైన శిశుపాలుని మరణముచే శ్రీకృష్ణునిపై పగ బూనిన సాల్వుని వృత్తాంతమును శుక మహర్షి పరీక్షితునకు దెల్పుట
ఈలీల శ్రీకృష్ణుఁ టిచ్చోట నుండు
నాలోన ద్వారకకాసాల్వుఁ డరిగె
[149] ఆకలు- బంధనములు
[150] నిరువది వేవుర నెనమ నూర్గురు- మంది
[151] వడముడి- భీముడు, కవ్వడి- అర్జునుడు
1111
ఘనుఁడైన యా సాల్వు కథ యెల్ల నీకు
వినుపింతుఁ జక్కఁగా వినుము ధాత్రీశ!
వైదర్భిఁ[152] గృష్ణుండు వడిఁ దెచ్చు వేళ
చేదీశుఁ[153] గూర్చి వచ్చిన సాల్వ నృపుఁడు
యదువీరవరుల కాహవమున నోడి
యదవద నొంది పలాయితుం డగుచు
“ధరనకృష్ణయు నయాదవయుఁగా నిపుడ
పరఁగింతుఁ జాడుఁ డీపార్థివులార!”
అనిప్రతిజ్ఞ యొనర్చి హరుఁ దపోమార్గ
మునమెచ్చఁ జేసి ప్రమోదంబు తోడ
తపస్సుచే శివుని మెప్పించిన సాల్వుఁడు కామగమనము గల అయోమయమైన సౌభమను విమానమును పొందుట
తనతలం పెఱిఁగింపఁ దడయక కరుణ
ననలాక్షుఁడును మయుండను వాని చేత
కామగంబును దృఢాంగము నయోమయము
నైమించు నొక సౌభమను విమానంబు
మనుజోరగాసురామరులకు నైన
ననిశంబుఁ గడు నభేద్యముగఁ జేయించి
ఆసాల్వ భూపతి కసమాన దర్ప
భాసురాత్మకునకు భక్తియై నొసఁగె
శ్రీ కృష్ణుఁడు ద్వారకలో లేని సమయములో సాల్వుఁడు శివదత్తమైన సౌభంబులో నుండి ద్వారకానగర శోభను నాశనము చేయుట
నంతఁదాదృశ విమానారూఢుఁ డగుచు
సంతోష కలితుఁడై సాల్వ భూపతియు
[152] వైదర్భి- రుక్మిణీదేవి
[153] చైదీశుడు- శిశుపాలుడు
1121
కరమొప్ప నా ద్వారకాపురంబునకు
నరుదెంచి శ్రీ కృష్ణుఁ డపు డందు లేమి
భయమేది[154] యా తేరు బలిమిఁ దాకించి
రయమున నట్టిళ్ళ రమ్యత చెఱిచి
కోటకొమ్మలు వ్రాల్చి గోపురావళుల
వాటంబుల గలంచి వనములు విఱిచి
మేడలుప్పరిగెలు మెఱయుచు నుండు
జాడలు దఱగించి సంరంభ మెసఁగ
శింజనీ నాదముల్సింహనాదములు
నంజక రోదసి యందు క్రిక్కిరియ
నప్పురిపై భీషణాశుగ వృష్టి
కుప్పఁదెప్పలు గాఁగ గురియించెఁ గడిమి
పలుమారు మఱియు సౌభంబుననుండి
శిలలు వృక్షంబులుఁ జెదరక కురిసె
శర్కరా పవనంబు సారెకు విసరె
కర్కశంబై ద్వారకాపురి మీద
విలయ కాలాభీల విభ్రమం బిటుల
బలిమియై సాల్వ భూపాలుండు చూప
శ్రీకృష్ణుని కుమారుఁడు ప్రద్యుమ్నుడు ప్రజల సంతాపమును పోగొట్టుటకై యాదవ వీరులతో కలిసి సాల్వునితో యుద్ధము సేయుట
నంతయుఁ బ్రద్యుమ్నుఁ డారసి జనుల
సంతాప ముడుప నుత్సాహంబు పూని
[154] భయము ఏది- భయము విడిచి
1131
చారుదేష్ణుండునుసాత్యకి సాంబ
వీరులుఁ దగ భానువిందు లక్రూర
హార్దిక్య శుక సారణాదులు వైరి
మర్దనుల్ తనుఁగూడి మహిమతో నడవ
దారుక తనయ సూతంబైన రథము
నారోహణము సేసి యతులంబులైన
కవచ కార్ముక దండ కాండముల్ పూని
రవితేజ మలర భోకనఁ బురి వెడలి
లలితాంగ భీమతాలక్షిత గతులఁ
జెలరేఁగు సాల్వునిసేనలుం దాఁకి
యతని సేనాపతియైన ద్యుమంతు
వితత సాయక పంచవింశతిఁ బొదివె
కనక పుంఖోజ్జ్వలకాండ శతంబుఁ
జొనిపె సాల్వుని మేనఁజోద్యంబుఁగాఁగ
పదియేసి బాణముల్ప్రౌఢి నంటించెఁ
గదిసి యూధపుల యంగంబుల యందు
కరకరి గజ తురంగంబుల నెల్ల
యఱుముక మూడేసియమ్ముల నేసె
వొక్కొక్క కరమున నొక్క యుఁమ్మడినె
యుక్కర సకల సైన్యులఁ బ్రహరించె
1141
తక్కక యయ్యద్భుతంబు వీక్షించి
యొక్కట వినుతించి రుభయ సైనికులు
అంతవిమానస్థుఁడగు సాల్వ నృపతి
యంతంతఁ బొడ చూపు నవనిపై నిలిచి
దివమున కెగసె వర్తించుఁ జిత్రముగఁ
దవిలి పయోధరాంతరములఁ గలయ
యెదిరించిఁ బ్రద్యుమ్ను నెక్కటి నంత
మదవంతుఁడైన ద్యుమంతుండు మెఱసె
యదుటునఁ గొంత యాహవ మొనరించి
గదనక్కుమారు వక్షము వడిమోది
మోదిన నమ్మహాత్ముఁడు దనమేన
నూదిన మూర్ఛచే నొఱగుచు నుండఁ
దలపోసి యారణస్థలమున నుండి
తొలఁగంగఁదోలె సూతుఁడు రథం బపుడ
అంతఁబ్రద్యుమ్నుండు నల్లన తెలిసి
యంతికంబున నున్నయాసుతుఁ జూచి
బాలక! సమర భూభాగంబు విడిచి
యేలనా యరదంబు నిట తెచ్చి తిటుల
యదుకులీనులకు నాహవమున నుండి
కదలి పోవుట రీతిగాదెట్టి యెడల
1151
యీతెఱంగున జారియేఁగిన వాఁడ
మాతండ్రి మొగమెట్టి మతమునఁ జూతు
వడినా ద్యుమంతుండు వరలు నచ్చటికె
కడపుము నా తేరు గాంభీర్య మలర
అనుటయు సూతుండు నలరి యౌగాక
యనిద్యుమంతునిఁ జేర నరదంబుఁ దోలె
ఆరుక్మిణీ సుతుఁ డంతద్యుమంతు
నారూఢి నెనిమిది యమ్ముల నొంచె
నవ్వుచు రయమున నాల్గు బాణముల
నవ్వైరి హయముల హతి నొందఁజేసె
వొక్కింతఁ దడవులో నొక్క యమ్ముననె
యక్కజంబుగఁ ద్రుంచె నవ్వీరు సూతు
నొక్కొక్క యమ్మున నరుదని పొగడఁ
దక్కక ద్రుంచె కోదండకేతువుల
మఱియొక్క యశని సమాన బాణమున
నెఱిద్రుంచె నవ్వాహినీపతి శిరము
ఆలోన సాంబ సాత్యకి గద ప్రముఖ
లాలంబులో నొంచిరాసాల్వు బలము
యీరీతి నిరువదియేడునా ళ్ళతుల
సారుఁడా హరిసూతి సాల్వుని తోడ
1161
యదువీర సహితుఁడై యాహవ కేళి
యొదవిన ముదముతోనొనరించుచుండ
ధర్మనందనునిచే రాజసూయాధ్వరమును పరిపూర్తి గావించి శ్రీకృష్ణుఁడు ద్వారకకు తరలి వచ్చుట
ఆపాండునందను నధ్వరం బటుల
నాపూర్ణ మగుటయు నాత్మ నింపొదవ
అమిత బలాన్వితుండైయాత్మ పురికిఁ
గమలనేత్రుండునుఁ గదలి యేతెంచె
పురమున కేతెంచి పురి చుట్టువారఁ
బరువులు వారు నబ్బలములం జూచి
అవని నారసమున సహితు విమాన
మవలీలఁ దిరుగు సోయగమునుఁ గాంచి
తనను శతాంగంబుఁ దారకు చేత
ననువుగాఁ దోలించె నాసాల్వు మీద
శ్రీ కృష్ణుఁడు సాల్వునితో యుద్ధం చేసి యాతనిని సంహరించుట
ఆసాల్వ నృపతియు నట్లెదుర్పడిన
వాసుదేవునిఁ గాంచి వాఁడిమి చెడక
పంకజాక్షుని సూతుపైఁగఠోరముగ
హుంకార మొనరించి యొక యీటె వైచె
కపట నాటక సూత్రకర్త యా శక్తి
నపుడ చూర్ణము సేసె నమిత బాణముల
పనియాఱు[155] శితకలంబముల నొప్పించె
ఘనయుక్తుఁ డగు సాల్వమహిపతి నలుక
[155] పనియీఱు- పదియాఱు, పదహారు
1171
హరివామబాహువునందు సాల్వుండు
సరభసంబుగ నొక్కశరము నాటించె
శరహతి వేదనం జయ్యన హరికిఁ
గరమున నున్న శార్ఙ్గము జారిపడియె
అదిచూచి యదువులు హాహా యటంచు
వొదవించి రారావములును గలంగి
అపుడ గర్జనము బెట్టడరించి సాల్వ
నృపతి గర్వమున నాకృష్ణు నిట్లనియె
సాల్వుఁడు శ్రీ కృష్ణుని చెయిదములను ఖండించి ‘నీకు మోక్షమును గ్రహించెదను ర’ మ్మని వీరాలాపము లాడుట
“తనదు మిత్రుని కళత్రముఁ దెచ్చికొంటి
జనులనువర్తించు జాడ వోవిడిచి
కడపట వానినే కలుష వర్తనత
నడచితి మొగమాట మణువైన లేక
అగుఁగాక యేమి నాయగ్రంబు నందు
తెగువమై నిట్టి బుద్ధిన నిల్చితేని
అపునరావృత్తిగా నమరించు నిన్ను
నిపుడ నీ చుట్టంబు లెల్ల వీక్షింప”
శ్రీకృష్ణుఁడు సాల్వునికి సరియైన సమాధానము చెప్పుట
అనుటయుం గృష్ణుఁడు హసియించి, “యోరి!
జనపరాధమ శూరజనుఁ డెట్టియెడల
పెమ్మెలు[156] వలుకునే పేర్చిన శక్తి
సమ్మతంబుగఁ జోపి జయమొందుఁ గాక”
[156] పెమ్మెలు- గప్పాలు
1181
అనుచు నలాత[157] చక్రాకృతి భ్రాంతి
ననువొందు సౌభంబునందు నృపాలు
భిదురోపమేయతాభీకరంబైన
గదచేత జత్రుభాగము[158] నందు మోఁదె
అతఁడును నగ్గదాహతిఁ జాల నొచ్చి
తతధారమగుచు రక్తము నోరవడియ
సౌభంబుతో నదృశ్యత నొందెఁ బద్మ
నాభశౌర్యమున నెంతయు భీతి నొంది
సాల్వుఁడు మాయతో కూడిన కపట యుద్ధనీతిని మాయావి యైన శ్రీకృష్ణునిపై ప్రయోగించుట
ఆవేళ నొక్కఁ డా హరిఁ జేర వచ్చి
“దేవకీదేవి పుత్తెంచె నన్న నుచు
నానతుండై, యార్యుఁడగు వసుదేవు
నీనీచుఁడగు సాల్వుఁడిట పట్టి తెచ్చె”
ననునంత సాల్వుండు నంబర వీథి
గనఁబడి మాయ చేఁగల వసుదేవు
చూపుచు, “నోశౌరి! చూడు మీ జనకు
వేపొలియింతు నావిక్రాంతి” ననుచు
కపటపు వసుదేవుఖండించి మఱియు
నపుడ త్రుంచి తదుత్తమాంగంబుఁ గొనుచు
సౌభంబు సొచ్చె, నాశౌరియు నిట్లు
ప్రాభవంబున సాల్వపతి సేయు మాయ
[158] జక్రుభాగము- మెడ మూపురము మధ్య భాగము
సాల్వుని మాయకు కారణమైన సౌభంబును గదచే తునాతునకలు చేసి, సుదర్శనముచే శ్రీకృష్ణుఁ డాతని శిరస్సును ఖండించుట
1191
తెలిసి నవ్వి సమగ్రదీప్త రోషాగ్ని
వలమాన మానసవర్ణితుం డగుచు
చదలఁ ద్రిమ్మరునట్టి సాల్వు సౌభంబు
గదచేతఁ బొడిసేసెఁ గడలిలోఁ బడఁగ
నపగత సౌభుఁడై యాసాల్వ భర్త
యపుడ గదాదండ మలరఁ గైకొనుచు
యెదురుగా జనుదేర నీక్షించి శౌరి
గదయున్న చై సాయకంబునం దునిమి
ప్రకటించి త్రుంచెఁ జక్రంబున నతని
సకిరీటకుండలోజ్జ్వల మస్తకంబు
జనులెల్ల యజవాద సాధువాదముల
నొనరించి రపు డమర్త్యుల యట్ల కదిసి
తనమిత్రుఁడు సాల్వుఁడు రణనిహతుఁడు కాగా దంతవక్త్రుఁడు శ్రీకృష్ణునిపై పగ దీర్చుకొనుటకు యుద్ధ రంగమున దిగుట
అటుల సాల్వుఁడు రణహతుఁడైనఁ జూచి
కుటిలుండు దంతవక్త్రుఁడు చాల నలిగి
పగదీర్చికొనఁ బూని ప్రళయార్క బింబ
ధగధగాయితము లెంతయు మించునట్టి
మణిగణ ఖచిత హేమరథంబు మీద
గణుతింపఁ దగు కార్ముకము పూని నిలిచి
పెనుపొందు నిస్సాణ భేరీ మృదంగ
నినదంబు రోదసి నెఱి వ్రయ్యసేయ