అమృతగుళికలు : గోమేధికాలు
భాగవత పద్యగోమేధికాలు
పద్య సూచిక;-
చొక్కపు రక్కసికులమున ;
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ! ;
జనకసుతాహృచ్చోరా! ;
జనవర ఋషభుని రాజ్యంబున ;
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా ;
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె ;
జలరాశి దాఁటఁ గోరెడి ;
డింభక సర్వస్థలముల ;
తండ్రి క్రియ రామచంద్రుఁడు ;
తండ్రుల కెల్లఁ దండ్రియగు ;
తడ వాడిరి బలకృష్ణులు ;
తనయులార! వినుఁడు ధరలోనఁ ;
తనువు మనువు విడిచి ;
తరణంబులు భవజలధికి ;
తరిగాండ్రలోన నొకఁడట ;
తరుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ ;
తలఁగవు కొండలకైనను ;
తలఁగినదానం దల మనఁ ;
తాటంకాచలనంబుతో ;
తీపుగల కజ్జ మన్యుఁడు ;
తుదమొదళ్ళకుఁ జిక్కి దునిసి ;
తెఱవ యొకతె నిద్రింపఁగ ;
తొఱ్ఱులఁ గాచిన నందుని కుఱ్ఱని ;
తోయంబు లివి యని తొలగక ;
(1) 7-254-క.
చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."
భావము:-
స్వచ్ఛమైన రాక్షస వంశంలో వికృతమైనవాడు పుట్టాడు. ఎంత చెప్పిన విష్ణువుమీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!
(2) 12-53-మా.
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదాసత్యభాషీ!
భావము:-
శ్రీరామా! లోకరక్షణకై విహరించే వాడా! శత్రువులను ప్రహరించే వాడ! సుగుణాలవనంలో విహరించే వాడా! అందగత్తెల అభిమానాన్ని దోచుకొనే వాడా! కళంకరహితులను పోషించే వాడా! వీరవరులచేత అభిలషింపబడే వాడా! స్వీయగురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించిన వాడా! ఎల్లప్పుడు సత్యమే పలికేవాడా! నీకు నమస్కారం.
(3) 9-734-క.
జనకసుతాహృచ్చోరా!
జనకవచోలబ్దవిపిన శైలవిహారా!
జనకామితమందారా!
జనకాది మహీశ్వరాతిశయసంచారా!
భావము:-
జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనకమహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడికగల మహారాజువి. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకు వందనములు
(4) 5.1-65-క.
జనవర ఋషభుని రాజ్యం
బున నైహిక ఫలముఁ గోరు పురుషుని నొకనిం
గనుఁగొన నెఱుంగ మెన్నఁడు
నినతేజుం డతనిమహిమ లేమని చెప్పన్.
భావము:-
రాజా! ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడు కూడా కనిపించడు. అతడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించాలి?
(5) 10.1-495-మ.
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!
భావము:-
ఓ పరీక్షిన్మహారాజా! తామర పువ్వు బొడ్డు చుట్టూరా వరుసలు వరుసలుగా రేకులు పరచుకొని ఉంటాయి. అలాగే చల్దులు తినడానికి కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. గోపకలు అందరు చూట్టూరా చేరి కూర్చుని కృష్ణుణ్ణే చూస్తున్నారు. వాళ్ళకి వేరే కంచాలు లేవు. రాతిపలకలు, తామరాకులు, వెడల్పైన గడ్డిపోచలుతోను లతలుతోను పొడుగాటి పొన్న పూలతోను అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులు వీటినే కంచాలుగా వాడుకుంటు అందరు చక్కగా చల్దులు ఆరగించారు.
(6) 1-244-మ.
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకన్
గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకన్ దోరణా
వళిసంఛాదితతారకన్ దరులతావర్గానువేలోదయ
త్ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయప్రాకారకన్ ద్వారకన్.
భావము:-
బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టు కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.
(7) 1-52-క.
జలరాశి దాఁటఁ గోరెడి
కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
గలి దోష హరణ వాంఛా
కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!
భావము:-
ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
(8) 7-279-క.
"డింభక సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు ననుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె చక్రిన్ గిక్రిన్.
భావము:-
ఓరి డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.
(9) 9-336-క.
తండ్రి క్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రధరణిపుఁ డనుచున్.
భావము:-
శ్రీరాముడు కన్నతండ్రిలా పరిపాలిస్తుండటంతో. ప్రజలు అందరూ మా తండ్రి శ్రీరాముడే అని అనుకుంటున్నారు. కనుక రామ పాలనలోని ప్రజలు అందరు తమ కన్నతండ్రులను సైతం మరచిపోయారు.
(10) 1-253-ఉ.
తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీ క్రియం బ్రజల ధన్యులఁ జేసిరి, వేల్పు లైన నో
తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబునన్.
భావము:-
తండ్రులందరికి తండ్రి యైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికి తండ్రివి, తల్లివి, దైవానివి, భర్తవు, మిత్రుడవు, గురుడవు, సమస్తము నీవే; తండ్రులు ఐదుగురు (తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు) ఎవరు కూడ నీలాగ ప్రజలను పరమానంద భరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైనా మా లాగా నీ ముఖ పద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు.
(11) 10.1-290-క.
తడ వాడిరి బలకృష్ణులు
దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్
దడవాడి రరులు భయమునఁ
దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్.
భావము:-
బాల్యక్రీడలలో బలరామ కృష్ణులు ఆలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి, రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచి దనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు.
(12) 5.1-67-ఆ.
తనయులార! వినుఁడు ధరలోనఁ బుట్టిన
పురుషులకును శునకములకు లేని
కష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల
వలన బుద్ధి చేయవలదు మీరు
భావము:-
“కుమారులారా! ఈ భూమిమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి.
(13) 9-121-ఆ.
తనువు మనువు విడిచి, తనయులఁ జుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
నన్నకాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.
భావము:-
తమ దేహాన్ని, జీవితాన్ని, వదలి; భార్యాపిల్లలను, బంధువులను, సకల సంపదలను అన్నిటిని వదిలేసి కేవలం నన్ను తప్పించి ఇతరం ఏమి తెలియని వారిని, వారు ఎలాంటివారు అయినా సరే, వారిని నేను వదలిపెట్టను.
(14) 11-15-క.
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్.
భావము:-
నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు.
(15) 8-205-క.
తరిగాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్.
భావము:-
ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మందరపర్వంతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.
(16) 10.1-326-ఆ.
తరుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
మగువ! నీ సుతుండు మగపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? జక్కఁజేయ.
భావము:-
ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరీ పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?
స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.
(17) 8-28-క.
తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
భావము:-
ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుట కైన వెనుదీయవు. సింహాలకైన వెనుదీయ కుండ ఎదిరించి నిలబడతాయి. చివరకి పిడుగులకు కూడ బెదరవు.
రహస్యార్థం: కొండలంత కష్టాలు వచ్చినా, ధైర్యం విడనాడకుండా, కామాదులను జయించుటకు సింగము వంటి పట్టుదల కలవి అయి ఎదుర్కుంటాయి. పిడుగుల వంటి ఆపదలు మీద పడినా తట్టుకుంటాయి కాని చలించవు. అంతటి అవిద్యావృత పారమార్దిక జీవులు అవి.
(18) 10.1-319-క.
"తలఁగినదానం దల" మనఁ
దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ
తలఁగిన చోటెయ్యది" యని
తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ!
భావము:-
చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు" అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది" అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.
(19) 8-102-శా.
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.
భావము:-
గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదుల్తున్నాయి. భుజాల మీద వీడిన కొప్పుముడి చిందు లేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదులై పోయింది. నుదిటి మీద రాసుకొన్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది.
(20) 10.1-458-క.
తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!
భావము:-
ఓ పరీక్షిన్మహారాజా! తియ్యటి పిండివంట ఒకడి చేతిలోంచి మరొకడు లాక్కుని పారిపోతున్నాడు. మొదటి వాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని లాక్కుని పోయి, దూడల మధ్య అటు యిటు పరిగెడుతు ఏడిపించసాగాడు.
(21) 3-637-సీ.
తుదమొదళ్ళకుఁ జిక్కి దునిసి పాఱఁగ మోరఁ;
గులశైలములఁ జిమ్ముఁ గొంత దడవు
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులువోవఁ;
గొమ్ములఁ దాటించుఁ గొంతద డవు
జలధు లేడును బంకసంకులం బై యింక;
ఖురముల మట్టాడుఁ గొంత దడవు
నుడురాజు సూర్యుఁడు నొక్క మూలకుఁ బోవఁ;
గుఱుచ వాలము ద్రిప్పుఁ గొంత దడవు
3-637.1-తే.
గునియుఁ గుప్పించి లంఘించుఁ గొప్పరించు
నెగయు ధరఁ ద్రవ్వు బొఱియఁగా నేపురేగి
దానవేంద్రుని గుండెలు దల్లడిల్లఁ
బంది మెల్లన రణపరిపంథి యగుచు.
భావము:-
కొంతసేపు తుదా మొదలూ ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ, కొంతసేపు బ్రహ్మాండభాండం పగిలి చిల్లులుపడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ, కొంతసేపు సప్తసముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ, కొంతసేపు చంద్రుడూ సూర్యుడూ ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ...తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై....
(22) 10.1-324-క.
తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
గఱపించి నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
భావము:-
ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి.
(23) 10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె;
వెఱ్ఱుల కైనను దలంప? విప్రవరేణ్యా! "
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమా! శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుఱ్ఱుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెఱ్ఱివాడైనా తృప్తిచెంది ఇంక చాలు అనుకోగలడా? ఊహు అనుకోలేడు."
(24) 10.1-377-సీ.
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు;
తలఁచెదు గట్టైనఁ దరల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె;
దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు;
రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె;
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు;
ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
10.1-377.1-ఆ.
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గల్కిచేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి."
భావము:-
ఒరే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్స్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరపర్వతాన్ని ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రాజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకఱ్ఱ పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా). ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.
చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి."