ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరాముఁడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా హస్తినాపురికి వెడలుట
కరిఘోటరథభటోత్కరములతోడఁ
గరిపురిపై దండుగదలుటఁ జూచి
బలభద్రుఁ డది “యెంతపని మీరలేమి
తలఁచి కౌరవులపై దండుపోయెదరు?
యాదవులందు నెన్నడు కౌరవులకు
భేదంబు లేనిచోఁ బ్రీతి నందెఱిఁగి
యేమిసేసిన వార లేమన్న వారొ!
ఆమార్గ మెల్లను నఱసి సామమునఁ
దెలిసి సాంబునిఁ దోడితెచ్చెదఁగాని
కలహంబునకుఁబోవ కారణం బేమి?”
అని వారి వారించి యట రథం బెక్కి
చనియె నుద్ధవుఁడు తోఁజనుదేర సీరి.
అరిగి వారణపురోద్యానంబులందు
కరమొప్ప విడిసి యక్కామపాలుండు - 280
దనరాకఁజెప్పి యుద్ధవుఁ బంపుటయును
జని యమ్మహాత్ముఁడాస్ధానంబు నందుఁ
గురురాజు సచివు శకుని దుస్ససేను
గురు భీష్మకృపబాహ్లీకులు గొలువంగఁ
గొలువున్న యతనిఁ గన్గొని పొడచూపి
భలభద్రురాక నేర్పడ జెప్పుటయును;
నతిసంభ్రమంబున నందఱుఁగూడి
యతని సన్నిధికేఁగి యర్ధిఁబూజించి
సేమంబులడిగి యాసీరి నీక్షించి
“యేమివిచ్చేసితి రెఱిఁగింపుఁ”డనిన
ధార్తరాష్ట్రులును బాంధవులును వినఁగ
నార్తరక్షణశీలి హలపాణి పలికె.
“కోరి మామేనత్త కొడుకులు మీరు.
ఆరూఢి మీకు మేనల్లుఁడుగానఁ
దన మేనమఱఁదలి దరళాయతాక్షిఁ
జనవునఁ గొనిపోయె సాంబుఁడు దీనఁ
గలఁగి విరోధింపు టర్హంబుగాదు
వెలఁదితో నాతని విడిచి తెం”డనిన.
అల్లన నవ్వుచు నాసుయోధనుఁడు
ప్రల్లదంబున బలభద్రుతో ననియె. - 290