పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భాగవత షష్ఠ్యంతాలు

1-29-ఉ.

హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

టీకా:

హారి = హారాలు ధరించువాని; కిన్ = కి; నంద = నందుని; గోకుల = గోకులములో; విహారి = విహరించువాని; కిన్ = కి; చక్ర = చక్రము వలె తిరుగు; సమీర = గాలి - సుడిగాలి రూపధారియైన; దైత్య = రాక్షసుని - తృణావర్తుని; సంహారి = సంహరించినవాని; కిన్ = కి; భక్త = భక్తులయొక్క; దుఃఖ = దుఃఖమును; పరిహారి = తీసివేయువాని; కిన్ = కి; గోప = గోపాల వంశములో పుట్టి; నితంబినీ = స్త్రీల యొక్క {నితంబిని - గొప్ప పిరుదులు కలామె, స్త్రీ}; మనస్ = మనసులని; హారి = గెలిచినవాని; కిన్ = కి; దుష్ట = దుష్టుల; సంపద్ = సంపదను; అపహారి = అపహరించువాని; కిన్ = కి; ఘోష = గొల్లల; కుటీ = ఇళ్ళలోని; పయః = పాలు; ఘృత = పెరుగు; ఆహారి = తినేవాని; కిన్ = కి; బాలక = పిల్లలను; గ్రహ = పట్టుకొనే; మహా = మహా; అసుర = రాక్షసియైన; దుర్ = చెడ్డ; వనితా = స్త్రీని - పూతనని; ప్రహారి = చంపినవాని; కిన్ = కి.

భావము:

మనోహర హారాలు ధరించువాడికిం; నంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.

1-30-ఉ.

శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల క్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

టీకా:

శీలి = శీలము కలవాని; కిన్ = కి; నీతిశాలి = నీతి స్వభావము గలవాని; కిన్ = కి; వశీకృత = వశపఱచుకోబడిన; శూలి = శివుడు గలవాని; కిన్ = కి; బాణ = బాణాసురుని; హస్త = చేతులను; నిర్మూలి = నిర్మూలించినవాని; కిన్ = కి; ఘోర = భయంకరమైన; నీరద = మేఘాల నుండి; విముక్త = వర్షించిన; శిలా = రాళ్ళచే; హత = కొట్టబడిన; గోప = గోపాలురను; గోపికా = గోపికల; పాలి = పరిపాలకుని; కిన్ = కి; వర్ణ = వర్ణములను {చతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర}; ధర్మ = ధర్మములను {ధర్మము - వేదధర్మము}; పరిపాలి = పరిపాలించేవాని; కిన్ = కి; అర్జున = మద్ది; భూజ = చెట్ల; యుగ్మ = జంటను; సంచాలి = కదిలించినవాని; కిన్ = కి; మాలి = మాలలు ధరించిన వాని; కిన్ = కి; విపుల = పెద్దదైన; చక్ర = చక్రముచే; నిరుద్ధ = అడ్డగింపబడ్డ; మరీచి = సూర్యకిరణములనే; మాలి = మాలికలకి కారణభూతి; కిన్ = కి.

భావము:

శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి.

1-31-ఉ.

క్షంకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

టీకా:

క్షంత = క్షమించు వాని; కున్ = కి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల = పెద్ద; ఫణా = పడగల; వళి = సమూహమందు; నర్తన = నాట్యము; క్రియా = చేయుటలో; రంత = క్రీడించే వాని; కున్ = కి; ఉల్లసన్ = ఉల్లాసము చెందిన; మగధ = మగధకు; రాజ = రాజు యొక్క - జరాసంధుని; చతుర్ = నాలుగు; విధ = అంగములతో - చతురంగబలాలతో {చతురంగబలములు - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన}; ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంత = చంపినవాని; కున్ = కి; ఇంద్ర = ఇంద్రుని; నందన = కుమారుడైన అర్జునుని; నియంత = నడిపించేవాడి; కున్ = కి; సర్వ = సకల; చర = కదల గలవాటి; అచరా = కదల లేనివాటి; ఆవళీ = సమూహము (జగతి గురించి); మంత = తలంచు వాడు; కున్ = కి; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల; సమ = బాగుగా; అంచిత = పూజించు; భక్త = భక్త; జన = జనులను; అను = అనుసరించి; గంత = నడచువాని; కున్ = కి.

భావము:

క్షమాగుణశీలికి; కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని, పార్థుని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

1-32-ఉ.

న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

టీకా:

న్యాయి = న్యాయమైనవాని; కిన్ = కి; భూసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠుని; మృత = చనిపోయిన; నందన = పుత్రుని; దాయి = తెచ్చి ఇచ్చిన వాని; కిన్ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; మనస్ = మనసులో; స్థ్సాయి = ఉండు వాని; కిన్ = కి; భూత = జీవులకు; సమ్మద = సంతోషము; విధాయి = కూర్చువాని; కిన్ = కి; సాధు = మంచి; జన = వారియందు; అనురాగ = అనురాగమును; సంధాయి = కూర్చువాని; కిన్ = కి; పీత = పచ్చని పట్టు; వస్త్ర = వస్త్రములు; పరిధాయి = ధరించేవాని; కిన్ = కి; పద్మ = పద్మంలో; భవ = పుట్టిన వాడు - బ్రహ్మా; అండ = అండముల; భాండ = కోశము; నిర్మాయి = నిర్మించేవాని; కిన్ = కి; గోపికా = గోపికల; నివహ = అందఱి; మందిర = ఇళ్ళకు; యాయి = వెళ్ళేవాని; కిన్ = కి; శేషశాయి = శేషతల్పంపై శయనించేవాని; కిన్ = కి.

భావము:

న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.

విశ్లేషణ:-

   షష్ట్యంతాలు అంటే కావ్యాన్ని అంకితం ఇచ్చే సందర్భంలో వ్రాసిన పద్యాలు. ఇక్కడ పోతన కావ్యాన్ని రాముని ఆజ్జతో వ్రాసి శ్రీహరికి అంకితం ఇచ్చాడు. ఆపద్యాలన్నీ ఒక శిల్పి శిల్పాల్ని చెక్కినట్టు చెక్కాడు పోతన్న.

   మొదటగా నాలుగు పద్యాల్ని ధర్మానికుండే నాలుగు పాదాలైన సత్యము, శీలము, దయ, న్యాయముగా విభజించేడు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పద్యానికి వర్తింపజేస్తూ ధర్మాన్ని నాలుగుపాదాల నడిపించమని ఆ శ్రీహరిని వేడుకున్నాడు. అంత్యప్రాసలతో అత్యంత సుందరంగా వర్ణించేడు. మనకి ఒక సందేహం రావచ్చు. మొదటి పద్యంలో సత్యం గురించి చెప్పలేదుకదా. నాలాంటి మందబుద్ధులు ఉంటారని పోతనకి బాగా తెలుసు. అందుకోసమే ముందుగానే చేతులారంగ అనే పద్యాన్ని వ్రాసేడు. అందులో క్రమాలంకారాన్ని అన్వయింపజేస్తే దయను శివుని గాను సత్యాన్ని హరి గాను తెలుసుకోవచ్చు. ఆ నాలుగు పద్యాల్లోనే కృష్ణలీల లన్నీ వర్ణించేడు. గోకులం నుంచి కృష్ణావతార సమాప్తి వరకు చెప్తూ కృష్ణ మూలము అన్న పదాన్ని సార్ధకం చేసేడు. మొదటి పద్యం లో హారి అన్న పదం ప్రతి పాదానికి రెండు సార్లు వస్తుంది. హరికి, లక్ష్మీదేవికి స్వాగతం చెపుతూ అడుగడుగునా (పాదం అంటె అడుగే కదా) అక్షర మాలలతో స్వాగతం పలికేడు. దాంతో పాటుగా ఆ పద్యం చదువుతుంటే ఆశబ్దంలో కొన్ని మనకి స్పురిస్తాయి. నందగోకులము అనేటప్పుడు నందకం అన్ది; చక్రదైత్య అనేటప్పుడు చక్రము; గోపనితంబినీ అన్నప్పుడు గద; ఘోష కుటీ అన్నప్పుడు శంఖం; సంపద అన్నప్పుడు లక్ష్మీ దేవి; ఇలా అర్ధంలోనే కాకుండా, శబ్ద చిత్రణ ద్వారానూ విష్ణుమూర్తిని సాలంకృతంగా మనముందు ఆవిష్కరిస్తాడు.

   పోతన తెలుగు వాడవటం మనందరి అదృష్టం. పలికిన భవహర మగునట అని తనే చెప్పేడు. కనుక . . .

-: చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనమందంరం :-

    ;  ~ కాముధ – కాకర మురళీధర్.