అమృతగుళికలు : పద్మరాగాలు
భాగవత పద్యపద్మరాగాలు
పద్య సూచిక;-
తోయజసంభవ నా కీ తోయమ ;
తోయములు దెమ్ము మా కీ తోయము ;
తోయరుహోదరాయ భవదుఃఖహరాయ ;
దండంబు యోగీంద్రమండల నుతునకుఁ ;
దళ దరవింద సుందర పత్రరుచిరాక్షు ;
దిక్కులు కాలముతో ;
దిటచెడి లోఁబడె దైత్యుఁడు ;
దివిజగణశరణ్యా! ;
దీనుల కుయ్యాలింపను ;
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము ;
దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత ;
ధనము లపహరించి ;
ధన్యున్ లోకమనోభిరాముఁ ;
ధర విరులు గందకుండఁగ ;
ధరణిదుహితృరంతా! ;
నడవదు నిలయము వెలువడి ;
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు ;
నమ్మితి నా మనంబున ;
నరుమాటల్ విని నవ్వుతో ;
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు ;
నా కొడుకును నా కోడలు ;
నా పట్టి పొట్ట నిండఁగఁ ;
నానానేకపయూథముల్ ;
నిగమములు వేయుఁ జదివిన ;
(1) 2-78-క.
తోయజసంభవ నా కీ
తోయము వివరింపు, చాలఁ దోఁచిన నే నా
తోయము వారికి నన్యుల
తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్.
భావము:-
ఓ బ్రహ్మ దేవుడా! నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు. నన్ను అనుసరించేవాళ్ళకి, ఈ సత్యం తెలియజెప్పి, ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను.
నారదుడు బ్రహ్మ దేవుని నీవే కదా అధిదేవుడివి. నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడుగుతున్న సందర్భంలోది ఈ పద్యం. దీంట్లో తోయము అనే పదానికి ఉన్న నీరు, విధము, పరివారము, తెగ అనే నానా అర్థాలు వాడిన పోతన గారి పలుకుల చమత్కృతి చక్కగా ఉంది.
(2) 1-460-క.
“తోయములు దెమ్ము మా కీ
తోయము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ
తోయము క్రియ జలదాహము
తోయమువారలును లేరు దుస్సహ మనఘా!"
భావము:-
“మంచి నీళ్ళియ్యి మహానుభావా! నీకు పుణ్యం ఉంటుంది. వేటాడ లే నంత దాహంతో వచ్చా నిప్పుడు. ఇంత దుస్సహ మైన దాహం ఎప్పుడూ లేదు. మా వాళ్ళా అందబాటులో లేరు. తట్టుకోలేకపోతున్నా తొందరగా ఇయ్యి."
పరీక్షిన్మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్ను డైన శమీకుని చూసి నీళ్ళి మ్మని అడిగాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగు తున్నాడో చూడండి. (సాహిత్యంలో అందా లద్దడానికి వాడేవి అలంకారాలు. ఆడంబరానికి శబ్దాలంకారం ప్రసిద్ధి. రెండు కాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థ బేధం ఉంటే అది యమకం).
(3) 4-920-ఉ.
తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరే
శాయ సరోజకేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృ
ష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే.
భావము:-
కమలనాభా! నీవు సంసార దుఃఖాన్ని హరిస్తావు. నీవు పరానికి నాథుడవు. తమ్మి పుప్పొడి వలె పసుపు పచ్చని రంగు కల వస్త్రాన్ని ధరిస్తావు. పద్మమాలికలను ధరిస్తావు. నీవు సుగుణవంతుడవు. నీవు సృష్టికర్తవు. నీవు రాక్షసులను సంహరిస్తావు. నీకు నమస్కారం".
ప్రతీకలు = పద్మం – సృష్టి, వికాసం, విజ్ఞానం; ఉదరం – వ్యక్తం కావటానికి హేతువు; పద్మనాభం – ఆది వికాసానికి కారణభూతం; సంసార దుఃఖ హరం – పునర్జన్మ రాహిత్యం; పద్మాల పుప్పొడి - జ్ఞానం; బంగారు వస్త్రం – శ్రేష్ఠ మైన ఆవరణ; పద్మపాదం - వికాసాలకి ఆధారభూతం; పద్మమాలిక - విజ్ఞాన సర్వస్వం; నీలవర్ణం - ఆకాశ తత్వం; పరాపరం – ద్వైతాద్వైతాలు; సుగుణ – త్రిగుణ అతీతం; రాక్షస సంహారం – అతి తమోగుణ హరణం; వేధస్ అంటే ప్రకృతి పురుష ఆవిర్భావ కారణభూతం; నమః – అభిన్నత్వం, సత్తు; ప్రచేతస్సులు అబేధ ధర్ములు పదిమంది – పంచేంద్రియ పంచతన్మాత్ర జన్య జ్ఞానం; తపస్సు – అకుంఠిత సాధన; విష్ణువు - విశ్వవ్యాపకత్వం; స్తుతించడం – స్మరణ.
(4) 6-336-సీ.
దండంబు యోగీంద్రమండల నుతునకు;
దండంబు శార్ఙ్ఘ కోదండునకును;
దండంబు మండిత కుండల ద్వయునకు;
దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు;
దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందు మండల ముఖునకు;
దండంబు తేజః ప్రచండునకును;
6-336.1-తే.
దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ తత్పరునకు;
దండ మురు భోగినాయక తల్పునకును.
భావము:-
యోగుల సమూహం చేత స్తుతింపబడే నీకు వందనం; శార్ఙ్గమనే ధనుస్సును ధరించినవానికి వందనం; ప్రకాశించే రెండు కుండలాలు గలవానికి వందనం; కఠినమైన కవచం కలవానికి వందనం; మదగజాన్ని రక్షించినవానికి వందనం; రాక్షసులను శిక్షించినవానికి వందనం; నిండు చంద్రుని వంటి ముఖం కలవానిని వందనం; గొప్ప తేజస్సు కలవానికి వందనం; అద్భుతమైన పుణ్యాల నిచ్చేవానికి వందనం; ఉత్తమమైన వైకుంఠంలో నివసించేవానికి వందనం; ఆశ్రయించిన వారిని రక్షించేవానికి వందనం; శేషతల్పునకు వందనం.
(5) 3-922-సీ.
దళ దరవింద సుందర పత్రరుచిరాక్షు;
సలలిత శ్రీవత్సకలితవక్షు
నీలనీరద నీలనీలోత్పలశ్యాము;
నలికులాకుల మాలికాభిరాముఁ
గౌస్తుభకలిత ముక్తాహారయుతకంఠు;
యోగిమానస పంకజోపకంఠు
సతతప్రసన్నసస్మిత వదనాంభోజు;
దినకరకోటి సందీప్తతేజు
3-922.1-తే.
సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట
హార కంకణ కటక కేయూర ముద్రి
కాతులాకోటి భూషు భక్తప్రపోషుఁ
గింకిణీయుత మేఖలాకీర్ణజఘను.
భావము:-
అప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా, నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందుచేసే వైజయంతీ మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయకమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకొన్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని (ధ్యానం చేయాలి).
(6) 7-265-క.
దిక్కులు కాలముతో నే
దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!
భావము:-
ఓ మహనీయుడైన తండ్రి గారు! ఈ దేశకాలాదుల ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.
అన్ని దిక్కులలోను తిరుగులేని నన్ను కాదని నీకు దిక్కు అయ్యేవాడు ఎవడురా అని తర్జిస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు సమాధానం చెప్తూ సృష్టితత్వాన్ని సూచిస్తున్నాడు. ప్రాస, ప్రాసపూర్వస్థానం నాలుగు పాదాలకు, యతి దాని తరువాతి స్థానాలు రెంటికి అక్షరసామ్యం వాడిన పద్యం నడక సందర్భోచితంగా ఉంది. నాలుగు దిక్కుల ఆధారం స్థిరత్వం సూచిస్తోంది. దిక్కును ఆరు సార్లు వాడుట నల్దిద్దులు పైన కింద సూచిస్తు అంతటా ధ్వనిపం జేస్తోంది. దిక్కుకి ఎల్ల లేదా అవధి, చోటు, తూర్పాది దిక్కులు, ఆధారం, అండ రక్షణ అనే అర్థాలు ధ్వనింపజేసిన తీరు అద్భుతం. ఒక్క దిక్కుకి, ఆరు దిక్కులతో వినయంగా సమాధానం చెప్పటంలో ప్రహ్లాదుని వ్యక్తిత్వ విశిష్ఠత వ్యక్తం అవుతోంది.
(7) 3-698-క.
దిటచెడి లోఁబడె దైత్యుఁడు
సటికిన్ దంష్ట్రావిభిన్న శత్రు మహోర
స్తటికిన్ ఖరఖురపుటికిం
గటితటహత కమలజాండఘటికిం గిటికిన్.
భావము:-
మెడమీద జూలుతో, శత్రువుల గొప్ప వక్షస్థలాన్ని బద్దలు కొట్టే కోరలతో, వాడియైన గిట్టల నైపుణ్యంతో, బ్రహ్మాండము అను గంట కట్టబడిన మొలతో ఉన్న ఆ యజ్ఞవరాహానికి పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు లొంగిపోయాడు.
(8) 3-1054-మా.
దివిజగణశరణ్యా! దీపితానంతపుణ్యా!
ప్రవిమల గుణజాలా! భక్తలోకానుపాలా!
భవ తిమిర దినేశా! భానుకోటిప్రకాశా!
కువలయహితకారీ! ఘోరదైత్యప్రహారీ!
భావము:-
దేవతలకు ఆశ్రయమైనవాడా! అనంత పుణ్యాలతో ప్రకాశించేవాడా! సుగుణాలు కలవాడా! భక్తులను కాపాడేవాడా! సంసారమనే అంధకారానికి సూర్యునివంటివాడా! కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడా!భూమికి మేలు చేకూర్చేవాడా! దుష్టులైన రాక్షసులను నాశనం చేసేవాడా!
(9) 8-133-క.
దీనుల కుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్
దీనావన! నీ కొప్పును.
దీనపరాధీన! దేవదేవ! మహేశా!
భావము:-
ఓ దేవాధిదేవ! ఓ మహాప్రభూ! దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా, దీనబంధు! దీనరక్షక! నీకే తగు నయ్యా.
(10) 4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము;
జలజంబులను జారుజలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని;
మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య;
మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;
దాంబరంబులను పీతాంబరధరుఁ
4-254.1-తే.
దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.
భావము:-
గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయః" అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధృవునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.
(11) 10.2-320-సీ.
"దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! ;
వితతచారిత్ర! సంతత పవిత్ర!
హాలాహలాహార! యహిరాజకేయూర! ;
బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! సద్గుణసంఘాత! ;
పార్వతీహృదయేశ! భవవినాశ!
రజతాచలస్థాన! గజచర్మపరిధాన! ;
సురవైరివిధ్వస్త! శూలహన్త!
10.2-320.1-తే.
లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!"
భావము:-
“ఓ దేవా! జగన్నాథా! దేవేంద్ర వందితా! పరిశుద్ధ చారిత్రా! పరమ పవిత్ర! హాలాహల భక్షకా! నాగభూషణ! చంద్రశేఖర! భక్తజనసంరక్షకా! సర్వలోకేశ్వరా! పార్వతీపతి! కైలాసవాసా! గజచర్మధారీ! రాక్షసాంతకా! త్రిశూలధారీ! భక్తజనుల ముంగిటి పారిజాతమా! జన్మరహితుడా! నిన్ను ఎవరు మాత్రం స్తుతించ గలరు?"
(12) 1-229-ఆ.
"ధనము లపహరించి తనతోడఁ జెనకెడు
నాతతాయి జనుల నని వధించి
బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁ
డెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించె?"
భావము:-
తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు.
(13) 10.1-1705-శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
భావము:-
ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడువు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి.
(14) 4-489-క.
ధర విరులు గందకుండఁగ
సరసగతిం బూవుఁదేనెఁ జవిగొను నిందిం
దిరవిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.
భావము:-
పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని, కావలసిన దానిని నేర్పుగా గ్రహిస్తాడు.
క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి చెప్తోంది
(15) 7-481-మా.
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
భావము:-
భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని నీతిగలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలము నంతను ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.
(16) 1-25-క.
నడవదు నిలయము వెలువడి
తడవదు పరపురుషు గుణముఁ దనపతి నుడువుం
గడవదు వితరణ కరుణలు
విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్.
భావము:-
ఆ లక్కమాంబ మహా యిల్లాలు. యింటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహా సాధ్వి.
(17) 10.1-322-క.
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు;
రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె?
భావము:-
ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా.
(18) 10.1-1744-ఉ.
"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"
భావము:-
“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!" అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. (గమనిక: రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.)
(19) 1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:-
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.
(20) 10.1-1012-ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
భావము:-
నల్లని దేహము వాడు, కమలములవంటి కన్నులు గల వాడు, కరుణా రసము కురిపించే వాడు, సిగపై నెరపిన నెమలి పింఛము కల వాడు, చిరునవ్వు చెలువారే చక్కని మోము కల వాడు నైన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనం దోచి తెచ్చాడు. ఓ మల్లెలార! మీ మల్లె పొదల మాటున కాని ఉన్నాడేమో కొంచం చెప్పండమ్మా.
(21) 10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గోక లెఱుంగక పాఱినఁ
గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!
భావము:-
నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.
(22) 10.1-323-క.
నా పట్టి పొట్ట నిండఁగఁ
బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ;
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!
భావము:-
పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.
(23) 8-72-శా.
నానానేకపయూథముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే
కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!
భావము:-
చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.
(24) 1-141-క.
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"
భావము:-
జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."