ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరామ ద్వివిదుల ద్వంద్వయుద్ధము
తాలాంకుఁడొకరాత దర్పించి వైన
నాలోనఁ గోపించి నతనిపై కుఱికి
చీరలు జించి యాసీధుభాండంబు
బోరనఁ బగులంగఁ బొడిచి దాఁకుటయు;
కామపాలుఁడు వానిఁ గడకతోఁ బట్టి
వేముష్టిఁ బొడిచిన వికవిక నవ్వి
ప్రళయకాలోత్తాలభైరవుభంగి
బలియుఁడై మైవచ్చి బలున కిట్లనియె.
“నలినాక్ష! యేరీతి నాఁడు నామిత్రుఁ
దలమీరి నరకు నుద్దండతఁ జంపి
వచ్చితి నేనేఁడు వచ్చిన వాఁడఁ
జెచ్చెర సనురంబు సేయు నాతోడ!
తనరార మైందుని తమ్ముఁడ ద్వివిదుఁ
డనువాఁడ శూరుఁడ నర్కజు మంత్రి
రామునకై పూని రావణుతోడ
భీమాహవము సేసి పేర్చినవాఁడ
నెలకొన్న రణవీధిని ద్రుంచివైవఁ
గెలసి నాచెలికాని కెలసంబుఁ దీర్తు.” - 240
అనిపల్కియార్చి మహాశూలమెత్తి
కొని వైచుటయు సీరి క్రుంకి మైఁదప్పి
ముసలంబుఁగొని బెట్టు మోదిన వాఁడు
వెస మహాతరువెత్తి వేసి యార్చుటయుఁ
దప్పించుకొని సీరి తరుచరుమీఁద
గుప్పించి యుఱికి ముక్కున ముష్టిఁ బొడువ
తెరలక వానరాధిపుఁ డొక్క పెట్టు
తరుణులు బెగ్గిలఁ దరువృష్టిఁ గురిసె
లాంగూలమున వ్రేసి లలి నఖాగ్రమున
నంగంబుఁ జీరి మేనందంద కఱచి
పిడికిటఁ బొడిచినఁ బెనుమూర్ఛ నొంది
పడిలేచి యాబలభద్రుఁ డాతనిని
గళమున జిక్క నాగలి దగిలించి
యలుకమై రోఁకట నందంద పొడువ
హనువులు పగిలి మైయదటెల్లఁ బొలిసి
కనుమూసి నెత్తురు గ్రక్కిరోఁజుచును
బవిదాఁకి కూలిన పర్వతంబనఁగఁ
బ్లవగేంద్రుఁ డిలఁగూలి ప్రాణంబు విడిచె.
ఉవిదలందఱు వెఱఁగంది కీర్తింప
దివిజసంఘము రాము దీవించిరంత - 250
నలిన నేత్రుండున్న నగరికేతెంచి
హలి కృష్ణుతోడ నయ్యగచరు వార్త
వినుపింప శౌరియు వివిధ బాంధవులు
వినుతు లొనర్చిరి వెసరామునంత