అమృతగుళికలు : కెంపులు
భాగవత పద్యకెంపులు
పద్య సూచిక;-
ఏను మృతుండ నౌదు నని ;
ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త ;
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ ;
ఒకపరి జగములు వెలి నిడి ;
ఒక్కఁడు ము న్నేమఱి చన ;
ఒనరన్ నన్నయ తిక్కనాది ;
కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ;
కంఠేకాలునిచేతం ;
కటి విరాజిత పీతకౌశేయశాటితో ;
కటిచేలంబు బిగించి ;
కట్టుము సేతువు; లంకం జుట్టుము ;
కదలం బాఱవు పాఁప పేరు ;
కనకాగార కళత్ర మిత్ర సుత ;
కనియెం దాపసపుంగవుం డఖిలలోక ;
కమనీయభూమిభాగములు లేకున్న ;
కమలనాభు నెఱిఁగి ;
కరిఁ దిగుచు మకరి సరసికిఁ ;
కరుణాకర! శ్రీకర! కంబుకరా ;
కర్ణాలంబిత కాక పక్షములతో ;
కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ ;
కలయో! వైష్ణవ మాయయో! ;
కల్ల లేదని విన్నవించుట గాదు ;
కళలు గలుగుఁ గాక; కమల తోడగుగాక ;
కవకవనై పదనూపుర రవరవ ;
(1) 12-25-ఉ.
ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.
భావము:-
ఓ మహారాజా! నేను చనిపోతాను అన్న భయాన్ని పూర్తిగా మనసులోంచి తుడిచెయ్యి. జన్మించిన మానవు లందరికి మరణించటం అన్నది శాశ్వతమైన తప్పనిసరి ధర్మం. కనుక హరిని ధ్యానంచేసుకో. దీనివల్ల మళ్ళా ఈ భూలోకంలో జన్మించటం జరుగదు. మాధవలోక మైన వైకుంఠంలో నివసించి, అక్కడ సౌఖ్యాలు అనుభవించే యోగం కలుగుతుంది.
(2) 10.1-184-ఆ.
"ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్నిమగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార! "
భావము:-
"ఓ సుందరమైన చెలులారా! ప్రొద్దునే లేస్తూనే ఇంత మంచి శుభవార్త చెవులార విన్నాం, ఏనాడు నోచిన నోముల ఫలితమో గానీ; మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట. చూసి వద్దాం సుందరీమణులు! రండి రండి"
(3) 1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."
భావము:-
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."
(4) 8-74-క.
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.
భావము:-
ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.
(5) 10.1-457-క.
ఒక్కఁడు ము న్నేమఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే
ఱొక్కఁడు మిట్టి తటాలున
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్.
భావము:-
పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు, అత నులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనకనించి తటాలున మూసాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు.
(6) 1-21-మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
భావము:-
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.
(7) 10.2-1152-మత్త.
“కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.
భావము:-
“నా పాపం అంతరించింది; సంసారసాగరం దాటగలిగాను; ముక్తిసాధనం చూడగలిగాను; నీ కరుణాదృష్టికి పాత్రుడనయ్యాను; పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా! నీవు నా గృహానికి విచ్చేశావు. నేను ధన్యుడిని అయ్యాను.
(8) 9-615-క.
కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంఠమ్మన బాల నేసె ఠవఠవ గదురన్.
భావము:-
అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠంనల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.
(9) 3-538-సీ.
కటి విరాజిత పీతకౌశేయశాటితో;
వితత కాంచీగుణ ద్యుతి నటింప
నాలంబి కంఠ హారావళి ప్రభలతోఁ;
గౌస్తుభరోచులుగ్రందుకొనఁగ
నిజకాంతి జిత తటిద్వ్రజ కర్ణ కుండల;
రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
మహనీయ నవరత్నమయ కిరీటప్రభా;
నిచయంబు దిక్కుల నిండఁ బర్వ
3-538.1-తే.
వైనతేయాంస విన్యస్త వామహస్త
కలిత కేయూర వలయ కంకణము లొప్ప
నన్యకరతల భ్రమణీకృతానుమోద
సుందరాకార లీలారవింద మమర.
భావము:-
ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమచేతికి భుజకీర్తులు, మురుగులు, కంకణాలు ముచ్చట గొలుపుతుండగా, కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు.
(10) 10.1-638-మ.
కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్.
భావము:-
నడుముకున్న దట్టీగుడ్డని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చరచాడు. రెండుకాళ్ళు బిగించి సింహపరాక్రమశాలి గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన వేగానికి గుభీలు మని పెద్ద శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి.
(11) 9-285-క.
కట్టుము సేతువు; లంకం
జుట్టుము; నీ బాణవహ్ని సురవైరితలల్
గొట్టుము నేలంబడఁ; జే
పట్టుము నీ యబల నధికభాగ్యప్రబలన్.
భావము:-
ఓ రామా! వంతెన కట్టు, లంకానగరం చుట్టుముట్టు, నీ బాణాగ్నితో రావణుని తలలు నేల రాలగొట్టు, మంగళకరంగా నీ భార్యను స్వీకరించు.
(12) 8-244-మ.
కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.
భావము:-
మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.
(13) 1-311-మ.
"కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం
గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!
భావము:-
"ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు, పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని ఎల్లప్పుడు ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు. అయితే దుర్నివారక మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి. (కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ఱ్ఱునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు.)
(14) 3-148-మ.
కనియెం దాపసపుంగవుం డఖిలలోకఖ్యాతవర్ధిష్ణు శో
భనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు యోగీంద్రహృ
ద్వనజాతైకచరిష్ణు కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్.
భావము:-
అలా వచ్చిన మునిశ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విస్తరిల్లిన శాశ్వతకీర్తితో, సౌభాగ్యశోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యౌవన స్ఫూర్తితో విరాజిల్లేవాడు, మహా యోగీంద్రుల హృదయపద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తళతళలాడే ఆభరణాలు అలంకరించుకొనువాడు, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు, తేజోమయుడు, రాక్షసులను జయించు శీలము కలవాడు అయిన శ్రీకృష్ణుని దర్శించాడు.
(15) 2-21-సీ.
కమనీయభూమిభాగములు లేకున్నవే;
పడియుండుటకు దూదిపఱుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే;
భోజనభాజనపుంజ మేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే;
కట్ట దుకూల సంఘంబు లేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే;
ప్రాసాదసౌధాది పటల మేల?
2-21.1-తే.
ఫలరసాదులు గురియవే పాదపములు;
స్వాదుజలముల నుండవే సకల నదులు;
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు;
ధనమదాంధుల కొలువేల తాపసులకు?
భావము:-
బుద్ధిమంతులు భావనలు ఇలా ఉంటాయి. “పడుకోడానికి చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా, ఇంకా కంచాలు గరిటలు ఎందుకు? నారచీరలు జింకచర్మాలు ధర్భచాపలు ఉండగా, ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా, మేడలు భవనాలు ఎందుకు? చక్కగా రసవంతమైన పళ్ళు కాసే చెట్లు, తియ్యటి మంచి నీటిని యిచ్చే నదులు, పుష్కలంగా భిక్ష పెట్టే పుణ్యస్త్రీలు ఉండగా, హాయిగా తపస్సులు చేసుకొనేవానికి, ధనమదంతో కన్నుమిన్ను కానని వాళ్ళని పోయి ఎందుకు సేవించటం?"
ముక్తికోరుతున్న పరీక్షిన్మహారాజునకు అవధూతోత్తముడు శుకబ్రహ్మ విరక్తి మార్గం చేపట్టి, తపస్సు చేసుకొనే జ్ఞానవంతుల ఆలోచనా సరళి జీవన విధానాలను ఇలా వివరించాడు.
(16) 8-613-ఆ.
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.
భావము:-
బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా?
(17) 8-54-క.
కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.
భావము:-
మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు" అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు.
(18) 6-531-తో.
కరుణాకర! శ్రీకర! కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!
భావము:-
కరుణకు ఆలవాలమైనవాడా! సంపదలను సమకూర్చేవాడా! పాంచజన్య శంఖాన్ని చేతిలో ధరించినవాడా! శరణు జొచ్చిన భక్తుల కష్టాలను కడతేర్చేవాడా! భక్తులను రక్షించి ముర అనే రాక్షసుని శిక్షించినవాడా! గజరాజుకు మేలు చేకూర్చినవాడా! కాంతిమయమైన రూపాన్ని ధరించినవాడా!
(19) 10.1-502-శా.
కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.
భావము:-
జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కఱ్ఱ చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎఱ్ఱటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు.
(20) 7-274-మ.
"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
భావము:-
నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!
(21) 10.1-342-మ.
“కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
భావము:-
కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
“నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.
(22) 10.1-1769-మత్త.
కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
తల్లిదండ్రులు పుత్ర శోకముఁ దాల్చి చిక్కుదు రీశ్వరా!"
భావము:-
ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా!"
(23) 10.1-1292-ఆ.
కళలు గలుగుఁ గాక; కమల తోడగుగాక;
శివుని మౌళిమీఁదఁ జేరుఁ గాక;
యన్యు నొల్లఁ దపనుఁ డైన మత్పతి యని
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.
భావము:-
చంద్రుడు కళలు కలవాడు అయితే అగు గాక, లక్ష్మీదేవి తోబుట్టువు అయితే అగు గాక, శివుడు నెత్తిని పెట్టుకొన్న వాడు అయితే అగు గాక, (ఎంత గొప్పవాడు అయినా) అన్యుడు అయిన చంద్రుడి పొత్తు మా కక్కర లేదు. తపింప జేసే వాడే అయినప్పటికి, మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీజాతి ముడుచు కొంది.
(24) 6-100-క.
కవకవనై పదనూపుర
రవరవ లాగుబ్బుకొన్న రతిపతి గతులం
జివచివనై విటు చెవులకు
రవళిన్ రతిసల్పు రతుల రవరవ గనియెన్.
భావము:-
ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీనుల విందుగా వినిపిస్తున్నవి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు చూశాడు.
“కవకవ", “రవరవ".... ధ్వన్యనుకరణ పదాలుపైన; “క", “వ", “ర" అక్షరాల వృత్యనుప్రాసతో అలంకరించి; శృంగారరసం చిక్కగా అల్లిన సహజ కవి పోతన్న గారికి పాదాభివందనాలు...