అమృతగుళికలు : నీలాలు
భాగవత పద్యనీలాలు
పద్య సూచిక;-
కా దనఁడు పొమ్ము లే దీరా దనఁడు ;
కాముని దహించెఁ ;
కామోత్కంఠత గోపికల్ ;
కాళికి బహుసన్నుత లోకాళికిఁ ;
కుయ్యిడ శక్తి లే ;
కువలయరక్షాతత్పర! ;
కైలాసాచలసన్నిభంబగు ;
కొడుకులఁ బట్టి చంపె నని ;
కొడుకులు లేరని యొక సతి ;
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ ;
కోపముతోడ నీవు దధికుంభము ;
కౌరవ పాండవు లిరువురు ;
క్రమమున మింటికై యెగయుఁగాక ;
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు ;
ఖగనాథుం డమరేంద్రు గెల్చి ;
గగనము దన కడపలఁ ;
గజనామధేయపురమున ;
గజ్జలు గల్లని మ్రోయఁగ ;
గర్భ మందుఁ గమలగర్భాండశతములు ;
గురు పాఠీనమవై, జలగ్రహమవై ;
గురువులు ప్రియశిష్యులకుం ;
నా తేజము సాధులలో ;
గొడుగో. జన్నిదమో ;
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు ;
(1) 8-657-క.
కా దనఁడు పొమ్ము లే దీ
రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా దయితుఁ గట్టనేటికి?
శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!
భావము:-
ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా! “ కాదు, లేదు, పో, ఇవ్వను" అన లేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేసాడు కదా! ఇంకెందుకు స్వామీ! లక్ష్మీపతీ! నా పతిని బంధిస్తున్నావు?
(2) 2-134-క.
కాముని దహించెఁ గ్రోధమ
హామహిమను రుద్రుఁ; డట్టి యతికోపము నా
ధీమంతులు గెలిచి రనం;
గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్.
భావము:-
కామానికి అధిదేవత యైన మన్మథుని, పూర్వం శివుడు తన కోపపు తీవ్రతచే కాల్చివేసాడు. అంతటి అలవికానిది కోపము. అటువంటి కోపాన్ని కూడ జయించారు ఆ మహా జ్ఞానులు నరనారాయణులు. ఇక కామాన్ని గెలవటం గురించి చెప్పేదేం ఉంది.
(3) 7-18-శా.
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
భావము:-
ధర్మరాజా! మన్మథ వికారముతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులు అయ్యి యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణుసాయుజ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును.
(4) 6-7-క.
కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ కరకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.
భావము:-
లోకాలన్నిటి చేత పొగడబడేది, అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేదీ. మునుల మనస్సులలో విహరించేది అయిన కాళీమాతను నా మనస్సులో కీర్తిస్తాను.
(5) 1-281-ఉ.
"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!
భావము:-
"ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి; ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో; తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా! (తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.)
(6) 10.1-1790-క.
కువలయరక్షాతత్పర!
కువలయదళ నీలవర్ణ కోమలదేహా!
కువలయనాథ శిరోమణి!
కువలయజన వినుత విమలగుణ సంఘాతా!
భావము:-
భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఈ శ్రీరాముని ప్రార్థనలోని చమత్కర మాధుర్యం తొణికిసలాడుతోంది. కువలయ అని నాలుగు పాదాలు ఆరంభిస్తు లోకం, కలువలు, రాజులు, మానవులు అని నాలుగు రకాల అర్థబేధంతో యమకం పండించిన తీరు అద్భుతం. రెండు గాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు, అర్థభేదం కలిగి, మరల మరల వస్తూ ఉంటే యమకాలంకారం.
(7) 1-412-శా.
కైలాసాచలసన్నిభంబగు మహాగంభీరగోరాజముం
గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు క్రూరుండు జం
ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్యనిర్ముక్తుఁడై
నేలం గూలఁగఁ దన్నెఁ బంచితలఁగా నిర్ఘాతపాదాహతిన్.
భావము:-
కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమ మైన ఆ మహా వృషభాన్ని క్రోధోన్మత్తుడు, కఠోరచిత్తుడు, రాజవేషధారి, దుడ్డుకఱ్ఱ పట్టుకొన్న వాడు, బలమైన పిక్కలు కల వాడు అయిన ఒక శూద్రుడు కటిక రాక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభ రాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. (పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తు, ఇలా శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు.)
(8) 1-169-చ.
"కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్."
భావము:-
“తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు; పైగా వదలి వదిలిపెట్టమంటోంది; ఎంత పిచ్చిదో చూడండి; బ్రాహ్మణుడు కదా వదలేయండి అంటోంది; ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా? చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏమీ లేదు; చంపెయ్యండి; మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుఱ్ఱబద్దలుకొట్టేస్తాను; మీరంతా చూస్తూ ఉండండి."
(9) 10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ!
భావము:-
ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః" అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు" అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు
(10) 10.1-1028-సీ.
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ;
మొనసి పాదాగ్రంబు మోపినాఁడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ;
దృణములోఁ దోపఁదు తెఱవ జాడ
ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ;
గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ;
వెలఁది నిక్కిన గతి విశదమయ్యె
10.1-1028.1-ఆ.
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ
జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ
ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.
భావము:-
మురళీలోలుడు ఇక్కడ మునివేళ్ళు మాత్రమే నేలపై మోపాడు, ముదితకు పూలుకోసినాడేమో; నెలత నెత్తుకొని ముదుకెళ్లాడేమో ఇక్కడ ఆమె అడుగుల జాడలు కనబడటం లేదు; ఇద్దరు కూర్చున్న ఈ చోటు సొగసుగా ఉంది, ఇక్కడ కొమరాలి కొప్పు సవరించి ఉంటాడు; ఇక్కడ నీలవేణి నిక్కినతీరు తేటపడుతోంది, అతివకు అరుణాధర మిచ్చాడేమో; ఇక్కడ కొలనులోకి దిగిన ఆనమాళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి, కాంతతో కొలను నీటిలోకి ప్రవేశించాడేమో; ఇక్కడ గడ్డిగాదము అణగి, పెనగిన ఆనవాలు కానవస్తోంది, మగువను మదనకేళిలో తనిపినాడేమో.
(11) 1-193-ఉ.
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్.
భావము:-
దయామయా! శ్రీకృష్ణా! చిన్నప్పుడు నీవు ఒకసారి కోపంవచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ, ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించటం తలచుకుంటే, ఇప్పటికి నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా.
(12) 3-21-క.
"కౌరవ పాండవు లిరువురు
నారయ నీ కొక్క సమమ యవనీవర! నీ
వే రీతి నైన బాండుకు
మారుల పాలొసఁగి తేని మను నుభయంబున్."
భావము:-
“మహారాజ నువ్వు కన్న కౌరవులు, నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు సమానమే. నీవు ఎలాగైనా సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లైతే ఉభయులు క్షేమంగా ఉంటారు."
(13) 1-453-చ.
క్రమమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా
రము గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స
ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁడౌ? మునులార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్.
భావము:-
పక్షులు తమ శక్తి కొద్దీ రెక్కలాడిస్తూ ఎంత పైకి ఎగిరినా, ఆకాశం అంతు కనుక్కోలేవు. అదేవిధంగా, వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినమాత్రం తప్ప సమగ్రంగా వివరించి చెప్పగల సమర్థు డెవడున్నాడు.
(14) 3-59-తే.
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు
వొలుచు నెవ్వనిసభఁ జూచి కలుష మొదవి
మనములోన నసూయానిమగ్నుఁ డయ్యె
నట్టి ధర్మజుఁ డున్నాడె? యనఘచరిత!
భావము:-
ఓ పుణ్యాత్ముడా! ఉద్దవా! దేదీప్యమానమైన ఏ మహనీయుని మయసభను చూసి దుర్యోధనుడు క్రోధమాత్సర్యాలతో క్రుంగిపోయి మనస్సునిండా కల్మషం నింపుకొని, అంతులేని అసూయలో మునిగితేలాడో, ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా?
(15) 10.1-1682-మ.
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
భావము:-
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించి నట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజు లందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.
(16) 2-108-క.
గగనము దన కడపలఁ దాఁ
దగ నెఱుగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్
గగనప్రసవము లే దన
నగునే సర్వజ్ఞతకును హాని దలంపన్.
భావము:-
ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు. అదే విధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దుల నెరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వ వ్యాప్తిత్వాన్ని కాదన లేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞతానికి లోటు వాటిల్లదు.
బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడు. భగవంతుడు సర్వజ్ఞడు కనుక తన పరిధి, వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమి లేదు.
(17) 1-438-క.
గజనామధేయపురమున
గజరిపుపీఠమున ఘనుఁడు గలిదమనుం డున్
గజవైరిపరాక్రముఁ డే
గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్.
భావము:-
సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు ఆయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీను డై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు.
(18) 10.1-368-క.
గజ్జలు గల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!
భావము:-
చిలిపి కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు.
(19) 1-182-ఆ.
గర్భ మందుఁ గమలగర్భాండశతములు
నిముడుకొన వహించు నీశ్వరేశ!
నీకు నొక్క మానినీగర్భరక్షణ
మెంత బరువు నిర్వహింతు గాక."
భావము:-
గర్భంలో వందలకొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాధిదేవ! శ్రీకృష్ణా! నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా! నా గర్భాన్ని రక్షించవయ్యా!"
(20) 10.1-100-ఉ.
గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకే
సరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై,
ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే.
భావము:-
మహా మత్స్యావతార మెత్తి, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, హయగ్రీవావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం మున్నగు అనే కావతారాలు యెత్తి దయాదాక్షిణ్యాది గుణాలతో, ఉదారుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము; ఈ భూమి భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము.
(21) 1-42-క.
గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
భావము:-
గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
(22) 9-125-క.
నా తేజము సాధులలో
నాతతమై యుండు వారి నలఁచు జనులకున్
హేతి క్రియ భీతి నిచ్చుం
జేతోమోదంబుఁ జెఱచు సిద్ధము సుమ్మీ.
భావము:-
నా తేజస్సు సాధుపురుషులలో విరివిగా ఉంటుంది. వారిని కష్టపెట్టే వారికి అగ్నిశిఖల వలె భయాలను కలుగజేస్తుంది. వారికి తప్పకుండ మానసిక సంతోషం లేకుండా చేస్తుంది సుమా.
(23) 8-572-మ.
"గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
భావము:-
“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.
(24) 10.1-665-సీ.
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు;
సరసమృదంగ ఘోషంబు గాఁగ
సాధు బృందావనచర చంచరీక గా;
నంబు గాయక సుగానంబు గాఁగఁ
గలహంస సారస కమనీయమంజు శ;
బ్దంబులు దాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది;
జనులు సభాసీనజనులు గాఁగ
10.1-665.1-తే.
పద్మరాగాది రత్నప్రభాసమాన
మహితకాళియ ఫణిఫణామండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.
భావము:-
ఆ కాళీయుని పడగలు అనే విశాల మండపంమీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి, బహు నైపుణ్యంతో నృత్యం చేసాడు. ఆ పాముపడగల మండపం పద్మరాగాలు మొదలైన రత్నాలు చేత ప్రకాశిస్తున్నది. ఆ నృత్యావికి సహకారం అందిస్తున్నట్లు యమునానదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతున్న తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల గానంలా వినబడుతున్నది. కలహంసలు, సారసపక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాళధ్వనులను సంతరించుకున్నాయి. ఆకాశంలోనుండి చూస్తూ ఉన్న దేవతలు, గంధర్వులు మొదలైనవారు సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల వలె ఉన్నారు. మొత్తం మీద అదొక గొప్ప నాట్య కచేరీలా ఉంది.