ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్రాజిత్తు సత్యభామను శ్రీ కృష్ణునకు భార్యగా నర్పించుట
తనకూఁతు సత్య నుత్తమగుణాభరణఁ
దనరార గైసేసి తనవారుఁ దాను
మణితోడఁ గామినీమణి నొప్ప నిచ్చి
యణిమాదిగుణపూర్ణుఁడగు హరి కనియె.
“పరమేశ! నా కూర్మిపట్టి యీకన్యఁ
బరిణయంబై రవిప్రభ నొప్పుమణియు
ధరియింపు” మన్న మాధవుఁడా నరేంద్రుఁ
గరుణించి నెమ్మోముఁ గనుఁగొని పలికె. 410
“అరులు మిత్రులు నాకు నరయంగ లేరు
పరమాప్తుఁడవు మాకుఁ బావనచరిత!
ఈనాతి నిమ్ము నాకిమ్మహారత్న
మేనొల్ల నేనీకు నిచ్చితి” ననుచు
నాతని కర్పించి యాసత్యభామఁ
బ్రీతిని బెండ్లాడె పీతాంబరుండ.
సత్యభామయుఁ దాను సంప్రీతి తోడ
నత్యుదాత్త సుఖంబు లందె మురారి.