అమృతగుళికలు : ముత్యాలు
భాగవత పద్యముత్యాలు
పద్య సూచిక;-
అడిగెద నని కడువడిఁ జను ;
అభ్రంలిహాదభ్ర విభ్ర ;
ఆఁకలి గొన్న క్రేపులు ;
ఆదర మొప్ప మ్రొక్కిడుదు ;
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి ;
ఒకనొకని చల్దికావిడి ;
ఓ కదళీస్తంభోరువ! ;
కంజాక్షునకుఁ గాని కాయంబు ;
కర్ణావతంసిత కర్ణికారప్రభ ;
కలుగఁడే నాపాలి ;
కారే రాజులు? ;
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ ;
క్షోణితలంబునన్ నుదురు ;
ఘను డా భూసురు డేగెనో? ;
చదివించిరి నను గురువులు ;
చిక్కఁడు సిరికౌగిటిలోఁ ;
చేతులారంగ శివునిఁ బూజింపడేని ;
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ;
తనవెంటన్ సిరి; లచ్చివెంట ;
తిలక మేటికి లేదు తిలకనీతలకమ ;
నీ పాదకమల సేవయు ;
బాలుం డీతఁడు; కొండ దొడ్డది ;
యాదవు లందుఁ బాండుసుతులందు ;
వారిజాక్షులందు వైవాహికములందు ;
(1) 8-103-క.
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
భావము:-
అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –
ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం.
(2) 4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ;
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల;
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ;
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక;
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
4-107.1-తే.
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
భావము:-
సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతూ కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేలాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కిలి భయంకరంగా ఉన్నాడు.
దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి ఈ పోతనామాత్యల సీసపద్యం వీరభద్రుని బహుదీర్ఘదేహాన్ని సూచిస్తున్న మణిరత్మం.
(3) 6-400-ఉ.
ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో!
శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.
భావము:-
శ్రీపతీ! కమలాక్షా! ఆకలితో ఉన్న లేగదూడలు, ఈకలు రాని పక్షిపిల్లలు తల్లి రాకకోసం ఎదురు చూసేవిధంగా, విరహ వ్యాకుల అయిన జవరాలు పరదేశ మేగిన భర్తకోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది కదా!,
వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశిష్ఠ మైన భక్తి పరాకాష్ఠను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపం తో యుద్ధం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయ బోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థనలో ఒకటి ఈ పద్యం.
(4) 1-5-ఉ.
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
భావము:-
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.
(5) 1-13-ఉ.
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
భావము:-
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.
(6) 10.1-456-క.
ఒకనొకని చల్దికావిడి
నొకఁ డొకఁ డడకించి దాఁచు; నొకఁ డొకఁ డది వే
ఱొక డొకని మొఱఁగికొని చను
నొక డొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా!
భావము:-
ఓరాజా! ఒకతని చల్ది కావిడి మరొకతను అదిలించి లాక్కొని దాచేసాడు. ఇంకొకతను మరొకని అడ్డుపెట్టుకొని తీసుకుపోయాడు. మరింకొకతను ఆ కావిడిని తీసుకొని వచ్చి యిచ్చేసాడు.
అలతిపొలతి పదాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకొదగ్గ పోతన, తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘట్టాలలో చల్దులు గుడుచుట ఒకటి. అలా మిక్కిలి ప్రసిద్దమైన యీ పద్యం ఆ ఘట్టంలోది.
(7) 3-731-క.
"ఓ కదళీస్తంభోరువ!
యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి
ట్లేకాంతంబున నిచ్చట
నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్.
భావము:-
అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
సృష్టి ఆదిలో తను సృష్టించిన రాక్షసులబారి నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది. చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారి ఆ సంధ్యాసుందరి వర్ణన యిది.
(8) 7-170-సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ;
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
7-170.1-ఆ.
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
భావము:-
పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు. అది గాలితో నిండిన, కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు, ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన ఆ హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు ఢమ ఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు అది ఒక కొయ్య తెడ్డు (చెక్క గరిటె). శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానేకాదు. (ఈ పద్య రత్నాలు అమూలకం పోతన స్వకీయం. “మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అమూలకం; పోతన స్వంత కృతి కనుక స్వకీయం; అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు, సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా" అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని, ఇక్కడ“అంధేదూదయముల్", “కమలాక్షు నర్చించు", “కంజాక్షునకు గాని", “సంసార జీమూత" అనే నాలుగు పద్యాలలో వరసగా ప్రహ్లాదుని నోట పలికించా రనుకుంటాను.)
(9) 10.1-770-సీ.
కర్ణావతంసిత కర్ణికారప్రభ;
గండభాగద్యుతిఁ గడలుకొలుప
భువనమోహనమైన భ్రూవిలాసంబుతో;
వామభాగానతవదన మొప్ప
నపసవ్యకర మృదులాంగుళీ చాతురి;
షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప
డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన;
పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ
10.1-770.1-తే.
మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ
జతురనటమూర్తి గోపాలచక్రవర్తి.
భావము:-
మిక్కిలి చమత్కారమైన నటనాలతో మనసు లలరించే గోపాల చక్రవర్తి యైన శ్రీకృష్ణమూర్తి చెవిసందులో తురిమిన కొండగోగుపూల అందం, చెక్కిళ్ళ శోభను ఇనుమడిస్తుండగా; విశ్వాన్నంతటిని మోహింపజేసే బొమముడి సోయగా, లొప్పుతుండగా; ఎడమ పక్కకి వంచిన తల, చక్కదనాలు చిందిస్తుండగా; కోమలమైన కుడిచేతి వ్రేళ్ళ నైపుణ్యాలు షడ్ఝస్వరానికి, నర్మగర్భ అందాలు అద్దుతుండగా; ఎడమ కాలిమీద అడ్డంగా సాచి ఉంచిన కుడి కాలిగోర్లు, మేదిని మెరుపులు మెదుపుతుండగా; సిగలోని నెమలి పింఛము, మెడలోని వైజయంతీమాలల మిలమిలలు, మించుతుండగా; మురళిని మోవిపై ఆనించి గ్రామ మూర్చను లనే స్వరభేదాలు స్వచ్ఛంగా వెలయిస్తూ; బ్రహ్మగాంధర్వగీత మనే సామవేదగానం (ఆ శారదాదినాలలో గోవుల మేపుతూ) ఆలపించాడు.
(10) 8-87-సీ.
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
8-87.1-తే.
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
భావము:-
నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
(11) 8-590-శా.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
భావము:-
భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.
(12) 1-20-క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.
భావము:-
తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి వ్రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.
(13) 1-6-ఉ.
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
భావము:-
నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ నాలుగు చేతుల చల్లని తల్లిని సదా సంస్తుతిస్తాను.
(14) 10.1-1727-మ.
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"
భావము:-
ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?"
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.
(15) 7-166-క.
"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!
భావము:-
“నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.
(16) 10.1-383-క.
చిక్కఁడు సిరికౌగిటిలోఁ
జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
భావము:-
ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
(17) 1-14-తే.
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
భావము:-
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి
(18) 1-259-ఉ.
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం
బులతోఁ బుష్ప పిశంగ చేలములతో భూషామణిస్ఫీతుఁ డై
నలినీభాంధవుతో శశిధ్వజముతో నక్షత్రసంఘంబుతో
బలభిచ్ఛాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.
భావము:-
ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, పీతాంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.
(19) 8-98-మ.
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
భావము:-
అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకులాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}
(20) 1-269-సీ.
తిలక మేటికి లేదు తిలకనీతిలకమ! ;
పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి!
కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి! ;
తొడవులు దొడవవా తొడవుతొడవ!
కలహంసఁ బెంపుదే కలహంసగామిని! ;
కీరముఁ జదివింతె కీరవాణి!
లతలఁ బోషింతువా లతికాలలిత దేహ! ;
సరసి నోలాడుదే సరసిజాక్షి!
1-269.1-ఆ.
మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన!
గురుల నాదరింతె గురువివేక!
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!
యనుచు సతులనడిగెనచ్యుతుండు."
భావము:-
నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకున్నావా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తురి రాసుకున్నావా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తె! ఆభరణాలు అలంకరించుకున్నావా. హంసనడకల చిన్నదాన! కలహంసలని పెంచుతున్నావా? చిలుకపలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగె అంతటి సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బందుప్రేమకి పెరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?" అంటూ ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు.
(21) 10.1-1272-క.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే!"
భావము:-
తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.
(22) 10.1-921-శా.
బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా
కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్. "
భావము:-
గోవర్థనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు గోపకుల నందరను దీని కిందకి రండి అని పిలుస్తున్నాడు – "ఓ బంధువులారా! కృష్ణుడు ఏమో చిన్న పిల్లాడు. చూస్తే ఈ కొండ ఏమో చాలా పెద్దది. ఇతడు దీనిని మోయ గలడో లేడో అని సందేహించంకండి. పర్వతాలు, సముద్రాలు, ప్రాణలు అన్నిటితో కూడిన ఈ భూమండలం అంతా మీద పడ్డా కూడ నా చెయ్యి వణకదు. మీ రందరు ఆనందంగా దీని కింద ఉండండి."
(23) 1-200-ఉ.
యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
భావము:-
స్వామీ! విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా, నా బుద్థి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే లగ్న మయ్యేటట్లు చెయ్యి.
(24) 8-585-ఆ.
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
భావము:-
ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.