ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణునిపై మాపటీడు మదగజమును బురికొల్పుట
వికసితపుష్కరవిభవంబుఁ జెంది
యకుటిలదీర్ఘశృంగారూఢి నొప్పి
మానుగా వంశాఢ్యమహిమఁ జెన్నొంది
దాన నిర్జర లీలఁ దనుపారఁ బేర్చి
పొడవు తక్కువగాని భూధరేంద్రంబు
వడువునఁ జెలువారు వరశక్తిచేత
నష్టదిగ్గజముల నాపంగనోపు
నష్టమదాపూర్ణమై పేర్చుకరణి - 120
కువలయపీలంబు కోరి యా శాల
నవిరళంబుగ నిల్చి యతికౌతుకమున
నెదరుచూచుచునుండె నెంతయు వేడ్క.
యదుకులోత్తంసులు హలియును హరియు
రమణీయ జలజాకరమునఁ గ్రీడింప
గమనోగ్రగతి వచ్చు గజయుగ్మమనఁగఁ
గరియూధముల మీఁద కలుషించి వచ్చు
హరికిశోరద్వయమనఁ బెంపు మిగిలి
పౌరులుఁ దముఁ జూచి బహుభంగిఁ బొగడ
నారూఢరంగము నటు డాసిశౌరి
యరుదారఁ దెరువున కడ్డంబు వేర్చు
కరిఁ జూచి మావంతుఁ గనియు నిట్లనియె.
“ఈ కరిఁ దొలగించి యిటఁ ద్రోవఁ జూపు
మా కంసుకడకు మా కరుగఁ గావలయుఁ
బోవనీకుండినఁ బొరిపుత్తు” ననిన;
మావంతుఁ డంత నర్మరుషంబుతోడఁ
గరిపతి హరిమీఁదఁ గదియింప నదియుఁ
దిరిగి మహోద్దండతీవ్రతుండంబుఁ
బ్రసరింపుచును గృష్ణుఁ బటుశక్తి నొడియ
నసమసత్వుఁడు కృష్ణుఁ డటఁ దప్పఁ గ్రుంకి. - 130