ప్రథమాశ్వాసము : శంకరుండు దక్షునకు శాపం బిచ్చుట
1-163-సీ.
కైలాసగిరిమీఁద కఱకంఠుఁ డొకనాఁడు
వెఱ్ఱితనము వచ్చె వేయు నేల.
యిది యేమి రాదయ్యె నీ యేణలోచన
యని యవ్విధం బెల్ల నాత్మ నెఱిఁగి
సుందరి తనకుఁ గూర్చుట యెల్ల భావించి
శంభుండు మనమునఁ జాల నొచ్చి
యిది యేమి పంపితి నీ దక్షు నింటికి
మీనాక్షి తా నేల మేను వాసె
1-163.1-ఆ.
పొలఁతి నిన్న నేను బొమ్మని తరిమినఁ
బోవ నొల్ల ననియెఁ బువ్వుఁబోఁడి
పంకజాక్షి నొంటిఁ బంపిన కతమున
వెఱ్ఱితనము వచ్చె వేయు నేల.
టీక :-
కరమొప్ప = మిక్కిలి ప్రకాశించు; ఏణలోచన = నల్లజింక వంటి పెద్దకన్నులు కలది; మీనాక్షి = చేపలవంటి కన్నులు కలది. పొలతి = అందమైన స్త్రీ; ఒల్లను = వెళ్ళను; పువ్వుబోడి =పూవు వంటి శరీరము గల స్త్రీ; పంకజాక్షి = బురదలో పుట్టిన తామర వంటి కన్నులు కలది.
భావము :-
కైలాస పర్వతంమీద ప్రకాశవంతంగా కొలువైన గరళకంఠుడు ఒకనాడు గౌరి గురించి ఆలోచిస్తూ “ఇదేమిటి లేడి కన్నులు గల ఈమె ఇంకా రాలేదు” అనుకుని జరిగిన విషయాన్నంతా మనసులో గ్రహించినవాడై, తనపై సుందరి ఉమాదేవికి గల ప్రేమను తలచుకొని శివుడు మనసులో చాలా బాధ పడ్డాడు. “నేను ఎందుకు పంపాను? మీనాక్షి దేహాన్ని ఎందుకు విడిచిపెట్టింది? నేను వెళ్ళమంటే తాను వెళ్ళనంది. నేనే బలవంతంగా పంపాను. వేయి మాటలెందుకు పంకజాక్షి పార్వతిని ఒంటరిగా పంపినకారణమున వెఱ్ఱివాడి నయ్యాను”.
1-164-వ.
అని మఱిఁయుఁ బరమేశ్వరుండు గౌరీదేవి ననంత కరుణాపూరిత మానసుం డై తలంచి వెండియుఁ దన మనంబున.
టీక :-
వెండియు = మరియు.
భావము :-
అనుకుని పరమేశ్వరుడు గౌరీదేవిపై చాలా జాలిపడి, మరలా తన మనస్సులో.....
1-165-మ.
పుడమిన్ రాజ్యముఁ గోలుపోయి తగ నేడ్పుం బొంది శోకించు న
జ్జడధీశాంతకుఁ డైన యింద్రుని కిలన్ జన్మించి రోషాంబుధిం
బడవైవస్వతమన్వు నాఁడు ముదమొప్పన్ రాజ్యముం జేయఁగాఁ
గడతేర్తున్నని పాప దక్షునకు వేగన్ శాప మిచ్చెన్ వడిన్.
టీక :-
పుడమి = భూమి; శోకించు = దుఃఖించు; జడుడు = మూర్ఖుడు; జడధీశాంతకుడు = జడధి (వ్యు. జడా ధీః అస్య, బ,వ్రీ. మందమతి కలవాడు, ఆంధ్రశబ్ధరత్నాకరము, మందుడు) ఐన ఈశ (ప్రభువలను) అంతకుడు (అంతముచేయువాడు); ఇల = భూమి; రోషాంబుధి = కోపమనెడి సముద్రము; ముదము = సంతోషము; కడతేర్చు = నశింపచేయు; వడి =వేగము.
భావము :-
“భూమిపై రాజ్యాన్ని కోల్పోయి దుఃఖాన్ని పొంది ఏడుస్తావు. మూఢుడైన నీవు మందబుద్ధులైన రాజులను అంతంచేసేవాడైన ఇంద్రునికి భూమిపై జన్మించి కోపిష్టివై వైవస్వతమన్వంతరములో సంతోషంగా రాజ్యమును పాలించునపుడు నేను నిన్ను చంపుతాను.” అని పరమేశ్వరుడు
1-166-వ.
ఇట్లు పరమేశ్వరుండు శాపం బిచ్చిన దక్షుండు దదీయ ప్రకారంబు నొందె నంత.
టీక :-
తదీయ ప్రకారంబు = అదే విధముగా.
భావము :-
ఇలా శివుడు శాపమీయగా దక్షుడు ఆ విధంగా పొందాడు.