పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : **పై రెండు పుటలు పనిచేయుటలేదు*
ముందుమాట

ఓం

భాగవత స్తుతులు

[పోతన తెలుగు భాగవతము నుండి గ్రహీతము]


సంకలనంభాగవత గణనాధ్యాయి


2022


ఓం సహనావవతు! సహనౌభునక్తు!
సహవీర్యం కరవావహై!
తేజస్వి నావధీతమస్తు! మా విద్విషా వహై!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ముందుమాట

  భాగవతము భగవల్లీలా ప్రథానమైనది. మూలంలో, విభిన్న సందర్భములలో విభిన్న వ్యక్తుల ద్వారా పరమ అద్భుతమైన స్తుతులు అనేకం ఆవిర్భవించాయి. ఆంధ్రీకరించిన జాతీయ మహాకవి సహజ కవి బమ్మెఱ పోతనామాత్యులవారు భక్తి ప్రపత్తులకు మారుపేరు. అపర వ్యాస అవతారుడ. ప్రహ్లాద తుల్యుడు తెలుగులోకి వారి ఘంటంలోనుంచి జాలువారిన ప్రతి స్తుతి అనర్ఘరత్నమే.

  తెలుగు భాగవతము నందలి అట్టి పరమ పవిత్ర స్తుతులను భక్తులకు ఉపాసనాపరులకు ఉపకరించే రీతిలో చేసిన సంకలనం ఇది.

  భారతీయ వాఞ్మయము తాత్విక, ధార్మిక సూత్రాలతో జనజీవనంలో పెనవేసుకున్న సమాజంలో వికసించినది. అట్టి భారతీయ వాఞ్మయమునందు అతృష్కృష్టమైనవి, మూల స్తంభముల వంటివి ఇతిహాస పురాణములు. పరమ ప్రమాణికమైన గ్రంథములుగా ఈనాటికిని చూడబడుతున్నవి. వీనిలో తాత్వికాంశంతోపాటుగా అంతర్లీనంగా భక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందులోనూ మహాభాగవత పురాణం భక్తి ప్రపత్తులకు పెద్దపీట వేసిన గ్రంథరాజము. బమ్మఱ పోతనామాత్యుని గంటం రాపిడికి భక్తి ప్రపత్తులు బాగా మఱుగు పెట్టబడి వజ్ర సదృశంగా భక్తుల మనసులను రంజింపజేస్తున్నాయి. భక్తి సాహిత్యంలో స్తుతులు, స్తోత్రాలు, మంత్రాలు ప్రథానమైనవి, మహిమాన్వితమైనవి. స్తోత్రాలు వాటి ఫలములు అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పి అనుసంధానం చేయమని చెప్తారు. . అలా అనుసరించి పాడైనవారు లేరు అన్నది జగమెరిగిన సత్యం. స్తుతులు స్తోత్రాలు వివిధ ప్రక్రియలలో లభ్యమవుతున్నా, పద్యరూపంలో ఉన్నవి ముందునుంచీ బహుళ ప్రచారంలో ఉన్నాయి.

  తెలుగు భాగవతము మంత్రపూరితమైది. గాయత్రిని అధికరించినది అని పౌరాణికుల ప్రమాణం. చతుర్విధ పురుషార్థ ఫలప్రదమైనది. భాగవతము మోక్షశాస్త్రంగా ధర్మశాస్త్రంగా కీర్తింపబడే మహా పురాణరాజము. పురాణానుండే ప్రాథమికంగా స్తోత్రాలు బహుళ ప్రాచుర్యం పొందాయి అంటారు. అట్టి భాగవత స్తుతులు కుంతి స్తుతి, భీష్మ స్తుతి, భ్రమర గీతలు, శ్రుతి గీతలు, గజేంద్రుని మొరలు ఇలా ఎన్నో దేని ప్రత్యేకత దానిది. ఇవి భక్తి ప్రపత్తులు పొంగి పొర్లేవీ, తాత్విక విషయభారమైనవి. కొన్ని బహు సరళమైనవి, కొన్ని చాలా ప్రౌఢంగా ఉండేవి. స్తుతి, స్తోత్రాలు ఎలాంటివైనా భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవి, భక్తులకు బహుళ ప్రయోజనకర మైనవి. అట్టి అనంతమైన మన స్తోత్ర వాఞ్మయములో మణిపూసలుగా ఈ భాగవత స్తుతులు విరాజిల్లుతున్నాయి. వీటిని వివిధ అవసరాలకు అనుసంధానించడం అన్నది ఎప్పటినుంచో ఉన్నది. కనుక, పోతన తెలుగు భాగవత పురణాంతర్గతంగా లభించే స్తుతులు ఒకచోట ఉంటే వాడుకరులకు మిక్కిలి అనుకూలంగా ఉంటుందని ఈ భాగవత స్తుతులు సంకలనం చేయడము అయినది.

  ఈ భాగవత స్తుతులు గ్రంథము భక్తకోటికి ఉపకరిస్తుందని, అందరూ ఆ పరమాత్మ కృపకు పాత్రులు కాగలరు గాక.

     - ఊలపల్లి సాంబశివ రావు

ఓం నమో భగవతే వాసుదేవాయః

సౌజన్యం: తెలుగుభాగవతం.ఆర్గ్ http://telugubhagavatam.org