అమృతగుళికలు : మాణిక్యాలు
భాగవత పద్యమాణిక్యాలు
పద్య సూచిక;-
అలవాటు కలిమి మారుతి ; ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ ; ఆ శౌరికిఁ దెరువొసఁగెఁ ; ఎమ్మెలు చెప్పనేల? ; ఓ యమ్మ! నీ కుమారుఁడు ; కమలాక్షు నర్చించు కరములు ; కలఁ డందురు దీనుల యెడఁ ; కాననివాని నూఁతగొని కాననివాడు ; కుప్పించి యెగసినఁ ; గురుభీష్మాదులు గూడి ; చదువనివాఁ డజ్ఞుం డగు ; చిన్నయన్నలార! శీతాంశుముఖులారా ; జోజో కమలదళేక్షణ! ; త్రిజగన్మోహన నీలకాంతిఁ ; నరమూర్తిగాదు ; నల్లనివాఁడు పద్మనయనంబులవాడు ; ప్రాణేశ! నీ మంజు భాషలు ; బాలురకుఁ బాలు లే వని ; మన్నేటికి భక్షించెదు? ; ఱోలను గట్టుబడియు ; వరవైకుంఠము సారసాకరము ; వీరెవ్వరు? శ్రీకృష్ణులు గారా? ; శ్రీ కైవల్య పదంబుఁ జేరుట కునై ; హయరింఖాముఖ ధూళి ధూసర ;
(1) 9-275-క.
అలవాటు కలిమి మారుతి
లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్
జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.
భావము:- బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయిన అలవాటు ఉండడంతో మారుతి నదులు అన్నింటికీ బంధువు, భూమికి ఆకాశానికి వ్యవధానం, నీటితో నిండి ఉండేది అయిన సముద్రాన్ని మిక్కిలి లాఘవంగా దాటాడు.
(2) 8-592-శా.
ఆదిన్శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదంజెందు కరంబు గ్రిం దగుట మీఁదైనా కరంబుంట మేల్
గాదే?రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
భావము:- ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.
(3) 10.1-144-క.
ఆ శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర
కాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశా
కాశయగు యమున మును సీ
తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.
భావము:- శూరుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రవహిస్తూ ఉన్న, ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, ఆ శిశు రూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.
(4) 6-12-ఉ.
ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.
భావము:- ప్రగల్భాలు చెప్పడం ఎందుకు? జగమంతా మెచ్చగా శేషశయనుడైన విష్ణుదేవునికి తన కవితా సంపదలనే భూషణాలుగా కోకొల్లలుగా సమర్పించుకొన్నవాడు, భక్తినే నమ్మినవాడు, భగవత్పరమైన పరమ నిష్ఠా గరిష్ఠుడు (భాగవత రచనా నిష్ఠ కలవాడు), కవిరాజు అయిన బమ్మెర పోతనను తలచుకొని నమస్కరిస్తాను.
(5) 10.1-329-క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మాయిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ!"
భావము:- ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు."
(6) 7-169-సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
7-169.1-తే.
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
భావము:- నాన్న గారు! కమలా వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్త్రోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
(7) 8-86-క.
కలఁడందురు దీనుల యెడఁ
గలఁడందురు పరమయోగి గణముల పాలం
గలఁడందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
భావము:- దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు" అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
(8) 7-182-ఉ.
కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గానని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థానరజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!
భావము:- తండ్రీ! రాక్షసేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా! అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాద ధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూత చిత్తులు అవుతారు; అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు.
(9) 1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:- ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ " ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను" అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.
(10) 1-367-మ.
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో
గురుశక్తిన్ రథయంత యై నొగలపైఁ గూర్చుండి యా మేటి నా
శరముల్ వాఱక మున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నా కిచ్చుచున్.
భావము:- (అర్జునుడు ద్వారకనుంచి వచ్చి శ్రీకృష్ణనిర్యాణం చెప్పలేకచెప్తు తమ జీవనసారథిని తలుస్తున్నాడు.) భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తు, రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, ఉత్సాహాన్నీ, ఆయుర్దాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా!
(11) 7-130-క.
"చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!"
భావము:- ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి “బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!." అని చెప్పాడు.
(12) 9-353-ఆ.
"చిన్నయన్నలార! శీతాంశుముఖులార!
నళినదళవిశాలనయనులార!
మధురభాషులార! మహిమీఁద నెవ్వరు
దల్లిదండ్రి మీకు ధన్యులార? "
భావము:- ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా?
– అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుసెలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.
(13) 10.1-190-క.
"జోజోకమలదళేక్షణ!
జోజోమృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజోపల్లవకరపద!
జోజోపూర్ణేందువదన! జోజో" యనుచున్.
భావము:- గోపికలు చిన్నికృష్ణునికి శుభ్రంగా స్నానం చేయించి, నిద్రపుచ్చుతు – "జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందువదన! జోజో" అంటు జోలపాటలు పాడారు.
(14) 1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:- “ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
(15) 7-286-క.
"నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరిమాయారచిత మగు యథార్థము చూడన్.
భావము:- ఈ రూపము ఉత్తి మానవ రూపము కాదు, ఉత్తి సింహం రూపము కాదు. చూస్తే యథార్థంగా మానవాకారం, సింహాకారం రెండు కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా మూర్తిలా ఉంది.
(16) 9-361-ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
భావము:- నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.
(17) 10.1-1711-సీ.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతంబానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
10.1-1711.1-ఆ.
నీరజాతనయన! నీవనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు."
భావము:- శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు; నాకు వద్దయ్యా!"
(18) 10.1-307-క.
“బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ
బాలుండాలము చేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
భావము:- కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ.
(19) 10.1-336-క.
"మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా!మ న్నేల మఱి పదార్థము లేదే? "
భావము:- "ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా ఏమిటి పాపం."
(20) 10.1-380-క.
ఱోలను గట్టుబడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త పరతంత్రుండై
యాలాన సన్నిబద్ధ వి
శాల మదేభేంద్రకలభ సమరుచి నధిపా!
భావము:- పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.
(21) 3-513-మ.
వరవైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణశాలాంక గో
పురహర్మ్యావృతమైన తద్భవన మంభోజంబు తన్మందిరాం
తరవిభ్రాజిత భోగి గర్ణిక తదుద్యద్భోగ పర్యంకమం
దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్
భావము:- శ్రేష్ఠమైన వైకుంఠమే ఒక సరోవరం. దివ్యమైన బంగారు మంటపాలతో, గోపురాలతో, మేడలతో కూడిన ఆ మహామందిరమే పద్మం. ఆ మందిరం మధ్యభాగాన ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు. శేషతల్పంపై శయనించే మాధవుడే తుమ్మెద.
మిక్కిలి ప్రసిద్ధమైన ఆణిముత్యం ఈ పద్యం. వరవైకుంఠపురము అనగానే ఈ పద్యాన్ని గుర్తుచేసుకోలేని తెలుగువాళ్ళలో పండితులు కాని పామరులు కాని ఎవరు ఉండేవారు కాదు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు చతుర్ముఖుని పుత్రులు. వారు పరమ బ్రహ్మవేత్తలు, ఆది ఋషులు, దేవర్షులు. వారు ఒకసారి నారాయణుని దర్శించుకోడానికి వెళ్ళారు. ఆ సందర్భంలోని వైకుంఠపుర వర్ణన యిది.
(22) 10.1-374-క.
“వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా?యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోరత్వం బించుకయును
నేరరఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?
భావము:- ఓహో ఎవరండీ వీరు? శ్రీకృష్ణులవారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే చూడలేదట కదా! దొంగతనమంటే ఏమిటో పాపం తెలియదట కదా! ఈ లోకంలో ఇంతటి బుద్ధిమంతులు లేనేలేరట!
పట్టుబడ్డ వెన్నదొంగను కొట్టటానికి చేతులురాని తల్లి యశోదాదేవి కొడుకును ఇలా దెప్పుతోంది.
(23) 1-1-శా.
శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
భావము:- సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
(24) 1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁబోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:- గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.