పద్య మధురిమలు : భాగవతంబు సర్వరసబంధురమున్
భాగవతంబు సర్వరసబంధురమున్
ఉ.
ఉ.
“బాగవతంబు సర్వరసబంధురమున్ దెలిగించినాఁడు స
ర్వాగమసారవేది జఠరార్థముగాఁ జెయిసాఁచకే మహా
భాగుఁ డితం” డటంచు నరపాలురు మెచ్చఁగ జీవితంబు సొం
పౌ గతి నోమినాఁ డితరు లౌదురెపోతన వంటి సత్కవుల్!
- తిరుపతి వేంకట కవులు,చాటు పద్య సంపుటము.
వేదాల సారములన్నీ ఔపోసన పట్టిన ఆ మహానుభావుడు, రసాలు సర్వం ఒప్పి ఉండెడి భాగవతమును, ఉదరపోషణార్థం చేయిచాపకుండా, మన తెలుగు భాషలోకి తెచ్చాడు. అని అంటు లోకంలో మహారాజులు సైతం మెచ్చుకునేలా, అలా దమ్మిడీ కూడ ఆశించకుండా ఆంధ్రీకరించాడు. ఇతర కవీశ్వరులు ఎవరు కూడ బమ్మెర పోతనామాత్యుని అంత సొంపుగా, వ్రతము నోచినంత పవిత్రంగా తమ జీవితాన్ని గడపలేదు.
తిరుపతి వేంకట కవులు జంటగా ఆధునిక సాహిత్య ఆకాశంలో మిలమిలలాడే తారలు. వారు ఆశువుగా పద్యాలు చెప్పటంలో, అవధాన ప్రక్రియలో సాటిలేని వారు. వారి ఈ చాటు పద్యంలో మాధుర్యం బహు చక్కగా ఉంది. భాగవతాన్ని, పోతనను ఎంత లోతుగా అధ్యయనం చేసారో, ఇంత విశిష్ఠమైన విశ్లేషణ చేయటానికి.
బాగవతంబున్ = భాగవతమును; సర్వరస = నవరసాలు అన్నీటితో; బంధురమున్ = ఒప్పిదమైనదానిని; తెలిగించినాఁడు = తెలుగులోకి అనువదించాడు; సర్వ = సమస్తమైన; ఆగమ = వేదముల యొక్క; సార = సారములను; వేది = తెలిసినవాడు; జఠరార్థముగాన్ = ఉదరపోషణార్థమై; చెయిసాఁచకే = ఎవరినీ (మహారాజులు కోరినా కూడా) ఏమీ అడగకుండా, తీసుకోకుండా; మహాభాగుఁడు = మహానుభావుడు; ఈతండు = ఇతను; అటన్ = అని; అంటున్ = అంటూ; నరపాలురు = మహారాజులుసైతం; మెచ్చఁగ = మెచ్చుకొనేలా; జీవితంబున్ = జీవితమును; సొంపు = ఒప్పిదము; ఔ = అయ్యే; గతిన్ = విధముగా; నోమినాఁడు = వ్రతము నోచి నట్లు గడిపినాడు; ఇతరులు = ఇతరకవులు; ఔదురె = అవుతారా; పోతన = బమ్మెర పోతనామాత్యుని; వంటి = వంటి; సత్కవుల్ = ఉత్తమ కవులు.