వ్యాసములు : పోతనవారి పంచపాది పద్యం
పంచపాది తేటగీతి - భాగవతంలో - బమ్మెఱ పోతన ప్రయోగం
బమ్మెఱ పోతనామాత్యులవారు జాతీయమహాకవి, విప్లవకవి, వారి రచనలలో అనేక ప్రయోగాలు చేసారు. ఉదాహరణకు తొమ్మిదవ స్కంధంలో మహారాజు ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్దం చేస్తాను అంటు పెద్ద కొడుకు వికుక్షిని పరిశుద్దమైన మాంసపు తీసుకొనిరమ్మని పంపిన (ఆ వికుక్షికి శశాదుడు అని పేరు వచ్చింది) సందర్భంలోని పద్యం 9-156-సీ. "ఇక్ష్వాకునకు .. " సీసం క్రింద వాడిన తేటగీతికి ఐదు (5) పాదాలు వేసారు. (ఈ పద్యం క్రింద చూపబడింది)
తెలుగు పద్యములుకు నాలుగు పాదములు ఉండుట సాధారణ లక్షణమే కాని, దానికి భిన్నంగా అధికపాదములతో వ్రాయుట ఛందోదోషంగా పరిగణింపబడదు. ఇలా తెలుగు సాహిత్యంలో నాలుగు పాదములు కన్నా ఎక్కువ పాదములతో పద్యము వ్రాయడం అరుదుగా ఐనా ఉన్న విషయమే.
9-156-సీ.ఇక్ష్వాకునకుఁ బుత్రు లెలమిఁ బుట్టిరి నూర్వు;
రమర వికుక్షియు నిమియు దండ
కుండు నాతని పెద్దకొడుకులు మువ్వు రా;
ర్యావర్త మందు హిమాచలంబు
వింధ్యాద్రిమధ్య ముర్వీమండలము గొంత;
యేలిరి యిరువదియేవు రొక్క
పొందున నా తూర్పుభూమి పాలించిరి;
యందఱు పడమటి కధిపులైరి
9-156.1-తే.
యున్ననలువది యేడ్వురు నుత్త రోర్వి
దక్షిణోర్వియుఁ గాచిరి తండ్రి యంత
నష్టకాశ్రాద్ధ మొనరింతు ననుచు నగ్ర
సుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన
మాంసఖండంబు దెమ్మనె మహితయశుఁడు.