ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్యాపరిణయము
అగ్నిజిత్తుండను నా రాజు తనయ
నగ్నిజిత్తాఖ్య నాయబ్జలోచనుఁడు
కడు వేడ్కతోఁ బెండ్లిగానిచ్చఁగోరి
కడఁకఁ గోసలపతికడకేఁగె నతఁడు. 520
కొనకొని హరి నెదుర్కొని తోడుకొనుచుఁ
జని యిష్టపూజల సంప్రీతుఁజేసి
“కారుణ్య గుణపూర్ణ! కల్యాణశీల
వారిజోదర! లోకవంద్య! శ్రీకృష్ణ!
నా యింటి కరుదెంచి నన్ను మన్నించి
తే, యుగంబులయందు నేఁ గృతార్థుండ
నేమి విచ్చేసితి రెరిగింపు”మనినఁ
దామరసాక్షుఁడాతనికిట్లు జెప్పె.
“నీ కూఁతు సత్య నున్నిద్రాంబుజాక్షి
మాకు ని”మ్మనిన నమ్మనుజేంద్రుఁ డనియె.
“హరి! నీవు మా యింటి యల్లుండవౌట
పరమ కౌతుకము మా బంధులకెల్ల
నీ పట్టణంబున నేడు శాశ్వతము
నేపారు నురు వృషభేంద్రంబు లిట్లు
శాతశృంగోత్తుంగ చటుల సత్వమున
భూతలాధీశులఁ బొలియించుచుండు
వాని నేడింటిని వసుధపైఁ గూల్చు
వానికిఁగాని యీ వనిత నీననుచు
నొక వెఱ్ఱితనమున నున్నాఁడ గాక
యకలంక! నీ కంటె నధికులు గలరె? 530
ఈకొని యుంకువ యిద్ది యొండొల్ల
నీకసాధ్యంబేది? నీరజోదరుఁడ!
అని లోన నాఁబోతు లన్నింటి నడఁచి
పెనుపార నీకన్యఁబెండ్లిఁగ”మ్మనిన;
హరి యేడురూపుల నాఁబోతుఁ గమిసి
పరువడి లేఁద్రాటఁ బట్టి బంధించి
ధరఁ గూల్చి పేర్చిన దైత్యారిఁ జూచి
పురజనులద్భుతంబును బొంది చూడ
నా పౌర కామినులంబుజోదరుని
చూపు చెంగలువల సొరిదిఁ బూజింప
నీ కృష్ణుఁడిట దానె ఏతెంచి పొందు
నీ కన్య సౌభాగ్య మెట్టిదో యనఁగ!
శుభలగ్న మరుదేర సుందరీతిలక
నభినవంబుగఁ బెండ్లియయ్యె మురారి.
అతి సంభ్రమంబున నా కోసలేంద్రుఁ
డతిశయంబుగఁ గన్యకరణంబుగాఁగఁ
బదివేలు గోవులఁ బదివేలు కరుల
విదితంబుగా మూఁడువేల యింతులను
జటులవాహముల వింశతిసహస్రముల
పటుశతాంగంబులు పదివేలనిచ్చి 540
యనిచి వుత్తేరంగ నంబుజోదరుఁడు
వనితఁ దోడ్కొని ద్వారవతి కేఁగుదెంచి
సత్యయుఁ దానును సౌబాగ్యలీల
నత్యుదాత్తత సుఖంబందె మురారి