ద్విపదభాగవతం - కల్యాణకాండ : బిలద్వారమందుండిన పౌరులు పురమున జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట
చెన్నార వెన్నుని సేవించి వచ్చి
మున్ను బిలద్వారమున నున్న పౌరు
లాకంజలోచనుఁడాపెడ నడఁగి
రాకున్న బెగడి పురంబున కరిగి
యావార్త నెఱిఁగింప నఖిలబాంధవులు
దేవకియును వసుదేవుఁడుఁ గలఁగి
దేవతాగణముల ద్విజలోకతృప్తిఁ
గావించిరంత; నా కమలలోచనుఁడు
ద్వారకాపురి సొచ్చి తగ నుగ్రసేను
నారూఢగతిఁ గాంచి యందఱుఁ జూడఁ
బ్రీతి సత్రాజిత్తుఁ బిలిచి ప్రసేనుఁ
డాతల వని మృతుఁడైన చందంబు
మరి జాంబవంతుఁడు మణి హరించుటయు
నరయ నాతఁడు కయ్యమాడిన తెఱఁగు
నచ్చుగా నెఱుఁగించి యతనికారత్న
మిచ్చి మనోవ్యధ నెడలె మురారి. 400
ఉత్తములగు వారికొక నింద వొడమ
నుత్తలపడి తీర్పకోర్తురే నిలువ!
అంత సత్రాజిత్తుఁ డమ్మణి దాన
వాంతకుచేఁ గొని యంతరంగమున
సిగ్గును దుఃఖంబుఁ జిడిముడిపాటు
నగ్గలంబొదవ నిట్లని విచారించె.
“అక్కటా! శ్రీనాథు నఖిలలోకేశు
నెక్కటి నిందించి నృపకోటిలోనఁ
బాపంబు సేసితిఁ బద్మాక్షుచిత్త
మేపాటి నొచ్చెనో యేమిగాగలదొ?
హరిమానసము రోషమడఁగెడు నట్టి
వెరవేదియో” యని వి(న)పాటు నొంది