అమృతగుళికలు : వజ్రాలు
భాగవత పద్యవజ్రాలు
పద్య సూచిక;-
అంకిలి జెప్పలేదు ;
అంగవ్రాతములోఁ ;
అంధకారవైరి ;
అంధుండైన పతిన్ వరించి ;
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ ;
అంభోజనాభున కంభోజనేత్రున ;
అక్కట! పుత్త్ర శోక జనితా ;
అక్క తల్లి చెల్లె లాత్మజ ;
అటమటమయ్యె నా భజన మంతయు ;
అడిచితివో భూసురులను ;
అణువోగాక కడున్ ;
అతిథి పోయిరామి నధిప! ;
అతుల దివ్యాన్నమైన ;
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు ;
అనుపమగుణహారా! ;
అన్నము లేదు ;
అన్నవు నీవు చెల్లెలికి ;
అన్న! శమింపుమన్న! ;
అన్నుల చన్నుల దండ ;
అన్య మెఱుఁగఁడు; తన యంత ;
అపశబ్దంబులఁ గూడియున్ ;
అమ్మా! నినుఁ జూచిన నరుఁ ;
అరయఁగ సీతాలక్ష్మణ ;
అలసితివి గదన్న! ;
(1) 10.1-1708-ఉ.
అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
భావము:-
ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.
(2) 7-188-శా.
"అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంగశ్రేణికి రక్ష చేయు క్రియ నీ యజ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంగఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.
భావము:-
“ఈ చెడు త్రోవ పట్టిన కుల ద్రోహీ, శత్రు పక్షపాతీ, మూర్ఖుడూ అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన దుష్టాంగం. వ్యాధి బారిన పడిన దుష్ట అవయవాన్ని ఖండించి, శస్త్రవైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు ఆరోగ్యం కలిగించి రక్షిస్తాడు. అలాగే, ఇతనిని చంపించి కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసిన గొప్ప మహా వీరుడు అనే కీర్తిని పొందుతాను.
(3) 1-255-ఆ.
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధమయిన జగముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదు మయ్య."
భావము:-
సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము."
(4) 1-318-శా.
అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త
ద్గాంధారక్షితినాథుకూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.
భావము:-
గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్యభావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి.
(విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది)
(5) 1-9-ఉ.
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
భావము:-
తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!
(6) 10.2-202-సీ.
"అంభోజనాభున కంభోజనేత్రున;
కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు;
దేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ;
బొందువానికి నాదిపురుషునకును
నఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ;
డయినవానికిఁ, బరమాత్మునకును,
10.2-202.1-ఆ.
ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! యమితచరిత!
భావము:-
"సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు[1]; వసుదేవు సుతుడవు[2]; దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు[3]; ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు; అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. -
[1] అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు -
[2] వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు -
[3] ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు"
(7) 1-164-ఉ.
అక్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?"
భావము:-
పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తు ఉన్నాను. అలాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చాడన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామా! అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుందో కదా."
(8) 9-582-ఆ.
అక్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన
పాను పెక్కఁ జనదు పద్మనయన!
పరమయోగికైన బలిమిని నింద్రియ
గ్రామ మధికపీడఁ గలుగఁ జేయు.
భావము:-
ఓ పద్మా ల్లాంటి కన్ను లున్న దేవయాని! ఎంతటి మహా యోగీశ్వరుల కయినా సరే ఇంద్రియాలు బలవంత మై కీడు చేస్తాయి. అందుచేత కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లి యెక్కిన మంచం ఎక్క కూడదు.
(9) 1-374-చ.
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
బటుతర దేహలోభమునఁ బ్రాణములున్నవి వెంటఁబోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?
భావము:-
అయ్యయ్యో! నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా!
(10) 1-357-క.
అడిచితివో భూసురులను;
గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;"
భావము:-
ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా? లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచినావా? శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా? పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేసావా? తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం?"
(11) 2-66-మ.
అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో,
గుణియో, నిర్గుణుఁడో, యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్.
భావము:-
ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అణుస్వరూపుడా? లేక విశ్వమంతా వ్యాపించిన మహాస్వరూపుడా? దేశకాలాదులచేత అపరిచ్ఛిన్నుడా? లేక పరిచ్ఛిన్నుడా? ఆయన సగుణుడా? లేక నిర్గుణుడా? అంటు పండితులు వ్యర్థమైన తత్త్వాన్వేషణలు చేసి చేసి చివరకి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్త్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదను.
శుకమహర్షి శ్రీహరి కృత సృష్ట్యాదుల రహస్యాలు మున్నగునవి పరీక్షిత్తునకు వివరించ ఉద్యుక్తుడు అవుతూ దైవ గురు ప్రశంస చేసిన సందర్భంలోది ఈ పద్యం. యద్భావం తత్భవతి అన్నట్లు చూసే దృష్టికి అనుకూలమైన విధంగా దర్శనమిచ్చే ఆ పరమాత్మ భక్తిమార్గంలో చేరిన వారికే ఆయా సర్వ దృష్టులలో దర్శించే సమస్తాన్ని సమన్వయం చేసి సత్యమైన తత్త్వస్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు.
(12) 9-99-ఆ.
అతిథి పోయిరామి నధిప! యీ ద్వాదశి
పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంట గాదు కుడుచుటయును గాదు
సలిలభక్షణంబు సమ్మతంబు.
భావము:-
“వెళ్ళిన అతిథి రాకపోతే ద్వాదశి పారణ మానడం ధర్మం గాదు. నీళ్ళు తాగితే భోజనం చేసినట్టు కాదు. చేయనట్టు కాదు. అందుచేత నీళ్ళు తాగడం ధర్మసమ్మతమే."
(13) 5.1-128-తే.
అతుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన
నెద్ధి వెట్టిన జిహ్వకు హితముగానె
తలఁచి భక్షించుఁగా; కొండుఁ దలఁచి మిగులఁ
బ్రీతి చేయఁడు రుచులందుఁ బెంపుతోడ.
భావము:-
భరతుడు షడ్రసోపేతమైన మృష్టాన్నమైనా ఇష్టంగానే తినేవాడు. అంతేకాని రుచులకోసం అఱ్ఱులు చాచేవాడు కాదు.
(14) 4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన;
హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం;
బరుఁడు భూతప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు;
భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట;
హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
4-43.1-తే.
కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.
భావము:-
దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు) (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.
(15) 1-529-మా.
అనుపమగుణహారా! హన్యమా నారివీరా!
జన వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
దనుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
ఘన కలుష కఠోరా! కంధి గర్వాపహారా!
భావము:-
సాటిలేని కల్యాణ గుణ హారుడా! వైరులందరు పరాజితిలుగా గల వీరుడా! సర్వ లోకాలకు స్తుతింప తగిన విహారాలు గల మహాత్మా! సీతా మానస చోరుడా! శత్రువులనే మేఘాల పాలిటి సమీర మైన వాడా! రాక్షసుల వైభవాలు విదళించే వాడా! కరడు గట్టిన కలుషాత్ముల పాలిటి అతి కఠినుడా! సముద్రుని సమస్త గర్వాన్ని హరించిన వాడా! దయతో చిత్తగించుము.
(16) 9-647-ఉ.
"అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రా
వన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్
గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!"
భావము:-
“ఓ యన్నా! అన్నం అయితే లేదు కాని కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి. తాగు నాయనా! రా నాయనా! తోటి మానవుడికి కష్టం వచ్చినప్పుడు, వాని కష్టాలను వెంటనే పోగొట్టి ఆదుకోవడం కంటె ఉత్తమమైన పని లేదు కద. నాకు అండ దండ శ్రీమహావిష్ణువు మాత్రమే సుమా"
(17) 10.1-26-ఉ.
అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో?
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
"మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.
భావము:-
“బావా! కంసా! నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా. నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి; ఆడపడుచు అని గౌరవించాలి; మధురమైన మాటలతో ఆదరించాలి; అంతేకానీ, అయ్యో ఇదేమిటి ఏవో గాలిమాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా! దయచేసి వెనక్కు వచ్చేయి. ఓర్పుతెచ్చుకో. ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించ వద్దు. నాయనా! నామాట విను నిన్ను వేడుకుంటున్నాను.
(18) 10.1-150-ఉ.
"అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.
భావము:-
"ఓ అన్నా కంసా! శాంతించవయ్యా! ఇది నిన్ను సంహరించే మేనల్లుడు అయ్యే మగపిల్లవాడు కాదు. ఈమె ఆడపిల్ల నీకు మేనకోడ లవుతుంది. ముద్దు జేయుమయ్యా! ఆడవారిని చంపుట క్షత్రియమర్యాదలకు తగిన పని కాదు కదయ్యా! కోపాన్ని చల్లార్చుకొని మహాత్ములు నడచే దారిలో నడువవయ్యా! మంచి కీర్తిమంతుడవుగా జీవించవయ్యా! నేను నీ సోదరి నయ్య! నిన్ను శరణు వేడుతున్నానయ్యా! ఈ పిల్లను వదిలెయ్యవయ్యా!
(19) 10.1-802-క.
అన్నుల చన్నుల దండ వి
పన్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ
చన్నుల మీఱిన వలి నా
పన్నులు గా కుండఁ దరమె బ్రహ్మాదులకున్.
భావము:-
ఈ హేమంత ఋతువులో పడతుల పయోధరాల చెంత ప్రజలందరు ఆపదకు లోనుగాకుండ జీవింప గలుగుతున్నారు. వాటి అండే లేకపోతే బ్రహ్మాది దేవతల కైనా చలిబాధ తట్టుకోడం సాధ్యం కాదు కదా.
(20) 10.1-332-క.
అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు;
మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీమతల్లులార!
భావము:-
తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా." తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది.
(21) 1-97-మ.
అపశబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తించుచుం
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్త్వజ్ఞ! చింతింపుమా.
భావము:-
తత్త్వవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకొన్నప్పటికీ, సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా.
(22) 1-507-క.
అమ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో
రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!"
భావము:-
అమ్మా! మనోహర అలలతో అలరారే గంగమ్మతల్లి! నిన్ను దర్శించినంత మాత్రంచేతనే మోక్షానికి పంపిస్తావని విన్నాను, కదిలి రావమ్మా! కనికరించమ్మా!"
పుణ్యంతో స్వర్గం ప్రాప్తిస్తుంది. అర్హుడైన జ్ఞాని వైరాగ్యం పొంది తగిన సమయ మెరిగి చేసిన ప్రాయోపవేశంతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మహత్యే, మహాపాపమే. పరమ జ్ఞాని పరీక్షిన్మహారాజుకి అర్హత ఉంది. శృంగిశాప మెరుగుటచే వైరాగ్యం సిద్దించింది. తక్షకవిషంతో మరణం తప్పదని తెలిసిన ఆ సమయం తగింది. పరమ పావనమైన గంగానది తగిన స్థలం. అప్పుడు అక్కడ పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశానికి సిద్ద మయ్యి గంగమ్మ తల్లిని స్తుతించేడు. పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం మహాభాగవతం చెప్పాడు. పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు.
(23) 5.2-51-క.
అరయఁగ సీతాలక్ష్మణ
పరివృతుఁడై వచ్చి రామభద్రుఁడు గడిమిం
బరఁగు నధిదేవతగఁ గిం
పురుష మహావర్షమునకు భూపవరేణ్యా!
భావము:-
ఓ పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత.
(24) 10.1-259-ఆ.
"అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!"
యనుచుఁ జన్నుఁగుడిపె నర్భకునకు.
భావము:-
ఓ నా చిన్ని కన్నా! అలసిపోయావా నాయనా! ఆకలేస్తోందా కన్నా! మంచి వాడివి కదా కన్నా! ఏడుపు ఇక ఆపు నాయనా! దా పాలు తాగి చిరునవ్వులు చిందించు కన్నా! అంటు లాలిస్తూ యశోదాదేవి పాలిచ్చింది బిడ్డడికి.